Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శ్రీమద్భాగవతం Bhagavatham Telugu (భాగవతం) Part 07

శ్రీమద్భాగవతం - 61 వ భాగం



‘నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయిపోయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహా ప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయిపోయాయి. ఇంతకుముందు 99యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది’ అన్నాడు. ఇపుడు బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి ‘ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటాను అని చెప్పలేను. అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది నేను చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది~ ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమే. కానీ నేను మూడు రకములుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళదగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఎవరు నన్ను కోరుకుంటుంటారో వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను’ అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి పిల్లవాడా! నిన్ను చూస్తె నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వటువువి. నేను చక్రవర్తిని కాబట్టి నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. కాబట్టి నీకు ఏమి కావాలో కోరుకో’.

వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో 
హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో 
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక ఏమడిగెదో దాత్రీ సురేంద్రోత్తమా!!

ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిచ్చేస్తాను’ అన్నాడు. అపుడు వామనుడు నవ్వి ‘నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. కాబట్టి నాకు నీవు ఇవ్వగలిగినడేమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడు అని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చాను అని అంటే నేను బ్రహ్మానందమును పొందేస్తాను. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను’ అన్నాడు. 

అపుడు బలిచక్రవర్తి ‘నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండముల నన్నిటిని జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితె అది ఇస్తాను’ అన్నాడు.
వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు 

గొడుగో. జన్నిదమో, కమండలువొ. నాకున్ ముంజియో, దండమో, 
వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె 
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

‘అవన్నీ ఇస్తానంటావేంటయ్యా! నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకెందుకు ఇవన్నీ? నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు’ అన్నాడు. అపుడు బలిచక్రవర్తి 

ఓ వతువా! ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ, బంగారు చెంబుతో నీళ్ళు పొయ్యి, ఆ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోసేస్తాను. నీళ్ళు పట్టుకొని రా’ అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొందిపోతూ నీళ్ళు పట్టుకు వద్దామని లోపలి వెళుతోంది. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అపుడు అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చారు. రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట యిచ్చావా? అని అడిగాడు. అపుడు బలిచక్రవర్తి ‘గురువుగారూ, ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగాడు. ఇస్తానన్నాను’ అన్నాడు. అపుడు శుక్రాచార్యులు ‘రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకున్తున్నాడు. ఎందుకు పుచ్చుకుంతున్నాడో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. కాబట్టి నీజోలికి రాలేడు. అందుకని నీతో యుద్ధం చేయకుండా ఇప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును లాగి ఇంద్రునకు ఇస్తాడు. అందుకని మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టను అని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాట యిచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను. 

వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు 
జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప!!

శుక్రాచార్యుల వారు రాక్షస నీటి చెప్పారు. మనం చేయకూడదు. దానిని ప్రాణ భయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగా ఆయన చెప్పారు. అంతేకానీ ఈనీతి మనందరి కోసం కాదు. ఆయన చెప్పిన విషయం ‘ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు.దాని వలన పాపం రాదు. అందుకని మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగు కూడా ఇవ్వకు. ప్రమాదం. ఆయనను నమ్మకు’ అన్నాడు.
అంటే బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి ‘ఎంతమాట అన్నారు! లక్ష్మీ నాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు. 
ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై 
బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ 
ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్ 
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!!

‘ఆయన చేయి లక్ష్మీ అమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆచేయి ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి చేతితో ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాను. ఒక్కొక్క సారి ఆ చేతితో ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేటట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతోంది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు’.
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ. 
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై. 
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!!

‘ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. అంతేకానీ ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా! నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాట పోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను అటువంటి జాబితాలో చేరను. నేను దానం చేసేస్తాను’ అన్నాడు. అపుడు శుక్రాచార్యుడు ‘నేను నా తపశ్శక్తితో అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేశాను. ఇవాళ మళ్ళీ నీవు నీ గురువు మాట కాదన్నావు. కాబట్టి ఇపుడు నిన్ను శపిస్తున్నాను. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు గాక!’ అని శపించాడు.




శ్రీమద్భాగవతం - 62 వ భాగం



వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారు పళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి అక్కడ కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ అమృత పాత్ర నాగలి అలాంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లని పాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూశాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదమేదున్నదో ఆ పాదమును చూశాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాడు. చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకోని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూశాడు. బాలి చక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నాడు. కానీ నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి, చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచే సరికి కళ్ళు పెట్టి చూస్తున్న శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది అపుడు బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసేశాడు.

వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.
ఇంతింతై వటుడింతై. ఇంతింతై, వటుడింతై, మరియు తానింతై, నభోవీధి పై
నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై
నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై!!

పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పడి అంగుళములు పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలో నుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు. 

రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై శిరోరత్న మై 
శ్రవ ణాలంకృతి యై గళాభరణ మై సౌవర్ణ కేయూర మై. 
ఛవిమ త్కంకణ మై కటిస్థలి నుదంచ ద్ఘంట యై నూపుర. 
ప్రవరం బై పదపీఠ మై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్!! 

వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా ఉంది. తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. అపుడు సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయిపొయింది. ఇంకా దాటారు అపుడు పాదములకు పెట్టుకున్న అందెలా అయిపొయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్ర పీతలా అయిపోయిందట. అనగా బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు. 

ఆయన బలి చక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది” అని అడిగాడు. అపుడు బలిచక్రవర్తి 
సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల; నాకు బొంకు లేదు; 
నీ తృతీయ పదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!! 

నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించదానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. అపుడు బలిచక్రవర్తి ‘వేళకాని వేళా క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు నకు ఈ సిరిని ఇచ్చాడో వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. కాబట్టి మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసి కూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథ రక్షకుడని పేరు. నీ సన్నిధానంలో నేను అనాథను కావడమా! నాకు భర్త్రు భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు. 

పది దిక్కులా వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. ఇపుడు బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వచ్చాడు. బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడు. ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ!ఎంత వరమును ఇచ్చావు’ అన్నాడు. 

అపుడు శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను ఇప్పుడు వీనిని రక్షించాలి. వానిని వరుణ పాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు. కాబట్టి అతనికి నేను ఏమి యిస్తానో తెలుసా? సావర్ణి మనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాణి ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము. కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుంటాను. నాలో కలిపేసుకుంటాను. అప్పటి వరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పది దిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు. ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ లేకుండా ఉంటాడు’ అన్నారు. 

మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. కానీ ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భ్రుగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి యిప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు యింత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం యిస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణ పాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణి మనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను. 

‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి యిచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు. 

ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లి ఇంతే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసమునిస్తాను. వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి’ అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు. 
ఇది అంత పరమ ప్రఖ్యాతమయిన ఆఖ్యానము.




శ్రీమద్భాగవతం - 63 వ భాగం



నవమస్కంధము – అంబరీషోపాఖ్యానము 

అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమయిన విషయము. అంబరీషుడు నాభాగుని కుమారుడు. నాభాగుడు అనే చక్రవర్తి సామాన్యుడు కాదు. ఆయన చాలా గొప్ప రాజు. అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి సహజముగా కొన్ని గుణములు అలవడ్డాయి. ఆయన పాటించిన గుణములు మనందరం మన జీవితములలో పాటించవలసినవి. తపస్సు చేయడం ఎంత గొప్పదో తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడం అంత భయంకరమయిన విషయము. చాలా గొప్ప అధికారం వుండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమయిన వ్యక్తి. ఒక మహర్షి శాపమును ఇస్తే దానిని తప్పుకున్న వాడు మనకి కనపడడు. కానీ అంబరీషుడు మాత్రం అటువంటి మహర్షి శాపము నుండి తప్పించుకున్నాడు. అదీ ఈ చరిత్రకు ఉన్న గొప్పతనం. 

అంబరీషుని చిత్తము ఎప్పుడూ శ్రీమహావిష్ణువు పాదములను పట్టుకుని ఉండేది. అనగా ఆయన పరిఢవిల్లిన భక్తిచేత ఉన్నాడు. ఏది మాట్లాడినా హరి గుణములను వర్ణన చేస్తూ ఉంటాడు. ఆయన చెవులు ఎప్పుడూ మాధవుని కథా శ్రవణము వినడానికి ఉత్సాహమును పొందుతూ ఉండేవి. అంబరీషుడు భగవంతుని ముందు వంగి నమస్కరించే శిరస్సు ఉన్నవాడు.భగవంతుడిని నమ్ముకున్న భాగవతులు కనపడితే వారి పాదముల వాసన ముక్కుకు పట్టేటట్లు వారి పాదముల మీద పడేవాడు. వారి పాదముల నుండి వెలువడే పద్మముల సువాసనను ఆయన ఆస్వాదించేవాడు. అంబరీషుడు రసేంద్రియమును గెలవగలిగాడు. ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఈశ్వరుని యందు మగ్నమై ఉండేవాడు. అయినా ఆయన రాజ్య పాలనమును విస్మరించలేదు. అంబరీషునికి అంతఃపురముల మీద కోరిక లేదు. ఏనుగుల మీద, గుర్రముల మీద, ధనం మీద, ఉద్యాన వనముల మీద, కొడుకుల మీద, బంధుమిత్రుల మీద రాజ్యం మీద, భార్య మీద, అంతఃపురము మీద కోరిక లేదు. కానీ వీటి అన్నింటితో ఉన్నాడు. దీనినే కర్తవ్య నిష్ఠ అంటారు. ఆయా విషయముల యందు వెర్రిగా వ్రేలాడడం లేదు. 

అలా పరమ పవిత్రమయిన జీవితమును గడుపుతున్న స్థితిలో అంబరీషుడు సరస్వతీ నదీ తీరంలో అశ్వమేధ యాగం చేశాడు. దానికి వసిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ సేవించాడు. భూరి తాంబూలములను ఇచ్చాడు. ఒక సంవత్సరం పాటు ద్వాదశీ వ్రతము చెయ్యాలని అనుకున్నాడు. ఏకాదశీ వ్రతమునకు, ద్వాదశీ వ్రతమునకు తేడా ఏమీ లేదు. దశమి నాటి సాయంత్రము నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసము అంటే ‘అశనము’ అని శాస్త్రంలో ఒక మాట ఉంది. అశనము అంటే వ్యక్తికీ క్రిందటి జన్మలలో ఉన్న దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యము ఉన్నా, ఆకలి వేస్తున్నా తినుండా తనని తాను ఒకరోజు మాడ్చుకోవడం. ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్త్వికమయిన పదార్ధం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్చితమయిన సాత్త్వికమయిన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే దానిని ఉపవాసము ఉంటారు. అంబరీషుడు ఏకాదశీ వ్రతమును చేస్తున్నాడు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి. ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా పదార్థములను తినేయ్యడాన్ని పారణ అంటారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పు లేదు. నిత్యానుష్ఠానం చేసేసుకుని ద్వాదశి నాడు భోజనం చేసేయవచ్చు. అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశీ వ్రతమును పూర్తి చేసేశాడు. ఏకాదశి తిథి అయిపొయింది తెల్లవారి సూర్యోదయం అయింది. సంవత్సరకాలం పాటు చేసిన ఏకాదశీ వ్రతం పరిపూర్ణమయింది. యజ్ఞమును పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా మీరు ఆపివేసినట్లయితే ఆ యజ్ఞం పూర్తి అయినట్లు లెక్కకు రాదు. యజ్ఞభ్రంశం అయిపోతుంది. ఇక్కడ ఏకాదశీ వ్రతం పూర్తి అవుతోంది. ఎలా పూర్తి కావాలి? వీళ్ళు ద్వాదశి తిథి వుండగా భోజనం చేయాలి. తాము భోజనం చేసేముందు ఏడాది పాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళిందీ నది ఒడ్డుకు వెళ్ళి నదీ స్నానం చేశారు. అనంతరం మధువనం లోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశారు. అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. వారికి దానములను ఇచ్చారు. వారికి కడుపు నిండా భోజనం పెట్టాడు. వాళ్ళందరూ కడుపు నిండా తినిన తరువాత యితడు ద్వాదశి పారణం చేయాలి. తనుకూడా భోజనం చేయాలి.

అందరి భోజనములు పూర్తి అయిన తరువాత తాను భోజనం చేద్దామని సిద్ధ పడుతుండగా అక్కడికి దుర్వాసో మహాముని వచ్చారు. దుర్వాసుడు సర్వకాలముల యందు వేదముల యందు వేదాంతముల యందు బుద్ధిని నిక్షేపించిన వాడు. గొప్ప తపస్సును పాటించిన వాడు. సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినటువంటివాడు. వచ్చిన దుర్వాసో మహర్షిని అంబరీషుడు ఈశ్వరునిగా భావించాడు. పొంగిపోయి ‘అయ్యా! ఊరకరారు మహాత్ములు! ఇవాళ నేను చాలా అదృష్టవంతుడిని. నీవు శివాంశ సంభూతుడివి. నీవు నా యింటికి అతిథిగా వచ్చావు. ఏమి నా భాగ్యము. ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారణ. మీరు కూడా మహాత్ములు కనుక ముందు వచ్చి భోజనం చేయాలి. మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను. మీరూ నేనూ తొందరగా భోజనం చేయాలి. ద్వాదశి కాబట్టి మన యిద్దరికీ యిదే ధర్మం. కాబట్టి మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్త శేషమును నేను తింటాను’ అన్నాడు. దుర్వాసో మహర్షి అలాగే వస్తాను అని తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. ఆయన యమునా నదీ జలములలో స్నానమునకు దిగాడు. ఇక్కడ మాయ కమ్మింది. దుర్వాసో మహర్షి మహా భక్తుడు. ఈశ్వర ధ్యానమునందు సమయమును మరచిపోయి జలములలో ఉండిపోయాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. ఇపుడు అంబరీషునికి ఇబ్బంది వచ్చింది. అతను పారణ చేయాలి. లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేలోపల పారణ చేయకపోతే వ్రతభంగం అయిపోతుంది. వ్రత భంగం అయిపోతే ఆటను మరల ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులను పిలిచాడు. సభలో వున్న మహా పండితులను పిలిచాడు. విద్వాంసులు ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ‘ఆయన చూస్తే మహర్షి, ధ్యానంలో ఉన్నాడు. పిలవకూడదు. నీవు చూస్తే గృహస్థు. వ్రతం చేసి వున్నావు. భంగం జరుగ కూడదు. పోనీ పారణ చేసేయ్యడమే కదా అని నీవు ముందు తింటే వచ్చిన అతిథికి నీవు మహా అవమానము చేసినట్లు అవుతుంది. కాబట్టి తినకూడదు. తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది. కాబట్టి నీకు మధ్యే మార్గం ఒకటి చెపుతాము. సలిలము పుచ్చు’ అన్నారు. అంటే కాసిని నీళ్ళు తాగమన్నారు. అయితే ‘నేను కొద్ది నీళ్ళు పుచ్చుకుంటాను ఆయన తినగా మిగిలిన శేశామునే నేను భోజనముగా తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది అందుకని నీళ్ళు ఒక్కటే పుచ్చుకుంటాను’ అని ఆయన నీళ్ళను పుచ్చుకున్నాడు. 

ఇలా ఇక్కడ నీళ్ళు పుచ్చుకోగానే దుర్వాసో మహర్షి ధ్యానంలోంచి బయటకు వచ్చారు. ధ్యానంలోంచి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకు వచ్చి గబగబా అంబరీషుని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఎదురువచ్చి అయ్యా! ద్వాదశి తిథి వెళ్ళిపోబోతోంది. మీ గురించే చూస్తున్నాను. ముందు మీరు భోజనమునకు కూర్చోండి. తరువాత నేను చేస్తాను’ అన్నాడు. ఇపుడు దుర్వాసుడు అంబరీషుడు నీళ్ళు తాగాడు అని లోపల తెలుసుకుని కోపం వచ్చింది. ఆయనకు ఒక పక్క లోపల ఆకలి. ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనే దుగ్ధ. రెండూ కలిసి ‘ఇంత మహర్షిని నేను నీకు ఇంత చవకబారు వానిలా కనపడ్డానా? పిలిచి ముందు నువ్వు తాగి నాకు నీ యింట్లో అన్నం పెడతావా? అంటే నీ భుక్త శేషం నేను తింటున్నాను. నా భుక్త శేషం నువ్వు తినడం లేదు. ఇది నాకు అవమానము. కాబట్టి నిన్ను ఉపేక్షించను. నీవు విష్ణు భక్తుడివా? చూడు నిన్ను ఏమి చేస్తానో. ఇప్పుడు నేను గొప్పో నీవు గొప్పో తెలియాలి’ అన్నాడు. కోపంతో చేతిలోకి నీళ్ళు తీసుకుని తన జటాజూటం నుండి జటనొకదానిని సమూలంగా పెరికి నేలకేసి కొట్టాడు. అందులోంచి భయంకరమయిన ఒక క్రుత్యను సృష్టించాడు. కృత్య అనేది ఆయన దేనిని చెపితే దానితో ఆకలి తీర్చుకుంటుంది. తన కళ్ళముందు కృత్య అంబరీషుని తినెయ్యాలని అనుకున్నాడు. హద్దులేని క్రోధమునకు వెళ్ళిపోయాడు. ఇపుడు ఆ క్రుత్యను ప్రయోగించాడు. ఈ కృత్య చేతిలో భయంకరమయిన శూలం పట్టుకుని ఆకలితో ఎగురుతుంటే భూమి గోతులు పడింది. భయంకరమయిన క్రోధంతో కృత్య అంబరీషుని మీద పడింది. దీనిని చూసి దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు. తాను బ్రాహ్మణుడు అయివుంది అవతల వారి స్థితి గమనించకుండా నిష్కారణమయిన కోపం పెంచేసుకుంటున్నాడు. ఆ కోపమునకు అందరూ బాధ పడుతున్నారు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తున్నాడు. ‘నాకు తెలిసి అపరాధం చేయలేదు. తెలియక చేసిన దోషము దోషము కాదు. నేను ధర్మం తప్పలేదు’ అని నమస్కారం చేస్తూ నిలబడి పోయాడు. ఇపుడు ధర్మాధర్మములకు ఫలితమును ఇవ్వగలవాడు కదలాలి. 

ఇపుడు సుదర్శనం కదిలింది. ఇపుడు ధర్మం అంబరీషుని యందు ఉన్నది. సుదర్శనం కదిలి కృత్య మీదకి వెళ్ళింది. కృత్య కాలిపోయింది. తరువాత సుదర్శనం బ్రాహ్మణుడి వెంట పడింది. ఇపుడు సుదర్శనమునకు వెన్నిచ్చి దుర్వాసుడు పరుగెత్తడం మొదలు పెట్టాడు. ఆయనకిప్పుడు ఆకలి, కోపము అన్నీ పోయి ప్రాణ రక్షణలోకి వచ్చాడు. దుర్వాసుడు పరుగెత్తి పరుగెత్తి బ్రహ్మలోకమునకు వెళ్ళాడు. అపుడు బ్రహ్మగారు మిక్కిలి చతురతతో ‘అయ్యో మహర్షీ, నీకు ఎంత కష్టం వచ్చింది? అంబరీషుడి జోలికి వెళ్ళావా? యిప్పుడు నీవు విష్ణు మూర్తి పాదములను ఆశ్రయించు. ఏ మహానుభావుడి కనుకొలకులు ఎర్రబడితే నా బ్రహ్మస్థానము ఊడిపోతుందో ఆ సత్యలోకము ఆగిపోతుందో అటువంటి వాని జోలికి నేను వెళ్ళలేను. ఆ చక్రమును నేను ఆపలేను’ అన్నారు. ఇపుడు దుర్వాసుడు కైలాసమునకు పరుగెత్తాడు. దుర్వాసుడు పరమశివుని అంశ. మహాదేవా! నీకన్నా గొప్పవాడెవడున్నాడు? నన్ను కాపాడవలసింది’ అన్నాడు. అపుడు పరమశివుడు ‘నాకూ, దక్షునికి, ఇంద్రునికి, ఉపేంద్రునికి, బ్రహ్మగారికి అర్థం కానిది ఏదయినా ఉన్నదంటే అది విష్ణు మాయ ఒక్కటే. అందుకని ఆయన సుదర్శనమును నేను ఆపలేను. వైకుంఠమునకు వెళ్ళి విష్ణువు కాళ్ళమీద పడి ప్రార్థించు’ అని అన్నాడు. ఇపుడు దుర్వాసుడు వైకుంఠమునకు వెళ్ళాడు. అక్కడ శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సభ తీర్చి ఉన్నాడు. దుర్వాసుడు వెళుతూనే శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తూ ఆయన పాదముల మీద పడిపోయి ఆయన రెండు కాళ్ళను తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని పాదముల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు. అపుడు ఆయన ‘ఏమిటయ్యా యిలా పడిపోయావు. ఏమయింది? లేవవలసింది’ అన్నాడు. ఆయనకు తెలియదా? సుదర్శనమును పెటినవాడు ఆయనే కదా! కానీ ఇప్పుడు ఏమీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడు. దుర్వాసుడు జరిగినది చెప్పి తనను రక్షించమని కోరాడు. అపుడు ఆయన ‘నాకు ఒక బలహీనత ఉంది. తీగలన్నీ పీకి తాడుచేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్లు నన్నిలా నిలబెట్టేసి తాళ్ళతో కట్టి లక్ష్మీదేవి ఉన్నాడని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలచుకుంటూ ఉంటారు. అలా పట్టుకుని వెళ్ళిపోయిన వారిలో అంబరీషుడు ఒకడు. నేనేకావాలి అని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందోనని దానివెనక ఆవు పరుగెత్తినట్లు నేను వానిని రక్షించుకుంటూ ఆ భక్తుని వెంట పరుగెడుతుంటాను. కాబట్టి నీ వెనుక వస్తున్నా నా సుదర్శన చక్రం అంబరీషుడిని రక్షిస్తోంది. వాడు బ్రాహ్మణుడా, తపస్సు చేశాడా, రాజా, కేవలం వ్రతం చేశాడా యివన్నీ నేను చూడను పరమ భక్తితో ఉన్నవాడికి నేను వశుడనయి ఉంటాను. అన్నిటితో వుంది అన్నిటిన్ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటాను.నాకు అది ఒక లక్షణము’ అన్నాడు. 

