Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

బ్రహ్మోత్సవాలు Brahmotsava


బ్రహ్మోత్సవాలు (1)

శ్రీనివాసునికి అత్యంత ప్రియమైనది బ్రహ్మోత్సవం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీమన్నరాయణుడే తిరుమలపై ప్రత్యక్షంగా వెలసిన శ్రీ వేంకటేశ్వరునికి ప్రతి సంవత్సరమూ ఆశ్వయుజ మాసమునందు శుక్లపక్షమున శ్రవణా నక్షత్రమునందు, చక్రస్నానమును సంకల్పించి 9రోజులముందుగా ధ్వజారోహణము చేస్తారు. తరువాతి 9రోజులు ఆయా నిర్ణీత వాహనములలో శ్రీ స్వామివారికి ఉత్సవములు జరుగును. 3 సంవత్సరాలకు ఒకమారు అధిక మాసము వచ్చినప్పుడు, 2పర్యాయములు బ్రహ్మోత్సవాలు జరుగును. అంటే,కన్యామాసము ఆశ్వయుజ మాసము ఐనప్పుడు ఆశ్వయుజమాసము నందు, విజయదశమినుండి 9 రోజులును, కన్యామాసము భాద్రపద మాసమైనపుదు భాద్రపద, ఆశ్వయుజ మాసములందు 2 బ్రహ్మోత్సవమలు జరుగును.చతుర్ముఖబ్రహ్మ స్వయముగా ఈ బ్రహ్మోత్సవము జరిపించినట్లు వరాహ పురాణము నందు చెప్పబడినది.
మొదటిసారిగా ఈ ఉత్సవములు క్రీస్తుశకము 830వ సంవత్సరంలో జరిగినట్లు శిలాశాసనములు ద్వారా తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్య స్థాపన తరువాత, సుమారు 1404 సంవత్సరంలో విజయనగర రాజ్యాధిపతి రెండవ హరిహరరాయలు శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిపించినట్లు శాసనములు ద్వారా తెలియుచున్నది. ఈ ఉత్సవాలకై నూరు ఫణములు దేవస్థాన ఖజానాకు ప్రతీ సంవత్సరం జమయగునట్లు రాయలు ఆదేశించెను. శ్రీ ముల్లై తిరువేంకటజియరు అను వైష్ణవ పీఠాధిపతిని నియమించెను. 
వేంకటేశ్వర స్వామితో సాళువ నరసింహుని కుటుంబంగా భావించబడిన శిల్పం.
ఇది అలిపిరిలోని మండపాలలో ఉంది. (ఎడమనుండి కుడికి సాళువగుండ, సాళువనరసింహుడు, తల్లి మల్లాంబికా, వేంకటేశ్వరస్వామి, పుత్రులు : కుమార నరసింహుడు, పెరియతంగమన్, చిక్కతంగమన్)
తరువాతి కాలంలో సాళువ నరసింహరాయలు శ్రీనివాసునికి చేసిన సేవలు అమోఘం. 1417 సంవత్సరములో డొలోత్సవములు 5రోజులు జరుగునట్లు ప్రారంభించెను. వేంకటేశ్వరుని తెప్పోత్సవమును కూడా సాళువ నరసింహరాయలే ప్రవేశపెట్టెను. ఈయన కాలంలో ఆరున్నొక్క బ్రహ్మోత్సవాలు జరుగుట ఆచారముగా ఉండెడిది. ఏడవరోజు శ్రీవారికి, ఉత్సవదేవేరులకు 4అప్పపడులు (అప్పాలు)నైవేద్యము పెట్టి, 4 తిరువీధుల మూల్లలో కట్టబడిన ఎత్తైన మంటపమునందు ఉత్సవమూర్తులకు నైవేద్యము ఇచ్చునటుల ఏర్పాటు చేయబడినది.(ఈ అప్పపడి నైవేద్యం సాళువరాయలు, అతని ముగ్గురు కుమారుల ఙ్ఞాపకార్ధం ఏర్పాటుచేసారు)1539వ సంవత్సరంలో తిరుపతి నగరపాకకుడైన పెరియసామిశెట్టి, ఉత్తన నల్లూరు అను గ్రామమును ఆ దేవదేవుడికి సర్వమాన్యముగా ఇచ్చి, ఆ ఆదాయములో గోవిందరాజుస్వామి వారికి సంవత్సరములో 2నెలల్లోనూ, మిగిలిన 10 నెలలలో తిరుమల శ్రీనివాసునికే బ్రహ్మోత్సవములు చేయునటుల ఏర్పాటు చేసెను. ఆ రోజులలో బ్రహ్మోత్సవాలు 12రోజులు జరిగేవి.
ఆ తరువాత కొద్దికాలానికి అన్నమాచార్యుల కుమారుడైన తాళ్ళపాక తిరుమలయ్యకు విజయనగరాధీశుడైన సదాశివరాయలు, ముత్యాలపట్టు అను గ్రామమును దానముగా ఇచ్చాడు. తిరుమలయ్య ఆ గ్రామమును శ్రీనివాసునికి 3-7-1545 లో ధర్మముగా ఇచ్చి బ్రహ్మోత్సవములు ఏర్పాటుచేసెను.