నీవు వానిపట్ల చేసిన టప్పుడు నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు కాబట్టి ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో అన్నాడు. ఇపుడు పరుగు పరుగున అంబరీషుని వద్దకు వెళ్ళాడు. దుర్వాసో మహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అంబరీషుడు. అదీ ఆయన ధర్మం అంటే. అంబరీషుని పాదములు పట్టుకుని ‘మహానుభావా! ఈ సుదర్శన చక్రదారల నుండి నీవే నన్ను రక్షించాలి’ అన్నాడు. అంతటి మహాత్ముడు తనవలన క్రోధమును పొంది అన్ని కష్టములు పడి తన కాళ్ళు పట్టుకొనినందుకు అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రమును ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనను వింటే మనలను తరుముకు వస్తున్నా దురితములనుండి మనం కాపాడబడతాము. సుదర్శన చక్రమునకు నమస్కరించి ‘కోరిన వాళ్లకి నా దగ్గర వున్నది లేకుండా యిచ్చిన వాడనయితే నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనయితే నేను చేసిన పూజలకు శ్రీమహావిష్ణువు సంతోషమును పొందిన వాడయితే నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి ప్రశాంతతను పొంది, శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలి పొడువు గాక!” అన్నాడు. దుర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటిని ఒట్టు పెట్టాడు. ఉత్తర క్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠమునకు వెళ్ళిపోయింది. 

దుర్వాసుడు ‘ఆహా! గృహస్థుగా ఉంటూ నీవు పొందిన దానిని నేను ఇన్ని ఏండ్లు తపస్సు చేసి పొందలేక పోయాను. ఆ శ్రీ మహావిష్ణువు నామము జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పినా, శ్రీమన్నారాయణుని పాదములకు నమస్కరించినా, వారిని ఏ కష్టములు అడ్డవు. నీవు అటువంటి మహానుభావుడవు. నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి. నీ వైభవము ఏమిటో నేను ఈ వేళ చూశాను. మిత్రుడవై రక్షించావు. ఇకనుండి నీపేరు అన్ని లోకములలో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్లకి శ్రీమన్నారాయణుని పాదములయందు భక్తి కలుగుతుంది’ అని అంబరీషుడిని స్తోత్రం చేస్తూ దుర్వాసో మహర్షి వెళ్ళబోయాడు. అపుడు అంబరీషుడు ‘మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు. మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్ధమును భుక్తశేషంగా భావించి నేను తింటాను. ముందు మీరు భోజనం చేయండి’ అన్నాడు. అపుడు దుర్వాసుడు పరమసంతోషంగా భోజనమునకు కూర్చున్నాడు. కాబట్టి క్రోధము ఒక్కటి వుంటే ఎంతటి దానిని ఎలా పాడుచేస్తుందో మనం గమనించాలి. అందువలన క్రోధము నొక్క దానిని ప్రక్కన పెడితే తపస్సులో యెంత కిందనున్న వాడయినా అంబరీషుడు ఏ స్థితిని పొందాడో మనం గ్రహించాలి. గృహస్థాశ్రమంలో ఉంది అంబరీషుడు సాధించిన విజయమునకు మనం అందరం పొంగిపోయి అంబరీషుని పాదములకు వేయి నమస్కారములు చేయాలి.

ఆ మహానుభావుడు అంబరీషుడు తదనంతరం తపస్సు చేసి ఈశ్వరుని పునరావృత్తిరహిత శాశ్వత నారాయణ సాయుజ్యమును పొంది తరించినాడు.




శ్రీమద్భాగవతం - 64 వ భాగం



శ్రీరామ చరిత్ర :
నవమస్కంధములో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమ స్కంధమును ప్రారంభం చేసేముందు నవమ స్కందములో రామాయణమును చెప్పారు. నవమ స్కందములో రామచంద్ర ప్రభువు సంకీర్తనము విశేషంగా చేయబడింది. ఇక్ష్వాకు వంశములో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే, సంతానం కలగడానికి ప్రతిబంధకమయిన పాపము పరిహరింప బడి, యజ్ఞపురుషుని అనుగ్రహము చేత లభించిన పాయస పాత్రలోని పాయసమును తన ముగ్గురు ధర్మపత్నులయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచి యిస్తే పుట్టిన రామలక్ష్మణభరత శత్రుఘ్నుల నలుగురు కుమారుల యందు మహాధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనం కోసమని, తాను వివాహం చేసుకున్న సీతమ్మతో కలిసి తండ్రిని సత్య వాక్యమునందు ప్రతిష్ఠితుని చేయడం కోసం, పద్నాలుగు సంవత్సరములు అరణ్య వాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల పీచమడచి, అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో కబంధ వధ జరిగిన తరువాత సుగ్రీవుని జాడ తెలుసుకుని, సుగ్రీవునితో మైత్రి చేసి, వాలిని సంహరించి, హనుమ సహాయంచే నూరు యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున వున్న లంకా పట్టణంలో రావణాసురుని ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మజాడ హనుమ ద్వారా తెలుసుకుని, సముద్రమునకు సేతువు కట్టి, ఆవలి ఒడ్డుకు చేరి, రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి, తిరిగి సీతమ్మను తాను పొంది పదకొండు వేళా సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి, రామరాజ్యము అని పేరుతెచ్చి, ఎన్నో ఆశ్వమేధములు, వాజపేయములు, పౌండరీకములు మొదలయిన యాగములు చేసి, మనిషి ఎలా ప్రవర్తించాలి అనే దానికి ఒక అద్భుతమయిన కొలమానమును ఏర్పాటు చేసిన విశేషమయిన అవతారము రామావతారము.

ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతనగారియందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది. రాముడు కృష్ణుడు అని యిద్దరు లేరు కనుక ఆ రాముడే కృష్ణకథ చెప్పించాడు. 

దశమ స్కంధము – పూర్వ భాగము – శ్రీకృష్ణ జననం 

భాగవతంలో దశమ స్కంధము ఆయువుపట్టు లాంటిది. ఈ దశమ స్కంధము జీవితంలో తప్పకుండా విని తీరాలి. ఇందులో వ్యాస భగవానుడు కృష్ణ భగవానుని లీలలను విశేషమయిన వర్ణన చేశారు. పోతనగారు దానిని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేశారు. దశమ స్కంధమును ప్రారంభం చేస్తూ ఒకమాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చింది. ‘మహానుభావా! భూలోకంలో ఎందఱో రాజులు భూమి పతులమని పేరు పెట్టుకొని పరమ దుర్మార్గమయిన పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది అధర్మాత్ములు ఈవేళ భూమిమీద తిరుగుతున్నారు. వారి భారం నాకు ఎలా తగ్గుతుంది? అటువంటి వారి మదమణచి భూమి భారమును తగ్గించవలసినది’ అని ప్రార్థించింది. భూభారము అనేది తక్కెట్లో పెట్టి తూచే కొలత కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే, ఎన్ని ప్రాణులు వున్నా, భూమికి ఎప్పుడూ బరువు కాదు. కాని ధర్మమూ తప్పి ప్రవర్తించే మనుష్యులను చూసి భూమి భారమని బాధపడుతుంది. అన్నిటిని సృష్టి చేసినది బ్రహ్మగారే కదా! అందుకని బ్రహ్మగారిని అడిగింది. ‘భారము తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారకుడయిన శ్రీమహావుష్ణువు అనుగ్రహం కాబట్టి నీవయినా నేనయినా ఆయనను ప్రార్థన చేయాలి’ అని ఆనాడు బ్రహ్మగారు ధ్యాన మగ్నుడై పురుషసూక్తంతో స్వామి వారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానము నందు ఆయనకు ఒక వాని వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నారు ‘భూమీ! నీవేమీ బెంగపెట్టుకోవద్దు. స్వామి తొందరలో కృష్ణావతారమును స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమయిన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమయిన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షససంహారం ప్రారంభం చేసేస్తాడు. ఎందఱో రాక్షసులు, దుర్మార్గులు మరణిస్తారు. నీకు భారము తగ్గుతుంది. దేవతలను, సుర కాంతలను తమతమ అంశలతో భూమిమీద జన్మించమని స్వామి ఆదేశం యిచ్చాడు. ఆయన యదుకులంలో యాదవుడిగా పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు. జగదాచార్యునిగా లోకమునకు జ్ఞానమును ఇస్తాడు’ అని చెప్పాడు. అపుడు భూమాత పరమ సంతోషమును పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసమని నిరీక్షణ చేస్తోంది. 

ఈలోగా భూలోకంలో యదువంశమునకు చెందిన శూరసేనుడు అనే రాజు మధుర రాజ్యమును పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశామునకు చెందినా వారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకాయన పేరు ఉగ్రసేనుడు. ఒకాయన పేరు దేవకుడు. వీరు ఇద్దరూ అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములలో దేవకుని కుమార్తె దేవకి. ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని చెల్లెలు దేవకీ దేవి. దేవకీదేవిని శూరసేనుని వసుదేవునకిచ్చి వివాహం చేశారు. 

దశమ స్కంధము ఉపనిషత్ రహస్యము. దశమ స్కంధము ప్రారంభంలోనే ఒక లక్ష టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానమును తెలుసుకోగలిగారంటే మీ హృదయగ్రంథి విడిపోయినట్లే! కృష్ణ జననం పరమ పవిత్రమయిన ఆఖ్యానం. దేవకీ వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుర్రములను, బంగారు ఆభరణములతో అలంకరింపబడిన ఏనుగులను, కొన్ని వేల రథముల నిండా బంగారమును, కొన్ని వందలమంది దాసీజనమును ఏర్పాటు చేసి, మహానుభావుడయిన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు. రాజమార్గంలో కొన్ని వేళా రథములు అనుసరించి వెడుతున్నాయి. దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రథమును చోదనం చేయడానికి ఒక సారథి ఉంటాడు. ఇలాంటి సమయంలో అక్కడికి కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. అతనికి చెల్లెలు అంటే మహాప్రేమ. ఆమె తన తండ్రిగారి సోదరుని కుమార్తె అయినా, కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ. ఆయన దేవకీదేవి రథమును నడపడానికి సిద్ధపడ్డాడు. అందరూ చాలా సంతోషించారు. తానే చెల్లెలిని అత్తవారింటిలో దింపుతానని గుఱ్ఱముల పగ్గములు పట్టుకున్నాడు. వెనక దేవకీవసుదేవులు కూర్చున్నారు. రథం వెళ్ళిపోతున్నది. 

అపుడు అశరీర వాణి కొన్ని మాటలు పలికింది. ‘అశరీరవాణి’ చాలా గమ్మత్తయిన మాట. శరీరము వుంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తున్నదని గుర్తు. కనీసంలో కనీసం ఎదురుగుండా నామ రూపములతో ఏదో ఉండాలి. మనుష్యుడు లేకుండా మాట ఉండదు. కానీ యిక్కడ శరీరము లేదు కానీ మాట వినబడుతున్నది అంటున్నారు. అదీ చిత్రం. అశరీర వాణి ఏమని పలికిందంటే ‘’తలోదరి’ అంటే పైకి కనపడని కడుపు కలది. కొంతమందికి కడుపు కనపడదు. అసలు కడుపు ఉన్నదా లేదా అనే అనుమానం ఉన్నట్లు ఉన్నవాళ్ళని ‘తలోదరి’ అంటారు. అసలు కడుపు లేనట్లుగా శుష్కించిన కడుపులా కనపడుతోంది. ఈ కడుపులో ఎనమండుగురు పుట్టబోతున్నారు. వారిలో ఎనిమిదవ వాడు కంసుడిని చంపబోతున్నాడు. ఆవిడ చక్కగా వసుదేవుడిని వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది. ‘ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా, రథము నడుపుతున్నావు! కాని ఈమె ఎనిమిదవ గర్భము నిన్ను చంపేస్తుంది’ అని అశరీర వాణి పలికింది.

ఇప్పటి వరకు కంసుడు పరమప్రేమతో ఉన్నాడు. ఆకాశంలోంచి ఈమాట వినపడగానే వెంటనే రథమును ఆపాడు. క్రిందికి దిగాడు. కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి. అపారమయిన కోపం వచ్చేసింది. తన ఎడమ చేతితో చెల్లెలి కొప్పు పట్టుకొని రథములో నుండి క్రిందకు లాగేశాడు. ఒరనుండి కరవాలమును తీసి ఆమెను నరికివేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆసమయంలో వాసుదేవుడు మాట్లాడాడు. ఇది చాలా గమ్మత్తయిన సన్నివేశం. ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్న వాడు బావమరిది, తన చేల్లెలినే లాగేసి చంపేస్తాడని కాని, అశరీరవాణి పలుకుతుందని గాని వసుదేవుడు కల గనలేదు. ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా చాలా పెద్దమనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పలేని మాట అయ్యేటట్లుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ముందు కంసుని అనుగ్రహం కోసమని బ్రతిమలాడాడు. ప్రపంచంలో పరమపవిత్రమయిన సంబంధములలో ‘అన్న’ అనిపించుకున్న రక్తసంబంధం ఒకటి. అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికి వుండాలని కోరుకోవాలి. ‘బావమరిది బ్రతక కోరతాడు’ అని ప్రపంచంలో ఒక సామెత ఉంది. నీవు అన్నవి. కాబట్టి రథం తోలడానికి వచ్చావు. కాబట్టి నీ చెల్లెలిని సంతోష పెట్టాలి. చక్కని మాటలు నాలుగు మాట్లాడాలి. కానీ నువ్వు చంపేస్తాను అంటున్నావు. గాలి మాటలు నమ్మి చెల్లెలిని చంపేస్తావా! రేపు ప్రపంచం నిన్ను ఏమంటుంది? అరివీర పరాక్రమము కలిగినవాడు భోజవంశంలో పుట్టినవాడు అయిన కంసుడు ఒక చెల్లెలి ఎనిమిదవ గర్భము వలన చాచ్చిపోతాననే గాలిమాట విని, ఇంకా పాదముల పారాణి ఆరని ఆడపిల్లను చంపేశాడని లోకం చెప్పుకుంటుంది.. అది ఎంత మహాపాపం. అందుకని తొందరపడి చంపకు. నిన్ను అభ్యర్థిస్తున్నాను’ అన్నాడు. 

అపుడు కంసుడు ‘అది మిన్నులమోతో, అధికారిక వాక్యమో నాకు అనవసరం.ఈమె కడుపున పుట్టిన ఎనిమిదవ పిల్లాడి వలన నాకు ప్రాణహాని అని నాకు వినపడింది. అందుకని నేను చంపేస్తాను’ అన్నాడు.

అపుడు వసుదేవుడు ‘నీ అదృష్టం కొద్దీ నీ చావుకు ఒక కారణం తెలిసింది. ఒకవేళ నీవు ఈమెను చంపివేశావనుకో నీకు చావు రాకుండా ఉంటుందా? చెల్లెలిని చంపిన పాపమునకు అధోగతికి వెళ్ళిపోతావు. కాబట్టి నీ చెల్లెలిని విడిచిపెట్టెయ్యి’ అన్నాడు. ఎంత గొప్ప వేదాంతమును చెపితే మనసు మారే అవకాశం ఉంటుందో దానిని చెప్పాడు. ఏడురోజులు వినేది శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పారు. ఏడు క్షణములలో వినేది వసుదేవుడు కంసునికి చెప్పాడు. కానీ వాని మనస్సు మారలేదు. అపుడు కంసుడు ‘నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు. నేను మరణమును అంగీకరించను. దేవకిని చంపేస్తాను’ అన్నాడు. ఇపుడు వసుదేవుడు ఆలోచించాడు. ఉన్నదున్నట్లు చెపితే కంసుని తలకెక్కదని భావించాడు. ఇపుడు తానొక ధర్మము నిర్వర్తించాలి. తన భార్యను రక్షించుకోవాలి. జ్ఞాన బోధ చేస్తే వీని బుద్దకు ఎక్కదు. అలాగని ఎలాగయినా తన భార్యను రక్షించుకోవాలని అసత్యమును చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. కానీ అది కంసుని మనస్సుకు నచ్చేది అయి ఉండాలి. ముందు అసలు నేను తక్షణం చేయవలసిన పని దేవకీదేవి ప్రాణములను రక్షించడం అనుకుని ‘బావా, అయితే నీకొక మాట చెబుతాను. నీ చెల్లెలికి పుట్టిన ఎనిమిదవ వాని చేత కదా నీవు మరణించగలనని అనుకుంటున్నావు. కాబట్టి ఈ దేవకీ దేవి గర్భమునుండి పుట్టిన ప్రతి పిల్లవాడిని, పుట్టీ పుట్టగానే తీసుకువచ్చి నీకు యిచ్చేస్తాను. వాడిని నువ్వు చంపెయ్యి. అపుడు నీకు మృత్యువు రాదు కదా! అంతేకానీ నీ చెల్లెలిని చంపడం ఎందుకు? పాపకర్మ కదా! నీ మృత్యుహేతువును నువ్వు చంపినట్లయితే ప్రపంచం నిన్ను తప్పు పట్టదు. నువ్వూ ధర్మం తప్పనక్కరలేదు. నేనూ ధర్మం తప్పనక్కరలేదు. ఆమెను విడిచి పెట్టు’ అన్నాడు. 

అపుడు కంసుడు ‘ఇదేదో బాగానే చెప్పాడు’ అనుకుని మీ యిద్దరు హాయిగా అంతః పురమునకు వెళ్ళిపొండి’ అని ఆ రథమును వదిలిపెట్టేశాడు. దేవకీ వసుదేవులు ఎంతో సంతోషంగా ఉన్నారు.




శ్రీమద్భాగవతం - 65 వ భాగం



దేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకువెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. వసుదేవుని చూసి ‘బావా, చూశావా నువ్వు ఎంత మాట తప్పని వాడవో! పిల్లవాడు పుట్టగానే నీవే తీసుకు వచ్చి ఇచ్చావు. నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. కానీ బావా, ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది! మొదటి వాడిని చంపడమెందుకు? తీసుకువెళ్ళిపో’ అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవ కొడుకు పుట్టాడు. ఎనిమిదవ గర్భమును కదా ఇమ్మన్నాడు. అందుకని రెండవ పిల్లవానిని తీసుకు వచ్చి యివ్వలేదు. ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు. ఆ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి, నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోకకళ్యాణం చేస్తాడు. కంసుని దగ్గరకు వచ్చి ‘కంసా! ఎంత వెర్రివాడవయ్యా! అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుష్యులు కారు. నువ్వు క్రిందటి జన్మలో ‘కాలనేమి’ అను పేరు గల రాక్షసుడవు. నిన్ను శ్రీమహావిష్ణువు సంహరించారు. నీ తండ్రి, తల్లి, దేవకీ, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు’ అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయాడు.

ఇపుడు కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా! వసుదేవుడిని ఆరుగురి పిల్లలను తీసుకురమ్మనమని కబురుచేశాడు. ‘ఎనిమిదవవాడికి వీళ్ళు సహాయ పడితే నా బ్రతుకు ఏమయిపోవాలి? అందుకని ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి’ అనుకుని పిల్లలను చంపేశాడు. తరువాత తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పూతన – ఇలాంటి వారినందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేశాడు. తరువాత వస్తున్న గర్భం ఏడవ గర్భం. కాబట్టి జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమయిన కారాగారంలో పెట్టాడు. రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి. వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు. లోకకళ్యాణకారకుడు. ‘నారం దదాతి యితి నారదః’ అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. అటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడు అయ్యాడు? ఇపుడు వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడు అని అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీభాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యమును చెప్పారు. పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని యిద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. అపుడు బ్రహ్మగారు ‘మీరు రాక్షసుని కడుపునా పుట్టండి’ అని శపించారు. అందువలన వారు ఆరుగురు క్రిందటి జన్మలో ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపునా పుట్టారు. అప్పటికి వాళ్ళకి వున్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈవిశాయమును వారు తండ్రి అయిన హిరణ్యకశిపునకు చెప్పారు. అపుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. ‘నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు. మీరు అప్పుడే పొందేశారా?కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి.

అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు’ అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపునా పుట్టారు. వాళ్ళ శాపం ఈజన్మతో ఆఖరయిపోతుంది. వీళ్ళు యిప్పుడు గతజన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గతజన్మలో వీరి తండ్రి కాలనేమి. కాలనేమి యిపుడు కంసుడిగా ఉన్నాడు. కాబట్టి వేరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. అందుకని నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు. అదీ నారదుని రాకలో గల కారణం. ఇది దేవీ భాగవతాంర్గతం. 

కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములనన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీమహావిష్ణువుని తనకడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని కారాగారమునందు మగ్గుతున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలని అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. అందుకని యోగమాయను పిలిచి ఒకమాట చెప్పాడు. ‘నీవు భూమి మీదకి వెళ్ళు. అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. కంసుడు వసుదేవుని భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉంది. ఇప్పుడు వసుదేవుని తేజస్సు దేవకీదేవిలో ఏడవ గర్భంగా ఉన్నది. అందులో శేషుని అంశ ఉన్నది. అందుకని ఎవరికీ తెలియకుండా ఆ గర్భస్థమయిన పిండమును వెలికి తీసి దానిని తీసుకు వెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు. గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. అప్పుడు యిక్కడ జారిపోయిన పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడన్న పేరుతొ జన్మిస్తాడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. అందుకని నీవు వెళ్ళి ఆపని చేయవలసినది’ అని చెప్పాడు. వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది. ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండమును బయటికి లాగి నందవ్రజంలో నందుని దగ్గర వున్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది. 

ఇవాళ భాగవతమును వింటున్నప్పుడు యిది జరుగుతుందా అని మనమెవ్వరమూ సందేహించనవసరం లేదు. ఇప్పుడు యిటువంటివి ప్రపంచంలో జరుగుతున్నాయి కదా! ఇప్పుడు మనవాళ్ళు చేసే పనిని అప్పుడు భాగవత కాలంలోనే మహర్షులు చేశారు. చాలా బలవంతుడయిన వాడు కాబట్టి ఆయనకు ‘బలభద్రుడు’ అని పేరు. లోకముల నన్నింటిని ఆనందింప చేస్తాడు కాబట్టి రామ శబ్దమును ప్రక్కన పెట్టి ‘బలరామా’ అని పిలిచారు. ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశ పెట్ట బడ్డాడు అందుకని ‘సంకర్షణుడు’ అని పేరు వచ్చింది. ఈవిధంగా బలరాముని ఆవిర్భావం జరిగింది. తదనంతరం కృష్ణపరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణుని పూర్ణమయిన తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది. వసుదేవుడి లోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోనికి ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఈ గర్భంలోకి ముప్పది కోట్ల మంది దేవతలు బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. ఇదీ గర్భశుద్ధి అంటే. వారందరూ మహానుభావా! నీవు మాయందు అనుగ్రహించాలి. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులయిన వారిని నిగ్రహిస్తున్నారు. కాబట్టి ముకుందా నీవు అమ్మ గర్భంలోనుండి బయటకు రావసింది అని పరమాత్మను స్తోత్రము చేస్తున్నారు. 

ఇక్కడ కంసుని పరిస్థితి దారుణంగా ఉంది. దేవకికి అష్టమ గర్భం వచ్చేసింది. నెలలు పెరుగుతున్నాయి. తొమ్మిదవ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనపడుతోంది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం. జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసునికి కూడా కనపడుతోంది. అందుకనే నారదుడు ధర్మరాజు గారితో ‘కొందరు వైరముతో కూడా ఈశ్వరుని పొందుతున్నారు’ అన్నాడు. కంసుడు ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతోంది. శ్రావణ మాసంలో అర్థరాత్రి పన్నెండు గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. అప్పుడు ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉంది. కంసుడు గాఢనిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి యినుప గొలుసులు వేశాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేశాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమయినా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్ళకు చేతులకు యినుప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆతల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్థరాత్రి పన్నెండు గంటల వేళయింది. 

మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. నాలుగు బాహువులతో, నల్లటి మబ్బు వంటి కాంతితో, పట్టు పీతాంబరము కట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకొనిన వాడై, మహానుభావుడు వజ్ర వైడూర్యములు పొదగబడిన కిరీటముతో, నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండ స్థలములయందు ప్రకాశిస్తూ ఉండగా, మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, సమస్త లోకములు కొలిచే పాదపద్మములతో, చంటిపిల్లవాడిగా వసుదేవునికి దర్శనం యిచ్చాడు. అటువంటి పిల్లవానిని చూసి సంకెళ్ళలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాను నేను ఎన్ని దానాలు చెయ్యాలి. కానీ కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. కానీ నేను చెయ్యడానికి కూడా లేదు. ‘కృష్’ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందములో ఆయన స్నానం చేసేశాడు. తరువాత ఒక్కసారి నీళ్ళు ముట్టుకున్నాడు. మానసికముగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడు. ‘నేను కారాగారమునుండి బయటకు వచ్చిన తరువాత తీర్చుకుంటాను’ అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. అపుడు కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ ‘భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెపుతాను వినండి.




శ్రీమద్భాగవతం - 66 వ భాగం



స్వాయంభువ మన్వంతరంలో మీరిద్దరూ (దేవకీ వసుదేవులు) ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు. ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ 12వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షం అయి ‘ఏమి కావాలి?’ అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. ‘నీలాంటి కొడుకు కావాలి’ అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేదు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒకమారు అడిగితే నేను మూడు మార్లు పుట్టాను. ఒకమారు నేను పృశ్నికి పృశ్నిగర్భుడుగా, రెండవ మారు అదితి కష్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా ఇప్పుడు కృష్ణభగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది. అంతరార్ధం తెలిసినా తెలియకపోయినా నా కథ విని, నన్ను స్మరిస్తూ, నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షమును పొందండి’ అన్నాడు.

ఈమాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయములు వసుదేవునకు అంతరమునందు ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయమును బాహ్యమునందు చెప్పలేదు. ‘ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమయిన యోగమాయా దేవి యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరల అక్కడ నుంచి ఆడపిల్లను తెచ్చి దేవకీ ప్రక్కన పడుకోబెట్టు’ అన్నాడు. 

వెంటనే వసుదేవుని కాళ్ళు, చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలామంది తలమీద పెట్టుకున్నారు అంటారు. పోతనగారి భాగవతంలో అలా లేదు. గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారమునకు యినుప గొలుసులు, తాళములు, మేకులు ఉన్నాయి. అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటకు వచ్చాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడ పట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు. ఆకాశం అంతా నల్లటి మబ్బుపట్టి ఉంది. గాఢాంధకారము. శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. యమునా దగ్గరికి వెళ్ళాడు. యమునానది విపరీతమయిన వేగంతో ప్రవహిస్తోంది. వసుదేవుడు పరమాత్మను గుండెల మీద పెట్టుకుని యమున వంక చూశాడు. 

కృష్ణ భగవానుని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు యిచ్చిన సముద్రములా యమునా చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ పిల్లను ఎత్తుకుని మళ్ళీ తిరిగి వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుప సంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆ ఆడపిల్లను దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణ పరమాత్మను గుండెలమీద ధరించాడు. అనగా యిప్పుడు వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపమును తెలుసుకున్నాడు. ఆయన హృదయగ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు. దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకియందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి. లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది.

ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ వున్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్పలమీద రాజముద్ర ఉన్నదే లేనిదీ చూశారు. రాజముద్ర ఉన్నది. కాబట్టి లోపలి వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటులు ఆడపిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్న వాడు పరుగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీ దేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆ ఆడపిల్లే తన పిల్లే, తానే రక్షించుకోవాలని అనుకుంటోంది. అనుకోని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టేసుకుంది. ‘అన్నయ్యా ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు, మేనకోడలు. నన్ను నమ్ము ఆరుగురిని చంపేశావు. ఏడవది గర్భస్రావము అయిపొయింది. ఇది ఆడపిల్ల. ఇంటికి ఆడపడుచు. నీకు కోడలు. నువ్వు మన్నన చేయాలి. పసిపిల్ల అయిన దానిని చంపేడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనయినా బ్రతకనివ్వు. చంపవద్దు అన్నయ్యా’ అని ఏడుస్తూ వేడుకుంది.

కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి పసిపిల్ల రెండు కళ్ళు పట్టుకు లాగేశాడు. లాగేసి గిరగిర త్రిప్పి బండకు వేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమునందు ఆరూఢయై కూర్చుంది. అటునుంచి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. ‘నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే 14 నామాలతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ 14 నామములు వింటున్నారో వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ వున్నా నీవు రక్ష చేస్తావు’ అన్నాడు. ఆ తల్లి అఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపములు సమర్పిస్తున్నారు. నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవి అన్నీ తీసుకుని క్రింద వున్న కంసుని చూసి ఒకమాట అంది. ‘ఓరీ దుర్మార్గుడా! పిల్లలందరినీ రాళ్ళకు వేసి కొట్టి చంపావు. నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతోపాటు పుట్టి నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నీవు చనిపోవడం ఖాయం’ అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది. 
వెంటనే కంసుడు పరుగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు.

అవతల నంద వ్రజంలో ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కృష్ణ పరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది.నంద వ్రజం భగవద్భక్తులతోనూ, గోవులతోను నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోష పడిపోతున్నారు. చూచివడ్డాము అని యశోద గృహమునకు వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు “అబ్బ పిల్లవాడు ఎంత బాగున్నాడే!’ అని పరవశించిపోతున్నారు. బయట నంద ప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి గోవులను దానం ఇచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇచ్చాడు. పిల్లవాని జాతకము చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి ‘లేక లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడు అవుతాడు. లక్ష్మీదేవి వీనిదే. ఎటువంటి వీరులనయినా ఓడిస్తాడు. గొప్ప దీర్ఘాయుర్దాయమును పొందుతాడు. అని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడకు వచ్చిన వాళ్ళలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్ళు పోయమని అడిగారు. లోకములన్నింటిని ప్రళయం చేసేయ్యాలనుకున్నప్పుడు నీళ్ళలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకుమీద ఏమీ తెలియనివాడిలా బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రశాయి. ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పడుకొని నీళ్ళు పోయించుకొని ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగ కృష్ణుడు. ఆఖరుకి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పడుకోపెట్టారు. 

౨. పూతన సంహారం :

కంసుడు అష్టమ గర్భమును తాను సంహరించగలనని ఎన్నో ప్రయత్నములు చేశాడు. ఎన్ని ప్రయత్నములు చేసినా అష్టమ గర్భం జారిపోయి ఇంకొకచోట పెరుగుతోంది. తన మృత్యువును ఏ ప్రయత్నమూ చేత తాను అధిగమించలేకపోతున్నాడు. ఈ సత్యమును కంసుడు అంగీకరించి ఉంటే కంసుడి జీవితం వేరొకరకంగా మారి ఉండేది. ఇక్కడ కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయముననే తన మంత్రులను పిలిఛి విషయమును చెప్పాడు. ‘మీరు అందరూ చూశారు. నిన్న నేను ఆ బిడ్డను చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారిపోయి పైకి వెళ్ళి నీవు తొందరగా మరణించబోతున్నావు. నిన్ను చంపేవాడు నాతొ కలిసి పుట్టి వేరొకచోట పెరుగుతున్నాడు’ అని చెప్పింది. నాకు కొంచెం భయంగా ఉంది’ అన్నాడు.

అపుడు కంసుని చుట్టూ వున్నవాళ్ళు ‘రాజా! ఈ మాత్రం డానికే భయపడి పోతావేమిటి? మీ ధాటికి ఆగలేక దేవతలందరూ దాక్కుని ఉన్నారు. మీ శక్తి మామూలుది కాదు. మీరు మాకు ఒక్క ఉత్తరువు ఇచ్చారంటే మేము అంతటా తిరిగి కొత్తగా పుట్టిన పిల్లల దగ్గరనుంచి పళ్ళు వస్తున్న పిల్లల వరకు అందరినీ చంపేస్తాము’ అన్నారు. నీ ప్రధాన శత్రువు శ్రీమహావిష్ణువు. గతంలో నీవు కాలనేమిగా ఉండగా నిన్ను సంహరించాడు. నీకోర రహస్యం చెపుతాను విను. ఇప్పటికి కూడా పిల్లవాని రూపంలో వచ్చి నిన్ను ఎవరు చంపుటారో తెలుసా? విష్ణువే చంపుతాడు. విష్ణువు మూలమును తీసివేయాలి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో దానిని తీసివేయాలి’ 

ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారో, ఎవరు జపం చేస్తున్నారో, ఎవరు ఈశ్వరుని నమ్ముతున్నారో, ఎవరు ప్రశాంతముగా ఉంటున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో, ఎవరు అగ్నికార్యం చేస్తున్నారో, ఎవరు వేదం చదువుకుంటున్నారో, జేక్కడ ఆవులు ఉన్నాయో, ఎక్కడ దూడలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హోమములు జరుగుతున్నాయో, వీటినన్నింటిని నాశనం చేసేస్తే విష్ణువు అనేవాడు లేకుండా పోతాడు. అప్పుడు యింక మనకు శత్రువు వుండదు. అందుకని వీటినన్నిటిని నాశనం చేసేస్తాము. మాకు అనుజ్ఞ ఇవ్వండి’ అన్నారు. అక్కడ నంద వ్రజంలో కృష్ణ భగవానుడు పెరుగుతున్నాడు. అసలు జన్మించిన వలసిన అవసరం లేని వాడు. ‘అజాయమానో బహుధా విజాయతే’ అని వేదం అంటోంది. జన్మించ వలసిన అవసరం లేనివాడు అనేకమయిన జన్మలను పొందుతున్నాడు. అటువంటి వానికి జాతకర్మ చేస్తున్నారు. ఆయన కన్నా ముందు వున్నవాడు ఎవడూ లేడు. ఆయన తర్వాత ఉండేవాడు లేదు. కాబట్టి ఆయన ఎప్పుడూ తల్లిపాలు త్రాగి ఎరుగడు. అటువంటి వాడు ఈవేళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకొని పాలు త్రాగుతున్నాడు. పరబ్రహ్మము అనుగ్రహం ఎంత ఆశ్చర్యం! ఆ యశోద ఎంత పుణ్యం చేసుకుందో కదా! ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా ఆ యశోదను చూడాలనుకుంటే వేంకటాచలంలో వేంకటరమణుని సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా అందుతున్నదీ లేనిదీ చూస్తూ వకుళ మాతగా కూర్చుంది. ఆయనకు హానీ తెలియదు, వృద్దీ తెలియదు. ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం పెరగడం, తరగడం లాంటివి ఉండవు. అలాంటి వాడు ఆశ్చర్యంగా రోజురోజుకీ అమ్మ ఒడిలో పెరుగుతున్నాడు. ఎంత తపస్సు చేసినా చూడడానికి వీలు కాని మూర్తి ఇవాళ ఏమీ చేతకాని గోపకాంతల ఇళ్ళల్లో పెరిగి పెద్దవాడయి ఆడుకుంటున్నాడు. నందవ్రజంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి వారు నైవేద్యం పెట్టనవసరం లేకుండా తానె అడిగి తినేశాడు. ప్రత్యక్ష కైంకర్యం. ఎంత అదృష్టం. ఎంత చదువుకున్నా బ్రహ్మము ఎలా వుంటుంది అంటే చెప్పడం కుదరదు.

‘యతోవాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహా”

మనస్సు, వాక్కు ఇంకా మేము పరబ్రహ్మము గురించి చెప్పలేము అని ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మము ఉంది. అటువంటి పరబ్రహ్మము గురించి ఏ చదువు చెప్పలేదో ఆ పరబ్రహ్మము ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇది పరమాత్మ కారుణ్యము. ఏదయినా ఈశ్వరానుగ్రహంలో నుంచే వస్తుంది.




శ్రీమద్భాగవతం - 67 వ భాగం



ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఆవిడ బాలఘాతకి. ఆవిడ శిశువులను చంపగలదు. శిశువులు ఎక్కడ వున్నా తొందరగా పసిగట్టగలదు. ఆవిడ కామరూపిణి. రూపం మార్చుకుంటుంది. మార్చుకుని భవనమునందు ప్రవేశించింది. ఆమె శిశువులను చాలా గమ్మత్తుగా చంపుతుంది. చంపుతున్నప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. విషమును పాలలా ఇస్తుంది. అటువంటి పాలు త్రాగి శిశువులు మరణిస్తారు. అది ఆవిడకు ఉన్న శక్తి. ఆమె చంపేదానిలా కనపడదు. పెంచేదానిలా కనపడుతుంది. ఇపుడు ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఆమె ఆకాశం నుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో వున్న కృష్ణ పరమాత్మను కనిపెట్టింది. లోపలి ఊయల దగ్గరకు వెళ్ళింది. పర్యంకము దగ్గరకు చేరింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుని దగ్గరకు చేరింది. ఆమె రాశీభూతమయిన పిల్లవాని సౌందర్యమును చూసి ‘నేను సహజంగా రాక్షసిని. చాలా వికృతంగా ఉంటాను. కానీ ఇపుడు నా రూపమును మరుగుపరచి చాలా అందమయిన దానిలా వచ్చాను’. ఈవిడ వస్తుంటే చరాచర ప్రపంచపు ఆంతరము నందంతటా నిండిపోయిన వాడు, బాహ్యమునందు నిండిపోయిన వాడు అయిన పరమాత్మకు, ఈవిడ ఎందుకు వస్తోందో తెలుసు. కాలు చేయి పొట్టకింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా జగత్తునంతా నిండి వుండిన పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలు పెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసి అయినా ఆ బాలుని అందమునకు వశపడిపోయింది. ఆమె తెలియకుండానే ‘నేను నీ అందమును తీసెయ్యడానికి ఇంత అందంగా వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు త్రాగితే ఎందుకూ పనికిరాకుండా అయిపోతావు’ అని అంది.

పూతన తెలియకుండా అలానే ‘నళినదళాక్షా’ అని పిలిచింది. ‘తామరరేకుల వంటి కన్నులు వున్న పిల్లవాడా! ఎంత అందంగా ఉన్నావురా! నా పాలు ఒక గుక్కెడు తాగావంటే ఇంత అనడమూ చటుక్కున మాయమయిపోతుంది. నా అందమేమిటో అప్పుడు చూద్దువుగాని! నీ అందానికి సార్థకత వస్తుంది. రా త్రాగు’ అని గబగబా ఉయ్యాలలో వున్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తనం వాడి నోట్లో పెట్టబోతోంది. ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి వానిని చూశారు. ‘అయ్యయ్యో! అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు! మా పిల్లవాడు అన్యస్త్రీల క్షీరమును స్వీకరించడు. ఆగుఆగు’ అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే. ఒక్కసారి ఆ విషమును నోట్లో పెడితే చాలు అనుకుని గబగబా పిల్లవాడిని తీసి ఒడిలో పెట్టుకుని, వాడి ముఖమును త్రిప్పి, ఎలాగయినా సరే స్తనము నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలో ఆవులించాడు. ఒకసారి క్రీగంట చోశాడు. మరల నిద్ర వచ్చేసినవాడిలా కళ్ళు మూశాడు. మళ్ళీ కళ్ళు విప్పాడు. ‘పాలు తాగక తప్పదా’ అన్నట్లుగా చూసి విసుక్కుని అయినా పాలను తాగడం అలవాటయిన వాడిలా అమ్మ స్తన్యం త్రాగినట్లే ఆ స్తనమును తన బుజ్జి బుజ్జి వేళ్ళతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ రెండు గుక్కల పాలు త్రాగాడు. 

ఆ రెండు గుక్కలలో ఆమె గుండెలలో ప్రాణముల దగ్గరనుంచి ఆవిడ శరీరంలో వున్న శక్తినంతటిని లాగేశాడు. ఇప్పటి వరకు ‘తాగు తాగు’ అనడమే తప్ప ‘వదులు వదులు’ అనడం తెలియదు. ‘వదలరా బాబోయ్ అంటోంది పూతన. ఆయన పట్టుకుంటే వదులుతాడా? ఆయన తాగేశాడు. ఆయన పాలు తాగెయ్యగానే ఆమె కామరూపం పోయింది. పోయి ఒక్కసారి గిరగిరగిర తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమయిన శరీరంతో క్రిందపడిపోయింది. 13కి.మీ దూరం ఎంత ఉంటుందో అంట పెద్ద శరీరంతో నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయింది. పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. స్తన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెలమీద ఉన్నాడు. ఆ గుండెల మీద వున్న కృష్ణుడిని అలాగే చేతులతో పట్టుకొని గిరగిరతిరిగి పడిపోయింది. ఆమె కోరలు నాగటి చాళ్ళలా ఉన్నాయి ముక్కు రంధ్రములు పెద్ద కొండగుహల్లా ఉన్నాయి. ప్రవత శిఖరములు ఎలా ఉంటాయో అటువంటి స్తనములు. పూతన కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఆమె శరీరం చుట్టూ గోపగోపీ జనమంతా నిలబడి ‘ఎంత పెద్ద రాక్షసి’ అంటున్నారు. కృష్ణుడు ఆమెమీద ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం యశోదా రోహిణులకు మాత్రమే తెలుసు. అయ్యో పిల్లాడు అయ్యో పిల్లాడు అని పూతన భుజములమీద నుండి పర్వతమును ఎక్కినట్లు ఎక్కారు. పసికూన అయిన కృష్ణునికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని, ఏమీ తెలియని వాడిలా బోసి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో పిల్లవాడు బ్రతికి వున్నాడు అని పిల్లాడిని ఎత్తుకుని భుజంమీద పెట్టుకొని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి క్రింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు. ఆయనకా భయం? ‘భయకృద్భయనాశనః’ అని ఆయనకు పేరు. గోపికలు అనుకుంటున్నారు. వీళ్ళదీ పరమభక్తి అంటే! వాళ్లకి కృష్ణుని గొప్పతనం తెలియదు. అయినా వారు కృష్ణుని ప్రేమించారు. 