బ్రహ్మోత్సవాలు (2)
ప్రస్తుతం వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం, తిరుమలలో జరుగు శ్రీవారి బ్రహ్మోత్సవాలు 9రోజులపాటు అత్యంత వైభవంగా జరుపబడుతున్నాయి. ఈ 9 రోజులు ముల్లోకాలలోని దేవతలూ, దివ్య శరీరాలతో మహర్షులూ తిరుమలలోనే ఉంటారు. తిరుమల "గోవిందా, గోవిందా "అంటూ ఆ నారాయణుడి నామస్మరణతో మారుమ్రోగిపోతూంటుంది. సర్వసేనాధిపతి విష్వక్సేనుల వారికి తిరువీధులలో వైభవంగా ఊరేగింపు నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. విష్వక్సేనుల వారిని పల్లకీలో కూర్చొండబెట్టి, ఉత్సవాలకు బ్రహ్మాది దేవతలకు ఆహ్వానించడానికై, తిరుమల మాడ వీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున రాత్రి పెద శేషవాహనం. శ్రీవారికి ఆదిశేషుడు అత్యంత ప్రియభక్తుడు.ఆదిశేషునికి ఉన్నంత కైంకర్యనిరతి మరెవరికి లేదు. ఆదిశేషుడే స్వయముగా శేషాద్రిగా వెలసి స్వామివారిని తన శిరస్సుపై సర్వవేళలా ఉంచుకుంటూ జగత్ కళ్యానానికి తోడ్పడుతున్నడు. అంతటి ప్రియభక్తుడైన ఆదిశేషుని పై మాడవీధులలో ఊరేగి వెళ్ళడం శ్రీవారికి అత్యంత ప్రియం.
రెండవరోజు రాత్రి హంసవాహనసేవ. హంస పవిత్రతకు మరోరూపం. భగవంతుడు హంసరూపాన్ని ఎన్నుకుని వేదాలని ఉపదేశించాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. మూడవరోజు ఉదయం సింహవాహనం పై శ్రీవారు తన భక్తులకు దర్శనమిస్తాడు. సింహం శౌర్యానికి, గాంభీర్యానికి, పరాక్రమానికి ప్రతీక. శ్రీమన్నారాయణునికి ప్రీతిపాత్రమైన ఈ సింహరూపంలోనే నరసిం హరూపంలో కశిపుడిని సం హరించాడు. అదేరోజున ముత్యపు పందిరి వాహనంపై కూడా ఆ దేవదేవుడు కొలువుదీరి భక్తకోటిని కటాక్షిస్తాడు.

4వ రోజు కల్పవృక్ష, సర్వభూపాల వాహనోత్సవాలు జరుగుతాయి. శ్రీవారు ఆ రోజు నయనాందకర రీతిలో దర్శనం ఇస్తారు. ఇక బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులను తరింపచేస్తారు. ఎంతటి ముగ్ధమనోహరరూపం, వర్ణించనలవి కానిది. ఆ రోజు సాయంత్రం బ్రహ్మోత్సవాలలో అతి విశిష్టమైన గరుడోత్సవం జరుగుతుంది. గరుడుడు శ్రీవారి ప్రధమ భక్తుడు. శ్రీవారి ఆఙ్ఞ కోసం జాగురూకుడై ఉంటాడు. వేదాలే గరుడుడని శాస్త్రోక్తి. ఆనందనిలయంలో శ్రీ శ్రీనివాసుడు ఉభయదేవేరులతో కూడి బ్రహ్మోత్సవాల 10 రోజులూ తిరుమాడవీధులలో వివిధ వాహనోత్సవాలలో దర్శనమిచ్చి భక్తకోటిని తరింపచేస్తాడు. 
ముక్కోటి దేవతలు ఆదృశ్యరూపాలలో శ్రీవారిని సేవిస్తూ, ప్రతీరోజు జరుగుతున్న ఉత్సవాలలో పాల్గొంటూ, తమ భక్తిని నివేదిస్తారు. మరొక విశేషమేమిటంటే, భక్తుల కోరికలను ఆయా దేవతలు తెలుసుకుని వారే తీరుస్తారు. శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చిన భక్తుల మనోభీష్టాలు తెలుసుకొని తమ విధులద్వారా నిర్ణయించబడిన విధంగా వీలైన కోరికలు తామే తీర్చి, శ్రీనివాసుని ప్రసన్నతకు లోనవుతారు. ఈ విధముగా ఆయా దేవతలు చేయుట కూడా శ్రీనివాసుని ఉద్దేశ్య ప్రేరణ పూరితముగానే అని గ్రహించవలెను. ఆ శ్రీవారి లీలలు చిత్రవిచిత్రములు గదా.

బ్రహ్మోత్సవాలు (3)

బ్రహ్మోత్సవాలలో ఉభయ దేవేరులతో కూడిన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ దేవాదిదేవుడిని అన్నమాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు.
తిరువీధుల మెరసీ, దేవదేవుడు
గరిమలమించిన సింగారముల తోడను ||
తిరుదండెలపై నేగీ దేవుడిదే తొలునాడు
సిరులు రెండవనాడు శేషుని మీద
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరి నాలుగోనాడు పువ్వుగోవిలలోన ||
గక్కున నయిదవనాడు గరుడుని మీదను
యెక్కెను ఆరవనాడు యేనుగు మీదను
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును గుఱ్ఱ మెనిమిదోనాడు ||
కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట
యెనసి శ్రీ వేంకటేశుడింతి యలమేల్మంగతో
వనితల నడుమను వాహనాలమీదను.
అంటూ ఎంతో మధురంగా వర్ణించాడు. ఒక్కసారి ఐనా బ్రహ్మోత్సవ సమయంలో ఆ వెంకన్నను దర్శనం చేసుకొవాలి.
ఏడుకొండలవాడా , వెంకటరమణా గోవిందా..గోవిందా..

Popular Posts

Popular Posts

Ads