ఇప్పుడు ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరకి తీసుకు వెళ్ళారు. ఆవుతోక పిల్లవాడి చుట్టూ తిప్పి, ఆవు మూత్రము ఆయన మీద చల్లి, ‘నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠమును హృషీకేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, గర్భమును మాధవుడు రక్షించు గాక, తొడలను ముకుందుడు రక్షించుగాక’ అంటూ పరమాత్మ పన్నెండు నామములు పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమయిన అన్గాములకు పేడ పూస్తూ రక్షపెట్టారు. ‘ఏమి భక్తిరా వీళ్ళది?’ అని ఆయన మనస్సులో నవ్వుకుంటున్నాడు. ఇంతలో ఒక చిత్రమయిన గమ్మత్తు జరిగింది. 

నంద వ్రజమునకు పూతన రావడానికి పూర్వము నందుడు మధుర వెళ్ళాడు. కంసరాజుకి ఈయన సామంతుడు. కాబట్టి ప్రతియేడాది కప్పం కట్టాలి. కప్పం కట్టడం కోసమని ధనమును తీసుకువెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి, మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుని చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురువచ్చి కౌగలించుకొని ‘నందా, నిన్ను కలవడం చాలా సంతోషం. నీకు కొడుకు పుట్టాడని విన్నాను. ఎంత ఐశ్వర్యము వున్నా పిల్లలు లేని ఇల్లు అసలయిన ఐశ్వర్యము లేని ఇల్లే కదా! అందుకని నీవు గొప్ప ఐశ్వర్యమును పొందావు. నేను చాలా సంతోషిస్తున్నాను’ అన్నాడు. అపుడు నందుడు ‘నిజమేనయ్యా, నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీకూ ఆరుగురు కుమారులు పుట్టారు. కానీ ఆ ఆరుగురినీ దుష్టుడై కంసుడు సంహరించాడు. వసుదేవా నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నాకొడుకు నీ కొడుకే’ అని అన్నాడు. నిజమునకు కృష్ణుడు వసుదేవుడి కొడుకేగదా! వసుదేవుడు త్రికాల వేది. అపుడు వసుదేవుడు ‘నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి. నీవు తొందరగా బయలుదేరి నందవ్రజమునకు వెళ్ళిపో’ అన్నాడు. ఎందుకంటే కంసుడు కృష్ణుడిని పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడు అని తెలుసు.

నందుడు గబగబా బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాడు. దారిలో పడివున్న రాక్షసి శరీరమును చూశాడు. వసుదేవుడు చెప్పినది యధార్థమని గ్రహించారు. ఆ శరీరమునంతటినీ ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రమును వెలిగించారు. ఆవిడ రాక్షసి. శరీరం కొవ్వుతో నిండిపోయి ఉంది. కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అగరువత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో వున్న పాపమును కూడా త్రాగేశాడు. పుణ్యమే మిగిలిపోయింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరువత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణునికి తల్లి వుంటే ఏ లోకములకు వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్ళిపోయింది. మరి అ ‘పిల్లవాడు నా కొడుకు’ అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో! వాళ్ళు వెళ్ళే స్థితిని నేను చెప్పలేను అన్నారు పోతనగారు.

ఇది పూతన సంహార ఘట్టము. ఈ ఘట్టమును తాత్త్వికంగా పరిశీలించాలి. భాగవత దశమ స్కంధము ఉపనిషత్ జ్ఞానము. ఆవిడ పేరు పూతన. అమరకోశం ‘పునాతి దేహం పూతన’ అని అర్థం చెప్పింది. దేహమును పవిత్రముగా చేయుడానికి పూతన అని పేరు. మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిదీ అని ప్రశ్నిస్తే నాది అని చెపుతాము. అయితే ఇప్పుడు నేను అనబడే నువ్వు ఎవరు? దానికి జవాబు మనకే తెలియదు. అదే పెద్ద అజ్ఞానము. ‘నేను నేను’ అంటున్నది ఏది? అంటే తెలియక ఆ ‘నేను’ని చీకటితో, అజ్ఞానముతో కప్పివేశాము. అదే పూతన. అవిద్య. ‘నేను’కు ‘నాది’ తోడవుతుంది. నేను అనేది అబద్ధము. ఈ అబద్ధామునకు నాది అనే మరియొక అబద్దం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. ‘నా’ అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. ‘నేను, నాది’ అనే రెండు పూతన రెండు స్తనములు. ఇందులోంచి విషయములను ఇస్తుంది. విషయమే విషము. దేహము ఎప్పుడూ సుఖమునే కోరుతుంది. కానీ దేహసంబంధమయిన సుఖములు విషముతో సమానమయినవి. అవి ఎప్పటికీ దేహి సూక్ష్మరూపమును తెలియనివ్వవు. అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు. దీనిని ఏమయినా చేయగలమా? ఏ పని చేసినా దానిని భగవత్ ప్రసాదమని భావించాలి. భగవదర్పణ చేసి సుఖములను అనుభవిస్తే అవి మనపట్ల విషములు కావు అమృతములు అయిపోతాయి. భగవంతుని అర్పించడం వలన లోపల శుద్ధి జరుగుతోంది. శుద్ధి లేకుండా తింటే విషం అయిపోతుంది. పూతన కృష్ణునికి విషపూరిత స్తన్యమును ఇచ్చింది. విషము అమృతము అయిపోయింది. మీకు కూడా అన్నింటినీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటు అయితే అది అమృతం అవుతుంది. మనస్సును దేహమును కూడా శౌచపరచగలదు. ఈశ్వరుని వైపు తిప్పగలదు. ఈ రహస్యమును ఆవిష్కరించడమే పూతన సంహారమునందు ఉన్న పెద్ద ప్రయత్నము. 

ప్రకృతి వికారమయిన శరీరం పైకి అందంగా ఉన్నట్లు ఉంటుంది. కానీ దీనియందే ఉండిపోతే అసత్యమయిన ‘నేను’నందు మీరు ఉండిపోతే అది అమృతత్వమును యివ్వదు. అసత్యమయిన ‘నేను’ సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు వెళ్ళినట్లయితే ఈ భక్తి ఒకనాడు జ్ఞానము అవుతుంది. జ్ఞానము ఎప్పుడు కలిగేదీ మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. జ్ఞానమును అగ్నిహోత్రంతో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒకరోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అపుడు అసలు ‘నేను’ను తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంహారఘట్టం. అందుకనే కృష్ణుని మొదటి లీల పూతన సంహారంతో మొదలవుతుంది. ఇది దేహమును పవిత్రం చేసింది. అపవిత్రమయినది పవిత్రం అయింది. పవిత్రము అవగానే లోపల వున్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోతుంది. మారిపోయి అసలు ‘నేను’ను పసిగట్టగలిగిన స్థితికి తీసుకు వెళుతుంది. ఈ ఘట్టమును పరమోత్కృష్టమయిన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు.




శ్రీమద్భాగవతం - 68 వ భాగం



శకటాసుర సంహారం :

కృష్ణ లీలలు అన్నీ కూడా మనకు జీవితంలో చేయి ఇచ్చి పైకి ఎక్కించే లీలలు. శకటాసుర సంహారం చాలా చిన్న ఘట్టం. ఎంత వినినా వేదాంతము వేదాన్తముగా ఎప్పుడూ లోపల నిలబడదు. పక్క ఒక ఆలంబనము ఉండాలి. మీరు అన్నమును అన్నముగా తినలేరు. పక్కన కూరో, పచ్చడో, పులుసో ఉండాలి. అలాగే వేదాంతము ఎప్పుడూ కథగా ఉండాలి. అటువంటి కథ లేకపోతే ఈశ్వరుడు లీల చేస్తాడు. పరమాత్మ చేసే లీలలు కర్మతో చేసినవి కాదు. అందులో ఏదో పరమార్థం ఉంటుంది. ఆయన లీలల వెనక ఎంతో ఔచిత్యం ఉంటుంది. 

ఒకనాడు కృష్ణపరమాత్మ బోర్లా పడ్డాడు. పిల్లలను మొదట్లో పడుకోపెట్టినపుడు ఎటు పడుకున్నవాడు అటే పడుకుంటాడు. పసిపిల్లవాడు మొదట చేసేపని బోర్లాపడడం. పిల్లవాడు బోర్లాపడితే ఆ రోజున యింట్లో అదొక పెద్ద ఉత్సవం. బోర్లాపడ్డాడు అని బొబ్బట్లు మొదలయిన పిండివంటలు వండుకు తినేస్తారు. 

కానీ యశోద అలా చెయ్యలేదు. ముత్తైదువలను పిలిచి వాళ్ళకి పసుపు కుంకుమలను ఇచ్చింది. వాళ్లకి చీరలు, రవికల గుడ్డలు పెట్టింది. బ్రాహ్మణులను పిలిచి వారికి గోదానము చేసింది. ఈశ్వరునికి అభిషేకం చేసింది. యశోద అన్నిటికి దైవం వైపు చూస్తోంది. యశోద అంటే యశస్సును ఇచ్చున్నది అని అర్థము. కీతి ఎటు పక్కనుంచి వస్తుందో జీవితము ఎటువైపు నడవాలో యశోదవైపు నుంచి తెలుస్తుంది. పిల్లాడు బోర్లాపడితే మనం బొబ్బట్లు వండుకు తినడం కాదు! శివాలయమునకు వెళ్ళి అభిషేకం చేయించాలి. లేదా రామాలయమునకో, కృష్ణాలయమునకో వెళ్ళి తులసి పూజ చేయించాలి. నీ మనవడు బోర్లాపడే అదృష్టం ఈశ్వరుడు నీకు సమకూర్చినాడు. పిల్లవాడు వృద్ధిలోకి రావడమును ఈశ్వరానుగ్రహంగా భావించాలి. నందుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి అందరూ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాదవుల ఐశ్వర్యం అంతా పశువులు, పాడి. వాళ్ళ ఐశ్వర్యం అంతా పాలకుండలు, పెరుగు కుండలు,నేతి కుండలు, అరటి పళ్ళ గెలలు మొదలయినవన్నీ పెట్టారు. బండికి కూడా ఒక తోరణం కట్టేశారు. అక్కడే ఒక మంచం వేశారు. ఆ మంచం మీద ఒక పరుపు వేశారు. ఆ పరుపు మీద కృష్ణుడిని పడుకోబెట్టారు. ఉత్సవం అంతా కృష్ణుడు బోర్లాపడ్డాడు. కాబట్టి అతడికోసం చేస్తున్నారు. కానీ ఉత్సవం వేడుకలో పడి ఈయనని మరచిపోయారు. ఈయనకు ఆకలి వేసింది. పడుకున్న పిల్లాడికి కాళ్ళు ఎత్తడం తప్ప ఇంకేమీ రాదు. ఆయన పక్కనే బండి ఉన్నది. ఆయనది చిన్ని అరికాలు. దానికి పెసర గింజలంత చిన్నిచిన్ని వేళ్ళు. అందులోనే శంఖం, చక్రం, నాగలి, అమృతపాత్ర మొదలయిన దివ్యచిహ్నములు. అటువంటి కాలితో బండిని ఒక్క తన్ను తన్నాడు.

ఈయన కాలు తగలగానే ఆ బండి ఆకాశంలోకి ఎగిరిపోయింది. దాని చక్రములు, ఇరుసు అన్నీ ధ్వంసం అయిపోయాయి. అక్కడి నుండి క్రిందపడిపోయి తుత్తునియలయిపోయాయి. దీనిని చూసి అక్కడ ఉన్న గోపకాంతలు, యశోద, నందుడు పరుగుపరుగున అక్కడికి వచ్చారు. పిల్లవాడిని చూస్తే చాలా చిన్నవాడు. బండి చాలా పెద్దది. ఆకాశమునకు ఎగిరిపోయేలా బండిని కాలితో తన్నడమేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అపుడు యశోద పిల్లవాడిని తీసుకుని సముదాయించింది. ‘అయ్యో! నాన్నా! ఆకలి వేసిందా? నీ కాలు బండికి తగిలిందా? కాలేమీ నొప్పి పెట్టలేదు కదా! అని పిల్లాడిని ఎత్తుకుని పాలిచ్చింది. అది అమ్మ హృదయం. అది మాతృత్వమునకు ఉన్న గొప్పతనం. మాతృత్వమునందు దేవతాంశ ప్రవేశించి పరాభట్టారికరూపమై నిలబడినది. అందుకని స్త్రీకి అంత గొప్పతనం వచ్చింది. కృష్ణుడు ప్రదర్శించిన లీల చాలా చిన్నది. దీనిలో వున్న అంతరార్థమును మనం గ్రహించేటందుకు ప్రయత్నించాలి. మనకు ఈ శరీరమును భగవంతుడు ఇచ్చాడు. శరీరము మనం నిర్మించుకున్నది కాదు. అన్నింటిని ‘నావినావి’ అంటారు. ‘నావి’ అని చూపించిన ఈ శరీరములో ఏ ఒక్కటీ తనది కాదు. ఏదీ తాను తేకపోయినా ఈశ్వరుడు దీనిని నిర్మాణం చేశాడు. ఈశ్వరునిచే ఇంత గొప్పగా నిర్మింపబడి ప్రసాదింప బడిన ఈ దేహము దేనికొరకు? ఇది శకటము. ఈ బండిని ఎక్కి మీరు తీరమును చేరగలరు. కానీ మనము ఈ బండినెక్కి తీరమును చేరడం లేదు. ఎందువలన? దీనిని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు. కానీ మీరు లక్ష్యం వైపు వెళ్ళడం లేదు. ఈ మానవ శరీర శకతంలో కూర్చుని తాను పొందుతున్న శుభములు ఈశ్వరానుగ్రహములని తలంపడు. తలంపక అన్నీ కూడా ‘నా ప్రజ్ఞ’ అంటూ ఉంటాడు. కానీ ‘ఈ పనులను ఈశ్వరుడు చేయించాడు. అందువల చేయగలిగాను’ అనడు. అలా జీవుడు ఈశ్వరానుగ్రహము తీసివేసి మాట్లాడుతాడు. ఈశ్వరానుగ్రహము వలన తాను ఆపనులను చేయగలుగుతున్నాననే భావన మనసులో ఉండాలి. కానీ అటువంటి భావన ఉన్నప్పుడు మాత్రమే ఈ శకటమును ఎక్కి లక్ష్యమును చేరతారు. లేకపోతే యిది ‘శకటతి యితి శకటః’ అవుతుంది. శం అనగా సుఖము, ఈశ్వరుడు. ఈ శకటమును నీవు ఎందుకు ఎక్కావు తెలుసుకుంటే దానిని ఈశ్వరానుగ్రహమని భావించడం ప్రారంభిస్తాడు. ఈశ్వరానుగ్రహం తప్పు పనులు చేయించదు. సాత్త్వికమైన ప్రవృత్తిలోనికి తిప్పేస్తుంది.

అనగా యిప్పుడు నీవు ఎక్కిన శకటమునకు ఎవరు సారధిగా ఉన్నాడు? ఈశ్వరుడు. స్థిత ప్రజ్ఞుడయిన సారధి శకటమును వేయికళ్లతో చూసి నడిపిస్తాడు. అపుడు శకటములో ప్రయాణిస్తున్న జీవునికి ఏ ప్రమాదము కలుగదు. సారధియే బుద్ధి. ఆ బుద్ధిని నీది అనకుండా దానిని కృష్ణ పాదముల దగ్గర పెట్టేయాలి. తెలిసికాని, తెలియక కాని పరమభక్తితో భాగవతంలో దశమ స్కంధార్గత శకటాసుర వృత్తాంతమును విన్నంత మాత్రం చేత శకటాసురుడు – జీవుడు ప్రయాణిస్తున్న యీ బండి రాక్షసుడు. ఎప్పుడు? ‘యిదే నేను – అన్నీ నేను చేస్తున్నాను’ అనే భావన ఉన్నప్పుడు. కృష్ణుడు జగదాచార్యుడై వచ్చాడు. అజ్ఞానం బాగా ఉంటుంది కాబట్టి దానిని చీల్చదానికి అర్థరాత్రి పుట్టాడు. ఇపుడు ఆయనేమి చేశాడు? ‘మనః మనః’ అనకురా, ‘నమః నమః’ అను అని చెపుతాడు. అపుడు జీవుడు కర్మచేత, భక్తిచేత, జ్ఞానము వైపు నడుస్తాడు. ఈవిధంగా శకటా సుర సంహారం పైకి చిన్న లీల. అంతరమునందు స్వామి ఎంత పెద్ద రహస్యమును దాచారో చూడండి. 

తృణావర్తోపాఖ్యానం :

క్రుశ్ని చేష్టితముల వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంటుంది. దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్లకి జీవితంలో ఒక పరిష్కారం లభిస్తుంది. ఒక ఉత్తమమైన దశానిర్దేశం జరుగుతుంది. అటువైపుగా ప్రయాణించడం చేత వారు మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యమును చేరుకుంటారు. కథా శ్రవణం చేతకూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది. పరీక్షిత్తు శుకమహర్షి చెప్పిన బాహ్యకథనే విన్నాడు. విని మోక్షమును పొందాడు కదా! జీవితంలో అసలు భాగవతం వినడం కాని, చదవడం కాని చాలా గొప్ప విషయములు. భాగవతమును విన్నంత మాత్రం చేత వాని జీవితం కొన్ని కోట్ల జన్మల తరువాత ఒక మలుపు తిరిగింది అని లెక్క.

ఒకనాడు నందవ్రజంలో పక్కన రోహిణి వుండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోపెట్టుకుని ఆనందంగా ఉంది. హఠాత్తుగా ఒళ్ళో వున్న కృష్ణుడు చాలా బరువయిపోయినట్లుగా అనిపించాడు. పర్వత శిఖరం ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. పిల్లవాడు ఇంత బరువుగా వున్నాడేమిటి? అనుకుని పిల్లవాడిని పక్కన దింపింది. అక్కడికి కంసుని పనుపున ఒక రాక్షసుడు వచ్చాడు. అతని పేరు తృణావర్తుడు. అతడు పెద్ద సుడిగాలి రూపంలో వస్తున్నాడు. ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది. ధూళి కన్నులలో పడిపోయింది. ఇంతకూ పూర్వం ఎప్పుడూ అసలు కష్టం అంటే ఏమిటో తెలియని శ్రీమన్నారాయణుని అవతారమయిన చిన్ని కృష్ణుని కళ్ళల్లోకి ధూళి పడిపోయింది. అందరూ కన్నులు మూసి వేసుకుని ఏమయింది అని చూసేలోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించి తీసుకుపోయాడు. కేవలం కృష్ణుని సంహరించడమే అతని లక్ష్యం. ‘ఆవర్తము’ అంటే త్రిప్పడం. గిరగిర త్రిప్పుతూ కృష్ణుడిని ఆకాశంలోకి తీసుకు వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపి క్రింద పడెయ్యాలని అతని ఉద్దేశం. సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకు నడుస్తుంది. గుండ్రంగా తిరుగుతూ కృష్ణుడిని తనతో పాటు పైకెత్తుకుని వెళ్ళిపోయింది.


శ్రీమద్భాగవతం - 69 వ భాగం



రాక్షసుడు చిన్నికృష్ణుని ఎత్తుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అలా ఎత్తుకు వేల్లిపోతున్నప్పుడు పిల్లలకి భయం వేసినట్లయితే వాళ్ళు కంఠమును గట్టిగా పట్టుకుంటారు. రాక్షసుడు కృష్ణుడిని పైకి తీసుకు వెళ్ళిపోతుంటే కృష్ణుడు తన చిన్నచిన్న చేతులతో రాక్షసుడి కంఠమును గట్టిగా పట్టేసుకుని కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరు చేయలేని పనిని తాను చేస్తున్నాను కదా అని రాక్షసుడు సంతోషిస్తున్నాడు. కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరిగిపోవడం ప్రారంభించాడు. ఈ బరువుకి వాడు క్రిందపడిపోవడం మొదలు పెట్టాడు. ‘ఇంత బరువుగా ఉన్నావేమిటి వదులు, వదులు!’ అని అరవడం ప్రారంభించారు. పట్టుకుంటే వదలడం పరమాత్మకు ఉండదు! ఆనాడు బాణం కొడితే త్రిపురములు ఎలా పడిపోయాయో, గట్టిగా కంఠమును కౌగలించుకుంటే పైనుంచి తృణావర్తుడు అలా క్రింద పడిపోతున్నాడు. పెద్ద రాళ్ళ కుప్ప మీద పడిపోయాడు. అలా పడిపోవడం వలన రాక్షసుని శరీరం ముక్కలైపోయింది. కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుని శరీరం మీద పడుకొని మరల ఏమే తెలియని వాడిలా చక్కగా ఆడుకుంటూ అమ్మకోసం చూస్తున్న వాడిలో దొంగ ఏడుపు ఏడుస్తూ పాకుతున్నాడు. తల్లి చూసింది. 

ఏమీ తెలియని వాడు, భక్తుడయిన వాడు పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు. ఇక్కడే ఈ తృణావర్తోపాఖ్యానంలో యశోద రాక్షసుని కళేబరం మీద పడిపోయి వున్న చిన్ని కృష్ణుడిని తీసుకుని భుజం మీద వేసుకుని ఒక విషయమును విజ్ఞాపన చేసింది. ఈ పద్యం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ప్రత్యేకించి తెలుసుకోవలసిన పద్యం.

గత జన్మంబుల నేమి నోఁచితిమొ? యాగశ్రేణు లేమేమి చే
సితిమో? యెవ్వరి కేమి పెట్టితిమొ? యే చింతారతింబ్రొద్దు పు
చ్చితిమో? సత్యము లేమి పల్కితిమొ? యే సిద్ధప్రదేశంబుఁ ద్రొ
క్కితిమో? యిప్పుడు చూడఁగంటిమిచటంగృష్ణార్భకున్నిర్భయున్.

పిల్లలకి గండం ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలను ఆ గండం తరుముకు వచ్చేస్తుంది. అది ప్రమాద రూపంలో ప్రాణములను తీసుకు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ప్రమాద రూపంలో మృత్యువు ప్రాణమును తీసుకు వెళ్ళాలా కూడదా అని అప్పుడు ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. అప్పుడు ఫలితం ఇవ్వాలి. పిల్లలు ప్రమాదము నందు వెళ్లిపోతుంటారు. వారు దీర్ఘాయుష్మంతులు కాకుండానే వారికి అపమృత్యువు వచ్చేస్తుంది. అలా తీసుకెళ్ళే ముందు పరమాత్మ తల్లిదండ్రుల ఖాతాను ఒకసారి చూస్తాడు. ఇపుడు ఆ పిల్లవాడి గండం గట్టెక్కించదానికి తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యములు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు. స్త్రీలు నోచే ఒక్కొక్క నోము చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నట్లు ఉంటుంది. కానీ ఆ నోము ఫలితములు ఆ నోము నోచిన వారిని కొన్ని కోట్ల జన్మలు కాపాడతాయి. సత్యం చెప్పడం చాలా కష్టం. సత్యమును పలకాలి. మహాపురుషుల ఆశ్రమములను దర్శించాలి. వారు ఆత్మజ్ఞానులై ఈశ్వరునితో సమానమైన వారు. అలాగే భగవంతునికి పూజలు చేయాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్న వారు ప్రయత్నపూర్వకంగా ఇలాంటి పనులు చేసి తీరాలి. ఈమాటలు చెప్పి తల్లి యశోద పిల్లవాడిని తీసుకొని పొంగిపోయి, ముద్దులు పెట్టుకొని ‘నానా, నేను బతికానురా, నువ్వు దొరికావు’ అంది. చిత్రం ఏమిటంటే ఎన్నిమాట్లు ఎన్ని లీలలు జరుగుతున్నా యశోదకు తెలియదు. వీటినన్నితిని చేస్తున్నవాడు కృష్ణ పరమాత్మ అని. తెలియనక్కరలేదు.

ఈ లీలలో అంతరార్థం ఏమిటి? ‘తృణము’ అంటే గడ్డిపరక. దానికన్నా తేలిక అయినది ప్రపంచంలో ఉండదు. ‘ఆవర్తనము’ అంటే త్రిప్పుత. త్రిప్పేది ఏది? తృష్ణ. తృష్ణకే తృణావర్తుడు అని పేరు. గృహస్థు పుణ్యం ఖర్చు అయిపోతుంటే మరల పుణ్యమును సంపాదించేసుకుంటూ ఉండాలి. అందువలన ప్రయత్నపూర్వకంగా మరల పుణ్యం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటే దెబ్బతినడు. వచ్చే జన్మల యందు కూడా ఇది నిలబడుతుంది. ఒక్కొక్కరు చేసుకున్న పుణ్యం వలన అతడు పట్టినదల్లా బంగారం అవుతుంది. ఒక్కొక్కడు ఏది పట్టుకున్నా ఐశ్వర్యం అలా కలిసివస్తుంది.

కానీ తృష్ణయందు మీరు చిక్కుకోకూడదు. వచ్చిన దానియందు తృప్తిలేక ఇంకా సంపాదించాలని అనుకున్నారంటే ఇక ఆ సంపాదనకు హద్దు ఉండదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కొంతవరకు దాచుకోవడం తప్పు కాదు. కానీ అది అర్థంలేని దాపరికం అయిపోతే అది తృష్ణగా మారుతుంది. దీనివలన వాడు ఆ శరీరంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోతాడు. అలా తిరగడంలో డబ్బు సంపాదించి సంపాదించి ఒకనాడు మరణిస్తాడు. ఇలా సంపాదించడంలో వానికి గల పుణ్యం అంతా వ్యయమైపోయింది. అందువల వీడు ఉత్తర జన్మలలో దరిద్రుడు అవుతాడు. మీరు వంద రూపాయలు సంపాదించుకున్నట్లయితే అందులో కనీసం అయిదు రూపాయలు పుణ్యం నిమిత్తం ఖర్చు పెట్టి తీరాలి. మరి ఉత్తర జన్మకు పుణ్యం అవసరం కదా! అందుకని ఈ అయిదు రూపాయలు మీ పుణ్యం ఖాతాలో జమచేయబడతాయి. దీని వలన ఉత్తర జన్మలో అన్నవస్త్రములకు లోటులేకుండా సంతోషంగా బ్రతకగలుగుతారు. కాబట్టి ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంట జాగ్రత్తగా ఖర్చు పెట్టడం తెలియాలి. అది తెలియకపోతే మనిషి పాడయిపోతాడు. డబ్బు సంపాదించు కానీ తృష్ణకు లొంగకు. తృష్ణకు విరుగుడు తృప్తి. తృప్తి వస్తే తృష్ణ ఆగిపోతుంది. తృప్తి లేకపోతే లోపల తృష్ణ రగులుతూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కు తిరిగిచూసి ఒక వయస్సు వచ్చిన తరువాత కొన్నింటికి చెక్ పెట్టకపోతే ఆ తృష్ణ కాలుస్తూనే ఉంటుంది. తృప్తితో తృష్ణను గెలవగలగాలి. తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చి మొత్తం నందవ్రజ ప్రజలందరి కళ్ళు మూసేశాడు. తృష్ణకు లొంగితే తృష్ణ గడ్డిపరకను చేసి తిప్పేస్తుంది. నందవ్రజ ప్రజలందరూ కృష్ణా కృష్ణా అని ఏడ్చారు. అపుడు కృష్ణుడు తృణావర్తుని చంపాడు. చంపి తానే వాళ్లకు దక్కాడు. వాళ్ళు దక్కించుకున్నారా, తాను దక్కాడా? తానే దక్కాడు. కాబట్టి అస్తమానూ భగవంతుని నామం చెప్పడం మొదలు పెట్టినట్లయితే అదే భగవంతుడిని మీ దగ్గరికి తీసుకువచ్చి, మీ బుద్ధిని మార్చి, మిమ్మల్ని సక్రమమయిన మార్గంలోకి తిప్పేస్తుంది. అలా తిప్పి ఏది గెలవలేక జీవితం పాడైపోతున్నదో దానిని గెలవగలిగిన మార్గమును ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. తృప్తి కలవాడు చక్రవర్తి కంటే అధికుడు. మనం తరించదానికి భగవంతుని నామము, రూపము పట్టుకుంటే చాలు అని తృణావర్తోపాఖ్యానం ద్వారా తెలుసుకుంటున్నాం. ఇదీ కృష్ణ పరమాత్మ సౌజన్యం అంటే! 

శ్రీకృష్ణ బలరాముల బాల్యలీలలు :

నెమ్మది నెమ్మదిగా కృష్ణ బలరాములు పెద్దవారవుతున్నారు. లోకమున కంతటికీ నడక నేర్పే పరమాత్మ నందవ్రజంలో తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఏమి ఆశ్చర్యం అని ఆకాశంలో అప్సరసలందరూ నాట్యం చేశారు. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఆహా ఏమి అదృష్టం ఏ పరమాత్మకు హవిస్సులు ఇస్తున్నామో అటువంటి పామాత్మ ఈవేళ బుడిబుడి నడకలు నడుస్తున్నాడు’ అని దివ్యదృష్టితో చూసి సమాహి మగ్నులయిపోయారు. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకు మరణకాలం దగ్గరకు వచ్చిందని వాళ్ళ అడుగులు తడబడడం మొదలుపెట్టాయి. అమ్మ చెపుతున్న కథలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. తల్లి చిన్న వేణువును ఇస్తే ఆ వేణువును ఊదుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజుల పాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు.

తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెఱిభూతి పూఁతగాఁగ; 
ముందఱ వెలుగొందు ముక్తాలలామంబు తొగలసంగడికాని తునుకగాఁగ; 
ఫాలభాగంబుపైఁ బరగు కావిరిబొట్టు కాముని గెల్చిన కన్నుగాఁగఁ; 
గంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయ మగు మెడకప్పుగాఁగ;
హారవల్లు లురగ హారవల్లులుగాఁగ; బాలలీలఁ బ్రౌఢబాలకుండు 
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును వేఱులేమిఁ దెలుప వెలయునట్లు!!

ఈ సందర్భంలో పోతనగారు ‘మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటుంటే నాకు కృష్ణుడు కనపడడం లేదు. ఒంటినిండా భస్మం అలముకున్న బాలశంకరుడు కనపడుతున్నాడు అన్నారు. ఆయన మెడలో చిన్న హారం వేసుకొని మధ్యలో నీల పతకం ఉంటే ఆ పతకం కాంతి కంఠం మీద కొడుతుంటే గరళమును కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనపడుతున్నాడు. అమ్మ కొప్పుకు కట్టిన ముత్యాల సరాలు చూస్తుంటే కపర్ది అని పెద్ద జటాజూటం వుండి అందులో గంగమ్మను ధరించి చంద్రరేఖను పెట్టుకున్న శంకరుడు దర్శనం అవుతున్నాడు. మెడనిండా అమ్మ హారములు వేస్తే నాగ భూషణుడై పాములను ధరించిన శంకరుడు దర్శనం అవుతున్నాడు. చిన్ని కృష్ణుడు నా వంకచూసి పోతనా, కృష్ణుడు, శివుడు అని ఇద్దరు లేరయ్యా’ అని నాకు పాఠం చెప్పినట్లు, ‘కృష్ణుడు శివుడని రెండుగా కనపడుతున్నది ఒకటే తత్త్వము సుమా అని నాకు పాఠంచెప్పాడా అన్నట్లుగా కనపడ్డాడు’ అని పద్యం రాసుకున్నారు. మహాను భావుడు ఎంత శివకేశవ అభేదమును పాటించి ధన్యుడయిపోయాడో చూడండి!

మహానుభావుడు పోతనగారు కృష్ణుని బాల్యలీలలు వర్ణిస్తూ ఎన్నో చక్కని పద్యములు వ్రాశారు. ఇపుడు మనం పోతనగారిని మరచిపోయాం. అది మన దౌర్భాగ్యం. కనీసం ఒక్క గ్రామములో గాని, పట్టణంలో కానీ, పోతనగారి విగ్రహం లేకపోవడం చాలా విచారించవలసిన విషయం. పిల్లలకి, ఈయనరా పోతనగారు’ అని చెప్పడానికి ఇళ్ళల్లో పోటో లేని దరిద్రానికి తెలుగుజాతి దిగజారిపోవడం మన దౌర్భాగ్యం. 

అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి పోయేవాడు. అన్ని ఇళ్ళల్లో వున్న వెన్న నెయ్యి అన్నీ తినేసేవాడు. ఎవరయినా తన మీద నేరములు చెపితే అమ్మ నమ్మకుండా ఉండాలని బయటే మూతి అంతా శుభ్రంగా తుడిచేసుకునే వాడు. అలా వెన్నలన్నీ తినేసి వచ్చాడు. కృష్ణ పరమాత్మ అలా వెన్న నెయ్యి తినడంలో ఒక రహస్యం ఉంది. 

మొదట మీ అంతట మీరుగా చేసుకోవలసిన ప్రయత్నంతో ఏర్పడే మనస్సు నిర్మలమయిన మనస్సు ఈ నిర్మలత్వము ఎవ్వరూ తేలేరు. మీ అంతట మీరు ఈశ్వర కథాశ్రవణం చేసి, భగవంతుడిని మనస్సుకి ఆలంబనం ఇచ్చి రాగద్వేషములకు అతీతంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇలా నిర్మలంగా ఉన్న మనస్సును’పాలకుండ’ అని పిలుస్తారు. ఇపుడు ఈ మనస్సుకు ఈశ్వరుని తీసుకు వచ్చి ఆలంబనం ఇచ్చినట్లయితే అది పొంగిపోవడం మొదలుపెడుతుంది. భక్తితో కూడిన కర్మాచరణమును సంతోషంతో కూడిన పూజను చేయడం మొదలు పెడతారు. అలా పూజ చేస్తే దాని చేత భక్తి ఏర్పడుతుంది. భక్తి చేత ఏర్పడిన కర్మ వలన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధి వలన వైరాగ్యభావన కలుగుతుంది. ఈ వైరాగ్యమనే అగ్నిహోత్రము మీద నిర్మలమయిన మనస్సు అనబడే పాలుకాగాలి. ఈ పాలు ఎర్రటి తొరక కడతాయి. కమ్మటి పాలు నిర్మల కైంకర్యము అయిన మనసు వలన, భక్తివలన వైరాగ్యభావన అనే అగ్నిహోత్రం మీద కాలి, కాగి వున్నాయి. ఇప్పుడు ఈ పాలు పెరుగు అవ్వాలి.

పాలను పెరుగుగా మార్చాలంటే పెరుగు కావాలి. పెరుగే పాలను పెరుగుగా మారుస్తుంది. ఇంతకూ పూర్వం ఈశ్వరుని గుణములను విని లోపల స్తంభించిపోయి ధ్యానమునందు ఎవరు అనుభవించాడో వాడే వచ్చి మరల ఆమాట చెప్పాలి. గురువు ఉపదేశం వినాలి. పెరుగు పాలలోకి వచ్చి తోడుకుంటుంది. రమించిపోయి బోధిస్తున్న గురూపదేశమును కదలని కుండలా పట్టాలి. ఈ పాలలోకి ఆ పెరుగు పడాలి. అలా పడితే ఆ పాలు తోడుకుంటాయి. గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు. అలా పరంపరగా గురువు వెనుక గురువు తయారవుతాడు. 

పెరుగు గట్టిగా తోడుకున్న తరువాత ఇప్పుడుమీరొక పని చెయ్యాలి. ఇంతకూ పూర్వం గురువులు చెప్పిన మాటలను చెవితో విని వదలడం కాకుండా వారు చెప్పిన మాటలను లోపల బాగా తిప్పాలి. ఈ తిప్పడమే మననము అనే కవ్వము. ఇది తిరుగుతుంటే పెరుగు చిలకబడుతుంది. గురువు వలన తాను విన్న విషయములను కూర్చుని మనసుపెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినపడుతుంది. ఆయన వెంటనే వచ్చేస్తాడు. పెరుగును చిలికితే లోపలనుండి వెన్న పైకి వస్తుంది. పైకి తేలుతుంది. వెన్నకి రెండు లక్షణములు ఉంటాయి. ఈ వెన్నను అగ్నిహోత్రం మీద అపెడితే కరిగి నెయ్యి అవుతుంది. నీటిలోకాని, మజ్జిగలో కానీ వేస్తె తేలుతుంది. భగవత్సంబంధమయిన జ్ఞానమనే గ్నిహోత్రం తగిలితే ఇప్పటి వరకు పాలలోనే వున్నా పైకి కనపడని నెయ్యి యిప్పుడు చిట్టచివరి దశలోపైకి వస్తుంది. పాలను నెయ్యిగా తీసుకురావాలంటే ఇదంతా జరగాలి. కానీ నేతిని తిరిగి పాలుగా మార్చలేము. ఒకసారి బ్రహ్మ జ్ఞానమును పొందేసిన తర్వాత ఇంకతాను వెనక్కి వెళ్ళడు. తాను ప్రారబ్ధం అయిపోయే వరకు శరీరంలో ఉంటాడు. శరీరం పడిపోతూ ఉండగా అమ్మయ్య శరీరమును వదిలి పెట్టేస్తున్నాను అని జీవుడు సంతోషిస్తాడు. 

ఇటువంటి ఆత్మజ్ఞాన స్వరూపమయిన వెన్న నెయ్యి కాదు. దీనిని ఆధారం చేసుకుని ఆత్మదర్శనం అవ్వాలి. దానికి నిధి ధ్యాసనం లోనికి వెళ్ళాలి. లోపలి వెన్న ఎవ్వరికీ పనికిరాదు ఒక్క ఈశ్వరునికే పనికి వస్తుంది. అనగా అత్యంత ప్రశాంతమయిన ప్రదేశమునందు కూర్చుని పరమేశ్వరుని ధ్యానం చేయాలి. ఈ వెన్నను ఒక్క ఈశ్వరుడే తింటాడు. అన్యులు దీనిని తినలేరు. ఈశ్వరుడు ఇక్కడకు వచ్చి తినడమే గోపకాంతల ఇళ్ళల్లోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడం. అపుడు ఆ భక్తి, ఆ వెన్న కృష్ణ స్పర్శ చేత జ్ఞానముగా మారుతుంది. అది నేయి. అది యజ్ఞమునందు పడుతుంది. అదే హవిస్సుగా మారుతుంది. ఈ శరీరము పడిపోయి పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతాడు. ఇదీ కృష్ణుడు వెన్న తినడం అంటే! అంతేకానీ చేతకాక, పనిలేక, అవతారమును స్వీకరించి వాళ్ళింట్లోకి, వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్నలు దొంగతనం చేసి తిన్నాడని దాని అర్థం కాదు. ఎందుకు వెన్న తిన్నాడో అంతరమునందు విచారణ చేయాలి. దీనిని నవనీత చోరత్వము అంటారు. వెన్నను ప్రసాదంగా స్వీకరించడం వెనకాతల వున్న రహస్యం అది!




శ్రీమద్భాగవతం - 70 వ భాగం



కృష్ణ పరమాత్మ వెన్నలన్నీ తినేసి వచ్చాడు. ఆ వచ్చిన గోపీజనమును చూసి యశోద ‘ఏమిటమ్మా మీరందరూ ఇలా వచ్చారు? అని అడిగింది. అక్కడకు వచ్చిన గోపకాంతలు అందరూ ఒకరి తర్వాత ఒకరు కృష్ణుని మీద ఫిర్యాదులు చెప్పడం ప్రారంభించారు. ఒక గోపకాంత అన్నది 

బాలురకు బాలు లేవని, బాలింతలు మొరలు వెట్ట పకపక నగి యీ 
బాలుండాలము సేయుచు నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!!

‘అమ్మా యశోదా! నీవేమిటో ‘మా అబ్బాయి మా అబ్బాయి’ అని పొంగిపోతున్నావు కానీ మీ అబ్బాయి ఎలాంటి పనులు చేస్తున్నాడో తెలుసా? చంటి పిల్లలకి తల్లి పాలు లేకపోతే ఆవుపాలు పడతారు. బాలింతలు సాయంకాలం అవుతోంది. ఇక పిల్లాడికి పాలు పడదాం అనుకునే సమయంలో మీ పిల్లవాడు వచ్చి ఆవుపాలు వీళ్ళకి దక్కకుండా దూడలను వదిలేస్తున్నాడు. ఆ దూదలన్నీ వచ్చి ఆవుల పాలను తాగేస్తున్నాద్యి. అపుడు మీవారు ఎదురుగుండా వున్న చెట్టుకొమ్మ ఎక్కి దూడలను వదిలినందుకు మేము బాధ పడుతుంటే అతను చక్కగా నవ్వుతూ కూర్చుంటున్నాడు. మాకు దొరకడు’ అని చెప్పింది. 

ఇందులో ఉండే అంతరార్థమును పరిశీలిద్దాం. మనకి మన కుటుంబం వరకే మన కుటుంబం. పక్కింటి వాళ్ళ అబ్బాయి తినకపోతే నాకెందుకు అనుకుంటాం. కానీ ఈశ్వరుడు జగద్భర్త. ఈ లోకమునంతటికీ తండ్రి. ఇపుడు ఆయన రెండు పనులు ఏకకాలమునందు చేస్తున్నాడు. ఆవుదూడలు అంటే ఉపనిషత్తులు. వాటిని పోషిస్తున్నాడు. ఈశ్వరుడు ఉపనిషత్ జ్ఞానమును పోషిస్తాడు. అందుకని దూడలను వదిలాడు. రెండవది ఆవులు ఎక్కడికో వల్లి గడ్డితిని కుడితి తాగి వాటిని పాలుగా మారుస్తున్నాయి. ఆవులు తమ దూడలకు పాలను ఇవ్వడానికి సంతోషంగా ఎదురు చూస్తుంటాయి. ఇంటి యజమాని వచ్చి ముందుగా దూడ దగ్గరకు వెళ్ళి దానిమెడలో వున్న ముడిని విప్పెస్తాడు. వెంటనే దూడ పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆర్తితో తల్లి పాలను తాగుతుంది. పాపం, ఇంకా దూడకు ఆకలి తీరదు. వీడు ఆ దూడను లాగేసి స్తంభమునకు కట్టేసి వీడి పిల్లాడి కోసం పాలను పితకడం ప్రారంభిస్తాడు. దాని దూడ దాని పిల్ల కాదూ! నీ పిల్లాడు ఎక్కువా! కానీ ఈశ్వరునికి ఆవు తనబిడ్డే, దూడా తన బిడ్డే. అందుకని ఆయన వదిలాడు. నీవు ఆయనను వంక పెట్టడం ఎందుకు? నీవు ఆయనలలో దొంగ ఎవరు? నీవా, ఆయనా? ఆయన దొంగ కాదు. నీవు దొంగ. నీ దొంగతనం దాచుకుని చోరలీల ని ఆయనయందు దొంగతనం చెపుతున్నావు. అటువంటివారి దొంగ బ్రతుకును స్వామి బయటపెడుతున్నాడు. ఇదీ దీని అంతరార్థం. 

మరొక గోపస్త్రీ 
పడతీ నీ బిడ్డడు మా కడవలలో నున్న మంచి కాగిన పాలా 
పడుచులకు బోసి చిక్కిన, కడవల బో నడిచె నాజ్ఞ గలదో లేదో? 

యశోదా, నీకు అసలు క్రమశిక్షణ లేదు. నీకే లేనిది నీ పిల్లాడికి ఎలా వస్తుంది? ఏమి చేశాడో తెలుసా! మా యింట్లో పాలన్నీ ఎర్రగా కుండల్లో కాచాము. అటువంటి పాలు పిల్లలందరినీ తీసుకు వచ్చి చప్పుడు చేయకుండా కుండలను ఎత్తి ఆ పాలన్నీ తాగేసి ఆ కడవలను క్రిందపారేసి వాటిని తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. పాలూ పోయాయి, కడవలూ పోయాయి. ఇదెక్కడి పిల్లాడు’ అంది.


ఒకరికి పెట్టడం అన్నది లేకుండా ఎప్పుడూ తమకోసమే దాచుకునే వారి యిట్లో ఐశ్వర్యమును ఈశ్వరుడు ఎలా తీసేస్తాడో ఎవరికీ తెలియదు. అసలు పరాయి వాడికి పెట్టడం రాని యింట్లోంచి లక్ష్మీదేవిని ఎలా తీసుకు వెళ్ళిపోవాలో నారాయణునికి తెలుసు. నిశ్శబ్దంగా తీసుకువెళ్ళి పోతాడు. కాబట్టి పరులకు పెట్టడం నేర్చుకుంటే నీ జీవితం వృద్ధిలోకి వస్తుంది. నీవు ఏది పెట్టావో అది నీకు ఆస్తి. పుణ్యం నిన్ను కాపాడుతుంది. అదీ ఇక్కడ కృష్ణుని ఈ చర్యలోని అంతరార్థం. ఇపుడు మరొక గోపిక లేచింది. ఈవిడ కొంచెం తెలివయినది. అప్పటికే కృష్ణుడు వచ్చి దొంగతనములు చేస్తున్నాడు అని కిందపెడితే పాలు పెరుగు తాగేసి కుండలు పగల కొట్టేస్తున్నాడు అని తెలుసుకుంది. అందుకని ఆమె తన కోడలిని పిలిచి ‘కుండలను క్రింద పెట్టకు ఉట్టి మీద పెట్టు కృష్ణుడికి అందదు’ అంది. అందరూ హాయిగా పడుకున్నారు. కృష్ణుడు వచ్చి చూశాడు. ‘అమ్మా ఎంత తెలివయిన దానివే! నీవు ఎక్కడ పెట్టావో నాకు తెలియదు అనుకుంటున్నావా అనుకున్నాడు. ఈశ్వరుడు ఐశ్వర్యమును తీసివేయాలంటే ఎక్కడ పెడితే మాత్రం తీయలేడు! ఆయన ఎక్కడ వున్నా వెన్నను (భక్తిని) తింటాడు అని రెండవ అర్థం. ఇపుడు కృష్ణుడు రోళ్ళు, పీటలు వేశాడు. చెయ్యి అందలేదు. అందుకని కుండకు క్రింద కన్నం పెట్టాడు. అందులోంచి శుభ్రంగా మిగతా పిల్లలందరితో కలిసి వెన్న తినేశాడు. ఆ గోపస్త్రీ ‘యశోదా, నీ కడుపు పైకి కనపడదు కానీ యింత తిండి తినేసే పిల్లవాడిని ఎక్కడ కన్నావమ్మా? వెన్న పాలు చేరలు పట్టి తాగేస్తున్నాడు’ అంది. మరొక ఆమె అమ్మా, మా యింటికి వచ్చి వెన్న, నెయ్యి తినేశాడు. ఈ యింట్లో కుండ పట్టుకువెల్లి పక్కవాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళి పోయేవాడు. వాళ్ళు లేచి చూసుకునే సరికి వాళ్ళ కుండలు పక్క ఇంట్లో ఉండేవి. వాళ్ళూ వీళ్ళూ దెబ్బలాడుకునేవారు. ఈయన వీధిలో ఆవులకి గడ్డి పెడుతున్నట్లుగా నిలబడి వీళ్ళ దెబ్బలాటని చూసి నవ్వుకునేవాడు. ఎందుకీ లీల? ఒక్కొక్కళ్ళకి తమకి సంపద ఉన్నదనే గొప్ప అహంకారం ఉంటుంది. తమ పక్కన పేదవాడు అన్నం లేక సొమ్మసిల్లి పడిపోయినా తాను మృష్టాన్న భోజనం చేసి పేదవాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోగలడు. అటువంటి వాడు నిర్దయుడు. బీదవానికి పట్టెడు అన్నం పెట్టమని అనలేడు. అలాంటి వాడి ఐశ్వర్యమును తీసివేయడమే కుండను మరొకచోట పెట్టడం. ఆయన తలుచుకుంటే వ్యక్తుల స్థానం మార్చగలడు కదా! కాబట్టి పేదవాడిని చూసి పరిహాసం చేస్తే ‘నీ పుర్రె అక్కడ పెట్టగలను – ఆ పుర్రె ఇక్కడ పెట్టగలను. జాగ్రత్త సుమా’ అని స్వామీ మనకు ఒక పాఠమును నేర్పారు. 

కృష్ణుడు ఇంకొక చోటికి వెళ్ళాడు. 
ఆడంజానీ వీరల పెరు, గోడక నీసుతుడు ద్రావి యొకయించుక తా 
గోడలి మూతిం జరిమిన, గోడలు మ్రుచ్చనుచు నత్త గొట్టె లతాంగీ!!

ఆ ఇంట్లోకి వెళ్లి శుభ్రంగా వెన్న, నెయ్యి తినేశాడు. ఆ ఇంట్లో అత్తాకోడళ్ళు పడుకుని ఉన్నారు. వెళ్ళిపోయే ముందు ఆ కోడలి మూతికి నెయ్యి రాసి వెళ్ళిపోయాడు. పొద్దుట నిద్రలేవగానే అత్తగారు కడవల వంక చూసుకుంది. నెయ్యి లేదు. కోడలు మూతివంక చూసింది. నెయ్యి ఉంది. ‘ఓసి ముచ్చా! రాత్రి నెయ్యంతా తినేశావా?’ అని కోడలిని పట్టుకుని కొట్టింది. ఈయన కిటికీలోంచి చూసి నవ్వుతున్నాడు.

అత్తకోడలికి నేర్పవలసిన గొప్ప ధర్మం ఒకటి ఉంటుంది. ఇంటికి వచ్చిన మహాత్ములను ఆదరించడం వలన ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంటి ఐశ్వర్యం కోడలి వలన నిలబడాలి. వచ్చిన అతిథులను ఎలా గౌరవించాలో అత్తగారు కోడలికి నేర్పాలి. అలాకాకుండా అత్తగారు కోడలికి దుష్టచేష్టలు నేరారంటే చివరికి అది వారిద్దరి మధ్య దెబ్బలాటలకు దారితీస్తుంది. అపుడు సంసారములు చితికిపోతాయి. ధర్మమునందు పూనిక ఉండదు. కాబట్టి అత్త కోడలిని సంస్కరించుకోవాలి. తండ్రి దానం చేసేటప్పుడు కొడుకును పక్కన పెట్టుకోవాలి. దానం చేయడం కొడుక్కి కూడా అలవాటయి రేపు వృద్ధిలోకి వస్తాడు. అది మహా ధర్మం. అది నేర్పారు స్వామి.

ఓయమ్మ! నీకుమారుడు, మా యిండ్లను బాలు బెరుగు మననీడమ్మా!
పోయెదమెక్కడి కైనను, మాయన్నుల సురభులాన్ మంజులవాణీ!!

చివరికి వాళ్ళు ‘అమ్మా! ఇంక నీ కొడుకు మా యింట్లో పాలు, పెరుగు బతకనివ్వడు.ఈ ఊరు విడిచి వెళ్లిపోతాము’ అన్నారు.
అం11టే యశోద వారిని ‘ఇవన్నీ ఎప్పుడు చేశాడు?’ అని అడిగింది. ‘ఇవన్నీ ఈవేళ పొద్దున్న చేశాడు’ అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆవిడ ;ఈవేళ పొద్దుటినుండి మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. మీరంతా నా కొడుకును గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు అందంగా ఉంటాడని, బుజ్జి కృష్ణుడని మీరు యిన్ని చాడీలు చెపుతారా! అన్నీ అబద్ధాములే’ అలా చెప్పకూడదమ్మా’ అంది. అపుడు ‘అవును ఇప్పుడెందుకు తెలుస్తుందిలే. ఇని ఇళ్ళల్లో జరిగినవి నీ ఇంట్లో జరిగినప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు ఎం చేస్తావో మేము చూస్తాము’ అని గోపికా స్త్రీలు అక్కడనుండి నిష్క్రమించారు. 

ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పనిచేసుకుంటోంది. బయట బలరాముడు, ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న ఆరు గబగబా పరుగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరకు వచ్చి ‘అమ్మా అమ్మా నువ్వు ఎన్నోమాట్లు కృష్ణుడికి మట్టి తినకూడదని చెప్పావు కదా! తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడు’ అని చెప్పారు. 

పిల్లలు దాక్కునే ఆట అని ఒక ఆట ఆడతారు. కృష్ణునికి అది చాలా యిష్టం. మనకి జారత్వం చోరత్వం చాలా యిష్టం. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆ రెండులీలలే చేశాడు. దొంగాట ఆడేటప్పుడు ఈయన ఎక్కడో దాక్కుని ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకునే వాడు. ఈ చర్యవలన భూకాంత పొంగిపోయేది. ఈలోగా మరొకచోట దాక్కున్న వాడు కృష్ణుడు నోట్లో మట్టిపోసుకోవడం చూశాడు. గోపబాలురందరూ కలిసి కృష్ణుని చేయిపట్టుకుని లాక్కుని యశోద దగ్గరకు తీసుకువెళ్ళారు. యశోద అదృష్టమే అదృష్టం. జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్నవాళ్ళు అరుదు. యశోద దగ్గరకు పరమాత్మ వెడితే ఆవిడ అంది 

మన్నేటికి భక్షించెదు? మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ 
యన్నయు సఖులును జెప్పెద, రన్నా! మన్నేల? మరి పదార్థము లేదే?

పిల్లలు చెప్పిన మాటలను ఆవిడ నమ్మేసింది. ఆయన ఏమీ తక్కువ వాడు కాదు. తిన్నాడు. యీలీల యశోద అదృష్టమును ఆవిష్కరిస్తోంది. పరమాత్మ లొంగిపోయినట్లుగా కనపడిన స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప మరొకచోట లేదు. ఆయన లోకములకన్నిటికి నడవడిని నేర్పినవాడు. ప్రపంచమునకు మార్గదర్శనం చేసిన మహా పురుషుడయిన పరమాత్మని ఈవిడ మార్గదర్శనం చేస్తోంది. ‘ఏరా కృష్ణా! మన్ను తినవద్దని నీకు ఎన్నిమాట్లు చెప్పాను! మన్ను ఎందుకు తింటున్నావు? నేను యింతకు ముందు నీకు ఎన్నోమాట్లు యిలా తినవద్దని చెప్పాను కదా! నీవు యిలా ఎందుకు చేశావు?’ అని అడిగింది. 

అపుడు కృష్ణుడు మాట్లాడిన తీరును పోతనగారు ఎలా దర్శనం చేశారో చూడండి 
అమ్మా! మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెర్రినో ?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము జేసి నా వచనముల్ తప్పైన దండింపవే !!

అమ్మా, నేను మన్ను తినడమేమిటి? నేను శిశువునా? నేను వెర్రివాడనా? వీళ్ళ మాటలు నమ్మి నన్ను మట్టి తిన్నావని అనేస్తున్నావు. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ నామీద కల్పించి చెప్తున్నారు. ఆయన వేదాంతం ఎంత చెప్తున్నారో చూడండి! తన్మాత్రాలలో పృథివికి వాసన ఉంటుంది. ‘నేను నిజంగా మట్టిని తిన్న వాడనయితే పృథివిలో నుండి వాసన వస్తుంది కాబట్టి నా నోరు మట్టి వాసన రావాలి కదా! ఏదీ నా నోరు వాసన చూడు. వాసన వస్తే అప్పుడు కొట్టు’ అన్నాడు. అపుడు యశోద ‘ఏమిటి వీడు యింత తెంపరితనంగా మాట్లాడుతున్నాడు. మట్టి తినలేదంటున్నాడు. నిజం ఏమిటో యిప్పుడు పరిశీలిస్తాను’ అని కృష్ణుడిని నోరు తెరవమంది. ఏమి యశోదాదేవి అదృష్టం! ఎంతో తపస్సు చేసిన మహాపురుషులు ఎక్కడో జారిపోయి మరల జన్మములు ఎత్తారు. అంతటా నిండివున్న ఈశ్వరుని చూడలేకపోయారు. అంతటా ఈశ్వరుని చూడడం అనేది జ్ఞానము. ఏమీ చదువుకొని స్త్రీకి అంతటా ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు పరమాత్మ. ఈశ్వరుని యందు లోకం కనపడుతోంది. లోకము ఈశ్వరుని యందు ఉన్నది. పరమాత్మ యిప్పుడు ఈ తత్త్వమును ఆవిష్కరిస్తున్నాడు. ఇది బ్రహ్మాండ దర్శనం. దీనినే ‘మృద్భక్షణమున విశ్వరూప ప్రదర్శనము’ అంటారు పోతనగారు. కృష్ణుడు నోరు తెరిచాడు. సమస్త పర్వతములతో, నదులతో, సముద్రములతో, చెట్లతో, నరులతో, లోకంతో, నంద వ్రజంతో, నందవ్రజంలో వున్నా పశువులతో, తన యింటితో, తనతో, నందుడితో కలిసి అందరూ లోపల కనపడ్డారు. ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోటిలో కనపడుతుంటే ఆవిడ తెల్లబోయింది. 
కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో 
తలపన్ నేరకయున్నదాననో యశోదాదేవి గానో పర 
స్థలమో బాలకుడింత యాతని ముఖస్థంబై యజాండంబు ప్ర 
జ్వలమై యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్!!

నోరు తెరిస్తే పిల్లవాని నోట్లో వున్నవి అన్నీ చూసి యశోద ‘ఇది కలా? వైష్ణవ మాయా? ఏదయినా సంకల్పమా? అసలు నేను యశోదనేనా? నేను నా యింట్లోనే ఉన్నానా? వీడు నా కొడుకేనా? వీని నోట్లో బ్రహ్మాండములు అన్నీ ఉన్నాయా? ఆలోచించి చూస్తె చాలా ఆశ్చర్యంగా ఉంది. పిల్లవాడేమిటి? నోట్లో బ్రహ్మాండములు ఏమిటి?” అని ఆశ్చర్యపోయింది. యశోద కృష్ణుని కేవలము తన కొడుకుగా భావన పెంచుకుంది. ఈ ప్రేమయే భక్తి. తెలియకుండా ప్రేమించినా ఆమె ఈశ్వరునే ప్రేమించింది. ఇటువంటి భక్తికి పర్యవసానము జ్ఞానము. ఇదే విశ్వరూప సందర్శనము. 

అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి అనుకున్నారు. అమ్మ యిలా జ్ఞానంతో ఉండిపోతే నాకు అమ్మగా ఉండలేదు. కాబట్టి మరల వైష్ణవ మాయ కప్పాలి అనుకొని ఆమె జ్ఞానమును ఉపసంహారం చేశాడు. అంతే! ఆమె వైష్ణవమాయలోకి వెళ్ళిపోయింది. ఇదే పరమాత్మ అనుగ్రహం అంటే.


భాగవతం - 71 వ భాగం  CLICK HERE

శ్రీమద్భాగవతం Bhagavatham Telugu (భాగవతం) Part 06

శ్రీమద్భాగవతం - 51 వ భాగం



ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అటువంటి ఆలోచనలు ఎవరయినా తన కుమారునికి నేర్పారేమోనని ఆయనకు అనుమానం కలిగి “నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీవు రాక్షసునికి జన్మించిన వాడివి. ఇలాంటి బుద్ధులు నిజంగా నీకే పుట్టాయా లేక ఎవరయినా పిల్లలు పక్కకి తీసుకెళ్ళి రహస్యంగా నీచేత చదివిస్తున్నారా?” అని అడిగాడు. “ఈ గురువులు నిన్ను చాటుకు తీసుకు వెళ్ళి ఇలాంటివేమయినా నేర్పుతున్నారా? శ్రీమహావిష్ణువు మన జాతికంతటికీ అపకారం చేసినవాడు. అటువంటి వాడిని స్తోత్రం చేస్తావా? అలా చెయ్యకూడదు” అన్నాడు. ఇవన్నీ విని ప్రహ్లాదుడు “

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీవీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు 
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేర నేర్తు! వినుత గుణశీల, మాటలు వేయునేల?

ఎక్కడయినా పారిజాత పుష్పములలో ఉండే తేనె త్రాగడానికి అలవాటు పడిపోయిన తుమ్మెద ఎక్కడో ఉన్న ఉమ్మెత్త పువ్వు మీద వాలుతుందా? ఎక్కడో హాయిగా ఆకాశములో ఉండే మందాకినీ నదిలో విహరించడానికి అలవాటు పడిపోయిన రాజహంస ఎండిపోతూ దుర్గంధ భూయిష్టమయిన ఒక చెరువు దగ్గరకు వెళ్ళి ఆ నీళ్ళు తాగుతుందా? ఎక్కడయినా లేత మామిడి చిగురు తాను తిని ‘కూ’ అంటూ కూయడానికి అలవాటు పడిన కోయిల ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అడవిమల్లెలు పూసే చెట్టుమీద వాలుతుందా? పూర్నమయిన చంద్రబింబం లోంచి వచ్చే అమృతమును త్రాగడానికి అలవాటు పడిపోయిన చకోరపక్షి పొగమంచును త్రాగడానికి ఇష్టపడుతుందా? సర్వకాలముల యందు తామరపువ్వుల వంటి పాదములు కలిగిన శ్రీమన్నారాయణుని పాదములను భజించడం చేత స్రవించే భక్తి తన్మయత్వమనే మందార మకరందపానమును త్రాగి మత్తెక్కి ధ్యానమగ్నుడనై ఉండే నాకు నీవు చెప్పే మాటలు ఎలా తలకెక్కుతాయి? నేను ఇతరములయిన వాటిమీద దృష్టి ఎలా పెట్టగలుగుతాను?” అని అడిగి వేయిమాటలెందుకు? నాకు నీవు చెప్పిన లక్షణములు రమ్మనమంటే వచ్చేవి కావు’ అని అన్నాడు.

ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి గురువుల వంక చూసి ‘మీరు వీడికి పాఠం చెప్పడంలో ఏదో తేడా ఉన్నదని నేను అనుకుంటున్నాను. లేకపోతే నేను ఎంత చెప్పినా వీడు ఇలా చెపుతున్నాడేమిటి? ఈమాటు తీసుకు వెళ్ళి చాలా జాగ్రత్తగా వేయి కళ్ళతో చోస్తూ ఈ పిల్లవాడికి విద్య నేర్పండి. అన్నాడు. చండామార్కులు పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్లకి భయం వేసింది. వాళ్ళు ప్రహ్లాదునితో “నాయనా, మేము నీకు నేర్పినది ఏమిటి? నువ్వు చెప్పినది ఏమిటి? మీ నాన్నకి మామీద అనుమానం వచ్చింది. ఇపుడు మా ప్రాణములకు ముప్పు వచ్చేటట్లు ఉంది. కాబట్టి మేము ఏమి చెప్తున్నామో అది జాగ్రత్తగా నేర్చుకో. మాకు ఏమి చెప్తున్నావో అవి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అప్పచెప్పు. ఇంక ఎప్పుడూ నీవు అలాంటి పలుకులు పలుకకూడదు. గురువుల మయిన మేము ఏమి చెప్పామో అది మాత్రమే పలకాలి అర్థమయిందా?” అన్నారు. అపుడు ప్రహ్లాదుడు ‘అయ్యా, చిత్తం. మీరు ఏమి చెపుతారో దానిని నేను జాగ్రత్తగా నేర్చుకుంటాను’ అని చక్కగా నేర్చుకున్నాడు. ఎక్కడనుంచి ఏది అడిగినా వెంటనే చెప్పేసి చక్కా వ్యాఖ్యానం చేసేస్తున్నాడు. ఇప్పుడు పిల్లవాడు మారాడని వారు అనుకున్నారు. ఎందుకయినా మంచిదని తల్లి దగ్గర కూర్చుని మాట్లాడడానికి, తండ్రి దగ్గర మాట్లాడదానికి పెద్ద తేడా ఉండదని ముందుగా అతనిని తల్లి లీలావతి దగ్గరకు తీసుకువెళ్ళారు.

లీలావతి కుమారుని ప్రశ్నించింది ‘నాయనా, బాగా చదువుకుంటున్నావా? ఏది నీవు నేర్చుకున్నది ఒకమాట చెప్పు’ అంది. ధర్మార్థ శాస్త్రములలోంచి కొన్ని మాటలు చెప్పాడు తల్లికి. తన కుమారుడు చాల అమారిపోయినందుకు తల్లి చాలా సంతోషించింది. గురువులు కూడా సంతోషించి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి దగ్గరకు తీసుకువెళ్ళారు. హిరణ్యకశిపుడు కుమారుని చూసి “నీ బుద్ధి మారిందా? గురువులు ఏమి చెప్తున్నారో అది తెలుసుకుంటున్నావా? గురువులు చెప్పిందే తెలుసుకుంతున్నావా? లేక సొంత బుద్ధితో ఏమయినా నర్చుకున్తున్నావా?’ అని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు 

“చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు నే 
జదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రీ!!

గురువులు నన్ను చదివించారు. ధర్మశాస్త్రం, అర్థ శాస్త్రములను నూరిపోశారు. ఇవే కాకుండా నేను ఇంకా చాలా చదువుకున్నాను. చదువుల వలన తెలుసుకోవలసిన చదువేదో దానిని నేను తెలుసుకున్నాను అన్నాడు. అపుడు హిరణ్యకశిపుడు నువ్వు తెలుసుకున్న మొత్తం చాడువులోంచి సారభూతమై పిండి వడగడితే ఇది వింటే చాలు అన్నపద్యం ఒక్కటి నాకు చెప్పు’ అని కుమారుని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు 

తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీతొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మిస
జ్జనుడైయుండుట భద్రమంచు దలతున్ సత్యంబుదైత్యోత్తమా!!
“శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం 
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం!!

అంటారు వ్యాసమహర్షి. ‘తండ్రీ ఈ శరీరం ఉన్నందుకు మనం ఈశ్వరుడిని తొమ్మిది రకములుగా సేవించాలి. ఇదే నును చదువుకున్న చదువుల మొత్తం సారాంశము’ అని చెప్పాడు. ఈమాటలకు హిరణ్యకశిపుడు తెల్లబోయాడు. అపుడు ఆటను అన్నాడు ‘ఒరేయ్, ఇది గురువులు చెప్పలేదు, నేను చెప్పలేదు. అలాంటి ఆలోచన నీకు ఎక్కడినుంచి వస్తోంది? నువ్వు రాక్షస జాతిలో పుట్టావు. కంటికి కనపడని శ్రీమన్నారాయణుని మీద నీకు భక్తి ఎక్కడినుండి వచ్చింది?” అని అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు తండ్రీ, మీకందరికీ రాని యాలోచన నాకెందుకు వస్తోందని అడిగావు కదా! ఆయనను విడిచిపెట్టి మిగిలినవి నీవు ఎన్ని చేసినా అవి అన్నీ ఎటువంటి పనులో చెపుతాను. పుట్టు గుడ్డి వాడిని తీసుకు వెళ్ళి పున్నమి చంద్రుని దగ్గర కూర్చోబెట్టి పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో చూడరా అంటే ఎంత అసహ్యమో ఈశ్వరుడిని విడిచి పెట్టి సంసారం చాలా బాగుంటుంది అనుకోవడం అంత అసహ్యకరం. 

కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు; శేషశాయికి మ్రొక్కు శిరము శిరము;
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు; మధువైరిఁ దవిలిన మనము మనము;
భగవంతు వలగొను పదములు పదములు; పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి;
తే. దేవదేవుని చింతించు దినము దినము; చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు;
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు; తండ్రి! హరిఁ జేరు మనియెడి తండ్రి తండ్రి!!

కమలముల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుని అర్చించిన చేతులు ఏవయితే ఉంటాయో వాటికి చేతులని పేరు. శ్రీ మహావిష్ణువు గురించి పరవశించి పోయి స్తోత్రం చెయ్యాలి. అర్చన చేసేటప్పుడు ఒకమెట్టు పైన నిలబడి లింగాభిషేకం చేయమన్నారు. శేషశాయికి మొక్కని శిరము శిరము కాదు. ఆ మహానుభావుడి గురించి కీర్తనము చేయని నోరు నోరు కాదు. ఆయనకు ప్రదక్షిణలు చేయని కాళ్ళు కాళ్ళు కాదు. ఆయనను లోపల ధ్యానం చేయని మనస్సు మనస్సు కాదు. ఆయనను గురించి చెప్పని గురువు గురువు కాదు” అని ఇంకొక మాట చెప్పాడు.

కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మభస్త్రి గాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమ ధనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక
చక్రిచింత లేని జన్మంబు జన్మమే? తరళ సలిల బుద్భుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే? పాదయుగము తోడి పశువు గాక!!

ఈశ్వరుడు మహోదారుడు. ఆయన నిర్మించిన ఈ శరీరము చాలా గొప్పది. తొమ్మిది రంధ్రములు కలిగిన తోలు తిత్తియందు పడి వాయువులు ఆయన శాసనము అయ్యేంతవరకు బయటకు వెళ్ళడానికి వీలులేదు. అలా నిక్షేపించి నడిపిస్తున్న పరమాత్ముని తలుచుకోని వాడు, ఆ కన్జాక్షుని సేవించడానికి సిద్ధపడని శరీరము శరీరము కాదు. అది వట్టి తోలుతిత్తి. అందుచేత తండ్రీ చెయ్యవలసినది ఏదయినా వుంటే ఒక్క కైంకర్యము చేయడానికే మనిషి బ్రతకాలి. అటువంటి బుద్ధితో ఉండాలి అన్నాడు



శ్రీమద్భాగవతం - 52 వ భాగం



ప్రహ్లాదుడు చెప్తున్న విషయములను విని హిరణ్యకశిపుడు కోపించిన వాడై గురువుల వంక చూశాడు. మేమేమీ చెప్పలేదు మహా ప్రభో అన్నట్లు హడలిపోయి చూస్తున్నారు చండామార్కులు. “ఈ పద్యములన్నీ నీకు ఎక్కడినుంచి వచ్చాయి? శ్రీమన్నారాయణుని సేవించాలని ఎలా చెప్తున్నావు? నీకీ భక్తి ఎలా కలిగింది? వాళ్ళెవరో నాకు చెప్పు. వాళ్ళ సంగతి చూస్తాను” అన్నాడు. ప్రహ్లాదుడు అన్నాడు ‘నాన్నా నీలాంట్ వాడికి శ్రీమన్నారాయణుని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినా నీకు అర్థంకాదు. నీ కళ్ళను మూసుకున్నావు. అజ్ఞానంలో పడిపోయిన వారికి చెపితే తలకెక్కుతుందా! అజ్ఞానావస్థలో కోరికోరి కూరుకుపోతూ సంసారము సత్యమని నమ్మే నీలాంటి అహంకార పూరితమయిన వ్యక్తులకి ఎవరు చెప్పారని చెపితే నీకు అర్థం అవుతుంది?” అని అన్నాడు.

ఈతని మాటలు వినేసరికి హిరణ్యకశిపునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. రాక్షసులను పిలిచి “వీడిని చంపండి. వీడిని తీసుకెళ్ళి మంచులో నిలబెట్టండి, కొన్నాళ్ళు అన్నం ఇవ్వడం మానేయండి. ఆ తరువాత వీడి నవరంధ్రములు మూసేసెయ్యండి. ఆ తరువాత నేను నా మాయను చూపెట్టి భయపెదతాను. మరుగుతున్న నూనెలో వేయండి. పర్వత శిఖరముల మీదనుండి కింద తొయ్యండి. ఏనుగులతో తొక్కించండి. సముద్రంలో పారెయ్యండి” అన్నాడు. 

తనని శూలంపెట్టి రాక్షసులు పొడిచేస్తుంటే, పర్వత శిఖరం మీదనుంచి కింద పారేస్తుంటే, సముద్రంలోకి విసిరేస్తుంటే, కిందపడేసి ఏనుగుల చేత తొక్కేస్తుంటే, రాక్షసులలో, తండ్రిలో, అందరిలో, అంతటా, శ్రీమన్నారాయణుని చూసి పొంగిపోతుంటే గుప్తరూపంలో స్వామి లక్ష్మీ సహితుడై వచ్చి ప్రహ్లాదుని పట్టుకున్తున్నాడు. ఇంతమంది కలిసి కుమ్మితే ఏమీ జరగడం లేదు. ఈశ్వరుడిని నమ్ముకున్న వాడికి ఏమి లోటు ఉంటుంది. రాక్షసులు అలా హింసిస్తుంటే ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే నిలబడి నారాయణ జపం చేస్తుంటే అంతకంతకీ తేజోవిరాజితుడు అయిపోతున్నాడు. హిరణ్యకశిపుడికి ఒక్కొక్క వార్త వస్తోంది. ప్రహ్లాదుడు ప్రకృతికి అతీతమయిన స్థితిని పొందాడు. తన వాడయిన కారణం చేత, తనయందు భక్తి కలిగిన కారణం చేత ఈశ్వరుడు ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించుకున్నాడు. హిరణ్యకశిపుడు రాత్రింబవళ్ళు దీనవదనంతో కూర్చుని ఉన్నాడు. ప్రహ్లాదుని చంపడానికి ఎన్ని ఉన్నాయో అన్నింటిని ప్రయోగించాడు. కానీ అతడు చచ్చిపోలేదు. కనీసం నీరసపడలేదు. పైగా తాను ప్రయత్నించే కొలదీ పిల్లవాడు ఎక్కువ తేజమును పొందుచున్నాడు. ఇప్పుడు గురువులు ‘బెంగ పెట్టుకోవద్దు. చావుతో సమానమయిన మందు ఒకటి మావద్ద ఉంది. వీనిని తీసుకువెళ్ళి అది వేసేస్తాము. ఈ పిల్లవాడికి వయస్సు వస్తోంది కాబట్టి చాలా గొప్పగా రకరకాలుగా కామశాస్త్రాన్ని బోధ చేసేస్తాము. వీడు భ్రష్టుడు అయిపోతాడు. సంసరమునండు అనురక్తి కలుగుతుంది’ అని చెప్పి పిల్లవాడిని తీసుకువెళ్ళి అతనికి శాస్త్ర బోధ ప్రారంభించారు. పరమ సంతోషంగా కూర్చుని గురువులు చెప్పినది చక్కగా నేర్చుకుంటున్నాడు. 

ఒకరోజున గురువులు తమ గృహకార్యములను నిర్వర్తించుటకు లోపలికి వెళ్ళారు. వెంటనే ప్రహ్లాదుడు పిల్లలందరినీ పిలిచి “ఒరేయ్ మీరు ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు కానీ నేనుమీకొక విషయం చెప్తాను. మీరందరూ కూర్చోండి. అని మనకి ఆయుర్దాయం నూరు సంవత్సరములు. రాత్రి అయితే నిద్రపోటాము. కాబట్టి ఏభై ఏళ్ళు నిద్రలో పోతుంది. ఇరవై ఏళ్ళు శిశువుగా బాల్యంలో పోతుంది. ఇంకా మిగిలింది ముప్పది ఏళ్ళలో మన కోరికలన్నీ అక్కర్లేని వాటికన్నింటికీ తగుల్కొని అరిషడ్వార్గాలకి లొంగిపోతాయి. నా మాట వినండి. ఈ పంచ భూతములను, మూడు గుణములను, ఇరవై ఏడు తత్త్వములను నిర్మించి మాయచేత పరమాత్మ ఈశ్వర దర్శనం కాకుండా కప్పి ఉంచాడు. ఆత్మ ఒక్కటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆత్మా దర్శనాభిలాషులు అవండి. నామాట నమ్మండి’ అన్నాడు. వాళ్ళు ‘ఈపాఠం చాలా గమ్మత్తుగా ఉంది. నువ్వు మాతోనే కలిసి ఇక్కడ చేరావు. మాతోనే చదువుకున్నావు. గురువులు మాకేమి చెప్పారో నీకు కూడా అదే చెప్తున్నారు. గురువులు చెప్పని విషయములు నీకు ఎవరు చెప్తే వచ్చాయి?” అని అడిగారు. అపుడు ప్రహ్లాదుడు ‘మహానుభావుడయిన నారదుడు చెప్పాడు’ అని బదులిచ్చాడు. అపుడు వాళ్ళు ‘నారదుని నీవు ఎప్పుడు కలుసుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు?’ అని అడిగారు.

హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణి అయిన లీలావతిని చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురువచ్చి ‘మహాపతివ్రత అయిన కాంతను ఎందుకు చెరపట్టి తీసుకువెళుతున్నావు” అని అడిగాడు. ఆయన ‘నాకు ఆవిడ మీద క్రోధం లేదు. ఆవిడ గర్భమునందు హిరణ్యకశిపుని తేజం ఉన్నది. వాడు తపస్సుయందు మడిసిపోతాడని మేము అనుకుంటున్నాము. ఈలోగా బిడ్డపుట్టి వాడు కూడా పెరిగి పెద్ద వాడయితే చాలా ప్రమాదం. అందుకని ఆ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి ఈమెను విడిచిపెడతాను అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు ‘నీకేమి తెలుసు! ఆవిడ గర్భంలో మహావిష్ణు భక్తుడయిన వాడు ఉన్నాడు. వాడు జన్మచేత భక్తిజ్ఞాన వైరాగ్యములతో పుడుతున్నాడు. అటువంటి మహాపురుషుని కథ వింటే తరించిపోతాము. అందుకని లీలావతిని నా ఆశ్రమమునకు తీసుకువెడతాను’ అని తీసుకు వెళ్ళి అక్కడ వేదాంత తత్త్వమును ప్రబోధం చేశాడు. చెబుతున్నప్పుడు లీలావతి వింటూ ఉండేది. చిత్రమేమిటంటే విన్న లీలావతి మరిచిపోయింది. కడుపులో వున్న పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. అలా జ్ఞాపకం ఉండడానికి కారణం తన గొప్పతనమని ప్రహ్లాదుడు చెప్పలేదు. ‘మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యములలో నారడుచు చెప్పిన బోధ మరిచిపోయింది. అందుకు కారణం గురువుల అనుగ్రహం మా అమ్మయందు లేదు. గురువుల అనుగ్రహం, దైవ అనుగ్రహం నాయందు ఉన్నది. అందుకని అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయింది. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూశారా’ అన్నాడు.

అపుడు పిల్లలందరూ లేచి నారాయణ భజన చేయడం మొదలు పెట్టారు. లోపలనుంచి గురువులు బయటకు వచ్చారు. ప్రహ్లాదుడిని పట్టుకుని జరజర ఈడుస్తూ హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళి ‘అయ్యా, తులసివనంలో గంజాయి పుట్టినట్లు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు. వీడికి పాఠం చెప్పడం దేవుడెరుగు, వీడు రాక్షస బాలకులనందరిని పాడుచేసేశాడు. అందరిని నారాయణ భక్తులుగా చేసేస్తున్నాడు’ అన్నారు. ఇలా అనేసరికి హిరణ్యకశిపుడు ‘ఎవరి దిక్కు చూసూకుని ఎవరి బలం చూసుకొని నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు’ అని కుమారుని చూసి అడిగాడు.

బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్!
బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్రా!!

‘నాన్నా, నీలో బలానికి కారణమెవడో వాడే నాలో బలమునకు కూడా కారణం. బలహీనుడయిన వానిలో వున్న కొంచెం బలానికి కారణం ఎవరో లోకములను సంపాదించిన మహాబలవంతుల బలమునకు కారణమెవడో వాడు నాకు దిక్కు’ అన్నాడు. ‘ఏమిరా, వాడు దిక్కు దిక్కు అంటున్నావు కదా, వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా?’ అని హిరణ్యకశిపుడు అడిగాడు. ‘నాన్నా, ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతావేమిటి? ఇదొక వెర్రి ప్రశ్న. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుం 

డెందెందు వెదకి చూసిన నందందే కలడు దానవాగ్రణి వింటే!!

జ్ఞాననేత్రంతో చూసే దంతి కనపడదు. దారువు కనపడుతుంది. ఆభరణం కనపడదు. స్వర్ణం కనపడుతుంది. పాత్ర కనపడదు. మట్టి కనపడుతుంది. జ్ఞాన నేత్రంతో చూడు. ఉన్నది నారాయణుడు ఒక్కడే. అంతటా స్వామి ఉన్నాడు. నువ్వు చూడడానికి ప్రయత్నం చెయ్యి’ అన్నాడు. ఒక ప్రక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవశ్యం వచ్చేసి పొంగిపోతూ ప్రహ్లాదుడు నాట్యం చేస్తూ

కలడంబోధి, గలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం 
గల, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గల, డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటం
గల, దీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల నీ యా యెడన్!!

నాన్నా, ఈశ్వరుడు ఎక్కడలేడు అని అడుగు. ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు. రాత్రులందు పగలందు, ఆకాశమునందు పైన మధ్యలో సర్వభూతములయందు అగ్నియందు ఓంకారము నందు సమస్త ప్రపంచమునందు నిండి నిబిడీ కృతమై ఉన్నాడు. ఆయనలేని ప్రదేశం లేదు’ అనేసరికి హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది.




శ్రీమద్భాగవతం - 53 వ భాగం



ప్రహ్లాదుడి మాటలకు హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. అటువంటి స్థితిలో హిరణ్యకశిపుడు ఒక స్తంభము వైపు వేలు చూపించి ‘ఈ స్తంభమునందు ఉన్నడా?’ అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు ‘అనుమానమా’ అన్నాడు. ‘అయితే చూపించు’ అన్నాడు. ‘నేను చూపించడమేమిటి – నువ్వు అడుగు వస్తాడు’ అన్నాడు ప్రహ్లాదుడు.

వెంటనే హిరణ్యకశిపుడు సింహాసనం మీదనుంచి దిగి గద ఎడమచేతితో పట్టుకుని కుడి అరచేతితో స్తంభం మీద ఒక దెబ్బ కొట్టాడు. అందులోంచి ఒక భయంకరమయిన మెరపు మెరిసింది. అది ప్రళయకాలంలో మెరిసే మెరపు ఎలా ఉంటుందో అటువంటి మెరపు వచ్చింది. ఆ మెరుపు కాంతికి అక్కడ ఉన్న వాళ్ళంతా స్పృహతప్పి పడిపోయారు. ప్రళయకాలమునందు పిడుగులు పడితే ఎటువంటి చప్పుళ్ళు వస్తాయో అంట భయంకరమయిన ధ్వనులు వచ్చాయి. మహానుభావువు అపారమయిన తేజోవంతమయిన పాదములతో, పాదములకు అలంకరింపబడిన మణి మంజీరములతో, బలిష్ఠమయిన తొడలతో, గుండ్రని పిక్కలతో, అలంకరింపబడిన పట్టు పీతాంబరంతో, దానిమీద పెట్టబడిన మొలనూలుతో, మొలనూలు నుంచి వస్తున్న చిరుగంటల సవ్వడితో, పిడికిలితో పట్టుకోవడానికి వీలయిన సన్నని నడుముతో, గుండ్రంగా తిరిగి లోపలికి వెళ్ళిన నాభితో, కఠినమయిన శిలవంటి విశాలమయిన వక్షస్థలంతో, అనంతమయిన బాహువులతో, శంఖ చక్ర గదా పద్మ తోరణములను గండ్ర గొడ్డలిని పట్టుకున్న వాడై, చక్కటి పొడుచుకు వచ్చిన చుబుకముతో, గాలికి అల్లల్లాడే నవపల్లవము ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి అదురుతున్న రోషముతో కూడిన పెదవితో, ముత్యాలవంటి దంతపంక్తితో, మందరపర్వతం గుహ ఎలా ఉంటుందో అటువంటి నోటితో, నాసికా రంధ్రములతో, తూర్పుకొండ మీద ప్రకాశిస్తున్న రెండు సూర్యులా అన్న నేత్రములతో, విశాలమయిన ఫాలభాగముతో, అంతటా ఆవరించిన ఎర్రటి జుట్టుతో, నవరత్న ఖచితమయిన కిరీటంతో అటూ ఇటూ శిరస్సును కదుపుతుంటే ఆయన రోమములు ఆకాశమంతా వ్యాపించి కొడితే ఆకాశమునందు సంచరించే సిద్ధుల విమానము అన్నీ క్రింద పడిపోయాయి. ఆనాడు స్తంభంలోంచి బయటకు వచ్చి గర్జన చేసి ఘార్ణిల్లితే ఆ ధ్వనులకు సముద్రములు తిరుగుడు పడ్డాయి. భూమి కంపించి బద్దలయి పోయింది. ఎక్కడి వాళ్ళక్కడ సంభీభూతులై ప్రళయం వస్తోందని అనుకున్నారు. ఇటువంటి మూర్తిని చూసి కూడా హిరణ్యకశిపుడు దుస్సాహసం చేశాడు. కత్తి పట్టుకుని స్వామిమీద పడ్డాడు.

స్తంభంలోంచి బయటకు వచ్చి చంద్రహాసమును దూస్తున్న హిరణ్యకశిపుని ఆనాడు తాను ఎలా ప్రతిజ్ఞచేశాడో అలా కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను నాగుపాము ఒడిసి పట్టినట్లు తన ఎడమచేతితో హిరణ్యకశిపుని తొడ పట్టుకొని గడప దగ్గరకి తీసుకు వెళ్ళి ప్రళయకాలంలో వచ్చే ధ్వనిలాంటి గర్జన చేస్తూ ఆ గడప మీద కోర్చుని తన తొడల మీద పడేసి భయంకరమయిన కనుబోమలను వేయి ఇంద్రధనుస్సులను ఒక్కసారి విరిచినట్లు ముడివేసి ఘోరమయిన స్వరూపంతో ఇలా చూస్తుంటే మెరిసిపోతున్న దంష్ట్రలు, ఆ నోరు, కాలనాగు వేలాడుతున్నట్లు వున్న నాలుక, పెద్ద గోళ్ళు అటువంటి స్వామి తన బాహువుల నెట్టి తన గోళ్ళు చూపితుంటే ఆయన స్వరూపమును చూసి కాళ్ళుచేతులు వేలాడేసి ఆయనకు లొంగిపోతే, ఆగ్రహంతో, తన భక్తుడిని ఇన్ని కష్టములు పెట్టాదన్న క్రోధంతో మాట తప్పకుండ, ఇంట్లో కాదు బయట కాదు మధ్యన గడప మీద. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు తన తొడల మీద, అస్త్రము కాదు శస్త్రము కాదు ప్రాణము ఉన్నది కాదు ప్రాణము లేనిది కాదు గోళ్ళచేత. క్రిందకాదు పైన కాదు తొడల మీద, మనిషి కాదు జంతువూ కాదు నరసింహావతారంతో, భయంకరమయిన స్వరూపంతో, విశేషమయిన క్రౌర్యంతో ఆ గోళ్ళను పొట్టలోకి దింపి భేదించి గండ్ర గొడ్డలి పెట్టి ఉరః పంజరమును బద్దలు కొట్టి, హృదయ క్షేత్రమును చేతితో పట్టుకుని గుండె కింద నలిపి వేసి ఆ కండలు తెంపి ముక్కలు చేసి తుంపి అవతల పారేసి, నెత్తురు తీసి దోసిళ్ళతో నోట పోసుకుని ప్రేగులు తీసి మెడలో వేసుకుని ప్రళయ గర్జన చేస్తూ నృసింహావతారం నిలబడింది.

ఆయన వెళ్ళి సింహాసనం ఎక్కుతుంటే అసుర గణములు మీద పడ్డాయి. అనేకమయిన చేతులు పైకెత్తి ఆయుధములతో కొన్ని కోట్ల అసురులను ఒక్కడే మట్టుపెట్టాడు. సింహాసనం ఎక్కి పాదపీఠంమీద పాదములను వుంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు కింపురుషులు అందరూ వచ్చి స్వామిని అనేకవిధముల స్తోత్రము చేశారు. కానీ ఆయన ఘార్ణిల్లుతున్న శబ్దమునకు ఆయన చేస్తున్న ప్రళయ గర్జనలకు ఎవ్వరూ తట్టుకోలేక పోయారు. ఎవ్వరూ దగ్గరకు వెళ్ళలేక అమ్మవారిని చేరి ‘అమ్మా, నీవు నిత్యానపాయినివి. నీవు మాత్రమే ఆ స్వామివారి స్వరూపమునకు ప్రళయ శాంతిని ఉపశాంతిని చేయగలవు. నీవు స్వామివారి దగ్గరకు వెళ్ళు’ అని కోరారు. ఆవిడా అంది ‘ఇదేదో ప్రళయకాలంలో ప్రకాశించే సూర్యబింబంలా ఉన్నది కానీ నేను సేవించే స్వామివారి ముఖ మండలంలా లేదు. నా స్వామిలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే దయారసంతో కూడిన ముఖం కాదు. ఇది భార్య దగ్గరకి వెళ్ళడానికి సాహసించే మూర్తి కాదు’ అంది.

అపుడు బ్రహ్మాదులందరూ స్తోత్రం చేశారు. అయినా ఆయన చేసిన గర్జనలు ఆగలేదు. అపుడు బ్రహ్మగారు ప్రహ్లాదుడిని పిలిచి ‘నాయనా, నరసింహుడు భక్త పరాధీనుడు. నీవు వెళ్ళు’ అన్నారు. ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల దగ్గర చాలా తేలికగా సాష్టాంగ పడిపోయాడు. ఇంత ధ్వని చేస్తున్న వాడు, ప్రశాంత పడిపోయి పెద్ద చిరునవ్వు నవ్వి, ‘ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వదించి తలమీద చేయివేసి రెండుచేతులతో పట్టుకు తీసుకువచ్చి తన తొడమీద కూర్చో పెట్టుకున్నాడు. నిజంగా ప్రహ్లాదుడు ఏమి అదృష్టం పొందాదండి!

ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడు ‘స్వామీ నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చేయలేకపోయారు. వేదము తాను ఇక నిన్ను ఆవిష్కరించ లేనని వెనుదిరిగింది. అటువంటి నిన్ను రాక్షస వంశములో పుట్టిన బాలుడిని నేను ఏమి స్తోత్రం చేస్తాను? నిన్ను చేరడానికి. ‘నేను తపం చేశాను, యజ్ఞం చేశాను లేదా ఏదో క్రతువు చేశాను. ఈ కర్మచేశాను అంటే అలా నీవు కర్మలకి లొంగిపోయే వాడవు కావు. ఆ చేసిన కర్మల చేత హృదయ క్షేత్రమునందు శుద్ధి ఏర్పడి వైరాగ్యము ఏర్పడి ఈశ్వరుని సంతతము ధ్యాన నిష్టయందు కొలిచిన వాడెవడో అటువంటి వాడికి లొంగిపోయే స్వరూపం ఉన్నాడివి. అటువంటి స్వామివి ఇవాళ నాయందు కరుణించావు అన్నాడు. ఈ మాటలకు ప్రసన్నుడయి పోయి ఆరోజున నరసింహ స్వామి అన్నారు – ‘ప్రహ్లాదా, ఇలా నన్ను మెప్పించిన భక్తుడు లేడు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నాడు. అపుడు ప్రహ్లాదుడు ‘అందరూ నీ రూపం చూసి భయపడ్డారు. నేను నీరూపం చూసి భయపడలేదు. నాకు నీవెప్పుడూ తండ్రివే. నేను సంసారమునకు భయపడతాను, కామక్రోధములకు భయపడతాను. ‘నేను’ ‘నాది’ అనే భావనలకు భయపడతాను. నాకు వరం ఇస్తానని నన్ను మరల మభ్యపెట్టాలని చూస్తున్నావా తండ్రీ! నాకేమీ వద్దు. సంతతము నీపాదాంబుజ సేవ కటాక్షించు. నీ నామము చెప్పుకునే అదృష్టమును కటాక్షించు. నీ కథలు వినే అదృష్టమును కటాక్షించు. నాకింకేమీ వద్దు’ అన్నాడు. అపుడు స్వామి ‘అసలు నీలాంటి భక్తుడు ఎక్కడ వున్నాడురా, నిన్ను చూసి పొంగిపోతున్నాను. నీవు ఏదో ఒకటి అడగకపోతే నేను నాకు తృప్తి ఉండదు. నా తృప్తి కోసం ఏదో ఒకటి అడగవలసింది’ అన్నారు. అపుడు ప్రహ్లాదుడు ‘ఎంత కాదన్నా హిరణ్యకశిపుడు నా తండ్రి, అజ్ఞాని. తండ్రీ అతడు ఎన్ని నీచ యోనులలోకి వెడతాడో! అలా వెళ్ళకుండా నా తండ్రిని నీ దగ్గరికి చేర్చుకుంటే నా తండ్రి కాబట్టి, నాకు జన్మనిచ్చిన వాడు కాబట్టి నేను సంతోషిస్తాను’ అన్నాడు. అంటే స్వామి పెద్ద నవ్వు నవ్వి ‘ప్రహ్లాదా! నీ చరిత్రము ధన్యము. ఎంత గొప్ప వరం అడిగావు. ఏనాడు నీ తండ్రి నేను కోరలు విప్పి పళ్ళు చూపిస్తూ గోళ్ళు అతని కడుపు పైనుంచి నా నేత్రములతో చూస్తూ వుంటే, అతి దగ్గరగా మహర్షులు, మునీంద్రులు కూడా చూడని నా రూపమును తేజోహీనుడై అలా చూస్తూ ప్రాణములను వదిలాడో ఆనాడే నాకు దగ్గర అయిపోయాడు. అందుకని నీవు నీ తండ్రి గురించి బెంగ పెట్టుకోవద్దు. రాజ్యపాలన చేసి వంశమును వృద్ధిలోకి తెచ్చుకో’ అని స్వామి వారు ఆనాడు మనకందరికీ గొప్ప వరమును కటాక్షించారు. అదే మనందరం కూడా తప్పకుండా స్మరించవలసిన పద్యం.

“శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం
హారము బుణ్య భాగవతుడైన నిశాచరనాధ పుత్ర సం
చారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభా
కారము తోడ నే భయము గల్గని లోకము జెందు భూవరా!!

ఈ ప్రహ్లాదోపాఖ్యానమును ఎవరు పరమ భక్తి శ్రద్ధలతో చేతులు కైమోడ్చి ఈశ్వరుడు ఉన్నాడు అన్న పూనికతో వింటున్నారో, ఉగ్రనరసింహ మూర్తియై తన భక్తులను బాధపెట్టిన వాడి పట్ల కోపము తెచ్చుకున్న స్వామి మూర్తి వర్ణనను వింటున్నారో, మళ్ళీ భక్తుడు చేసిన స్తోత్రమునకు ప్రసన్నుడయిన మూర్తి కథను విన్నారో, అటువంటి వారికి ఇంక యమధర్మరాజు దర్శనము ఉండదు. వారికి ఇక్కడే నేను భక్తిని కర్మని వైరాగ్యమును జ్ఞానమును ఇచ్చి, జ్ఞానము చేత మోక్షమును ఇచ్చి వారందరినీ తరింపచేస్తాను అని అభయం ఇచ్చారు.


శ్రీమద్భాగవతం - 54 వ భాగం



అష్టమ స్కంధము – గజేంద్రమోక్షం 

గజేంద్రమోక్షం సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం. ‘గజ’ అనే అక్షరములను కొంచెం అటూ ఇటూ మారిస్తే ‘జగ’ అవుతుంది. ‘జ’ అంటే ‘జాయతే’. ‘గ’ అంటే ‘గచ్ఛతే’. ‘జాయతే’ అంటే వెళ్ళిపోవడం. ‘గచ్ఛతే’ అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉన్నదో దానిని ‘జగము’ అంటారు. శాశ్వతంగా ఉండిపోయేది ఉండదు. అలా ఏదయినా ఉండిపోయేది ఉన్నట్లయితే దానిని ఈశ్వరుడు అని పిలుస్తాము. ఈ జగము కథ ఇప్పుడు గజముగా చెప్పాలి. అదే గజేంద్రమోక్షంలో ఉన్న రహస్యం.

గజముగా ఎందుకు చెప్పాలి? అంటే ఈ ప్రపంచంలో ఏనుగు ఒక్కదానికి మాత్రమే ఒక బలహీనత ఉంది. భూమినుండి చాలా తక్కువ ఎటు మాత్రమే ఎగరగలిగిన ప్రాణి ఏనుగు ఒక్కటే. ఏనుగు పైకి ఎగరలేక పోవడానికి దాని శరీరబరువే దానికి అడ్డు వస్తుంది. మనిషి ఈశ్వరుడి వైపుకి ఊర్ధ్వ గతికి ఎందుకు నడవలేడు? అతని సంసారమే అతనికి బరువై ఉంటుంది. మగ్నత పెంచుకుంటున్న కొద్దీ సంసారం బరువైపోతూ ఉంటుంది. నిజమునకు అది ఏనుగు కథా లేక మన కథా? నిజంగా మీరు ఏనుగు కథగా విన్నా కూడా గజేంద్రమోక్ష కథను వింటే విశేషమయిన శుభ ఫలితం కలుగుతుందని ఆఖరున ఫలశ్రుతిలో చెప్తారు. నిత్య పారాయణము చేయవలసినది అని నిర్ణయింపబడిన కథ గజేంద్రమోక్ష కథ. అలాంటి గజేంద్రమోక్షం జీవితంలో ఒక్కసారి విన్నా చాలు. వారికి అపారమయిన ఫలితం కలుగుతుంది. సాధారణంగా ఫలశ్రుతిని ఎవరు గ్రంథమును రచించారో వారు చెబుతారు. గజేంద్రమోక్ష సన్నివేశంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఫలశ్రుతిని చెప్పారు. ఈ గజేంద్రమోక్ష కథా శ్రవణము ఒక పూజకాదు, ఒక కర్మ కాదు.

పరీక్షిత్తుతో శుకుడు ఏమన్నాడంటే ‘ఒకానొక మన్వంతరంలో శ్రీహరి ఒక ఏనుగును ఒక మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠము నుండి కదలివచ్చి రక్షించాడు’ అని తరువాతది చెప్పబోతున్నారు. అప్పుడు పరీక్షిత్తు ‘స్వామీ, ఏమిటా కథ? అంత విచిత్రంగా చెప్పారు” అన్నాడు. అపుడు శుకబ్రహ్మ పరీక్షిత్తు ఆర్తికి సంతోషించి గజేంద్రమోక్ష కథను చెప్పడం ప్రారంభించారు.

ఒకానొకప్పుడు క్షీరసాగరం ఉన్నది. అందు త్రికూటాచలం అనే పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతమును మూడు శిఖరములు ఉన్నాయి. ఒక శిఖరము బంగారముతోను, మరొక శిఖరము వెండితోను, మూడవది ఇనుముతోను చేయబడ్డాయి. అందు ఎన్నో రకముల వృక్షములు, తీగలు పెరుగుతూ ఉండేవి. ఈ పరిసరములలో ఎన్నో రకములయిన జంతువులు ఉండేవి. ఏనుగులు పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉండేవి. ఆ ఏనుగులు బయటకు వస్తే అరణ్యంలో ఒక్క పులి మిగలదట. చామరీ మృగములు ఏనుగుల గుంపు చుట్టూ నిలబడి వాటి తోకలనే చామరములతో ఏనుగులకు విసిరేవి. ఆ ఏనుగులు ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి. అటువంటి ఏనుగులకు అధినాయకుడు ఒకాయన ఉండేవాడు. నాయకత్వం వహించే ఏనుగు కొన్ని ఏనుగులతో కలిసి దారి తప్పాడు. ఆ ఏనుగు ఆ మందకు రాజు. దానికి గల భార్యల సంఖ్య పదిలక్షల కోట్లు. జీవుడు ఒక్కడే కానీ ఎన్ని శరీరములో. ఈ పరివారంతో తిరుగుతున్నాడు. సంసారంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోయాడు. చాలా దూరం తిరిగాడు. నీటికోసం చాలా చోట్ల వెతికాడు. చిట్టచివరకు ఒక సరోవరం కనపడింది. అద్భుతమైన సరోవరం - అదే సంసారం. దీని ఒడ్డున వుంది నీరు త్రాగాలి. ఎందుకు అక్కడికి వచ్చాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయన పొంగిపోయి అబ్బ! ఈ సరోవరం ఎంత బాగుందో అనుకుని తన భార్యలతో అ నీళ్ళలోకి దిగాడు. మిగిలిన పరివారం అంతా నీళ్ళలోకి దిగింది. ఇప్పుడు ఆయనకు ఒక కోరిక పుట్టింది. తానెంత మొనగాడో తన భార్యలందరికీ చూపించాలనుకున్నాడు. 

తాగడానికి వెళ్ళినవాడు నీళ్ళు తాగడం మానివేసి గట్టిగా పాదములను ఊన్చుకుని నిలబడిన వాడై విపరీతమయిన శక్తితో తొండం నిండా నీళ్ళు లాగాడు. ఆ నీటివేగంతో లోపలి చేపలు వెళ్ళిపోయాయి. మొసళ్ళు వెళ్ళిపోయాయి. ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఒకసారి భార్యల వంక చూశాడు. నీటిని తొండంలో నిలబెట్టాడు. ఇప్పుడు ఊన్చుకుని తొండమును పైకెత్తి ఆ నీళ్ళను ఆకాశం మీదకి విసిరాడు. ఇలా పైకి చిమ్మేసరికి లోపల ఉన్న గాలి శక్తితోటి తొండంలో వున్న చేపలన్నీ వెళ్ళిపోయి మీనరాశిలో పడిపోయాయి. అందులో ఉన్న ఎండ్రకాయలన్నీ కర్కాటక రాశిలో పడిపోయాయి. మొసళ్ళు అన్నీ మకరరాశిలో పడిపోయాయి. అలా మూడు రాశులలో పడేటట్లు కొట్టాడు. ఇది చూసి ఆకాశంలో తిరుగుతున్న దేవతలు ఆశ్చర్యపోయారు. 

గజేంద్రుడు అలా చేసేసరికి దీనిని చూసి ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అందరూ సరోవరంలో దిగి నీళ్ళు తాగేస్తున్నారు, చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు. కనపడిన చిన్న మొసళ్ళను తొక్కి చంపేస్తున్నారు. పావుగంట అయేసరికి నీరు బురద అయిపోయి అంతా కల్మషం అయిపొయింది. ఇంత అల్లరి చేస్తుంటే, ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారు. గ్రహణంలో సూర్యుడిని పట్టినట్లు ఆ నీటిలో ఉన్న పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగులు చాలా అల్లరి చేస్తున్నాయి. ఈ అల్లరికి ఈ నాయక ఏనుగే ప్రధాన కారణము. దీనిని పట్టుకోవాలి అనుకుని తలపైకెత్తి చూసింది. భుగ భుగమనే చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలను పుట్టించి నీటిని జిమ్మీ తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి ఏనుగుకాలు ఎక్కడ ఉంటుందో పట్టేసుకుంది. మొసలి నీటి అడుగునుంచి పట్టుకోవడం అంటే సంసారం ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతంగా మృత్యువు వస్తుంది. కాబట్టి మృత్యువు కాలును పట్టింది. ఇహ కదలడు. పట్టు విడిపించుకుందామని చూస్తోంది. ఇపుడు మిగిలిన కోరికలన్నింటినీ పక్కన పెట్టేసినట్లయితే ఏనుగుకి వున్న కోరిక ఒక్కటే. ఆ మొసలి పట్టు తప్పించుకుని గట్టు ఎక్కేద్దామని ఏనుగు చూస్తోంది. ఏనుగు గట్టెక్కకుండా నీళ్ళలోకి లాగేద్దామని మొసలి చూస్తోంది. ఇప్పడు గజరాజుతో కూడివున్న మిగిలిన పరివారం ఏమి చేస్తున్నారు? 

మకరితోడ బోరు మాతంగ విభుని నొక్కరుని దించి పోవ గాళ్ళు రాక 
కోరి చూచుచుండె గుంజరీ యూధంబు మగలు దగులు గారే మగువలకును!!

ఈ పద్యం ఒక్కటి రోజూ స్మరణ చేసుకుంటే చాలు. వైరాగ్యం వస్తుంది. ఆయన మాతంగ విభుడు. గొప్ప ఏనుగు. ఈయన నీళ్ళల్లో యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఒడ్డున చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ రాజుగారు యుద్ధంలో నెగ్గి బయటకు వచ్చేస్తాడని గట్టుమీద వుండి చూస్తున్నారు. గజేంద్రుడు అలా ఎంతకాలం యుద్ధం చేశాడంటే వెయ్యేళ్ళు యుద్ధం చేసింది. అలా పట్టుకున్న మొసలి పట్టు తప్పుకోలేక అప్పుడు ఏనుగు అనుకుంటుంది “అయ్యో! భూమేమీద ఉంటే నాకు బలం. నిష్కారణంగా నీళ్ళలోకి ప్రవేశించాను. ఈ నీళ్ళలోకి ప్రవేశించిన తరువాత ‘నావారు’ అనుకున్న వారు వెళ్ళిపోయారు. ఒక్కడినే సరోవరంలో నిలబడిపోయాను. ఇప్పుడ నన్ను రక్షించే వారు ఎవరు?’ అని ఆ ఏనుగు అనుకుంటూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇంతకూ పూర్వం అతడు చేసిన పుణ్యం పూజ వలన ఆ స్థితిలో జ్ఞాపకమునకు వచ్చింది. 
పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈనాడు స్మ్రుతిలోకి వచ్చిన జ్ఞానము నొకదానిని ఏనుగు ప్రకటన చేస్తోంది. 

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్!!

ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితి కార్తో, ఎవరు ప్రళయ కర్తో, లోకములన్నిటిని ఎవరు సృష్టించారో, ఎవరు యందు లోకములు ఉన్నాయో. లోకములు ఎవరియందు పెరుగుతున్నాయో, లోకములు ఎవరి యందు లయము అయిపోతున్నాయో. ఎవరు అంతటా నిండి నిబిడీ కృతమై ఉన్నాడో, ఎవరి మాయ చేత ఇది జగత్తుగా కనపడుతున్నదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!’ అని స్తోత్రం చేస్తోంది. ఏనుగు చేసిన ప్రార్థనకు ముప్పది మూడుకోట్ల దేవతలు లేచి నిలబడ్డారు. 

లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం
జీకఁటి కవ్వల నెవ్వఁడు -
నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్!!

లోకములు, దీనిని పరిపాలిస్తున్నామని అనుకుంటున్న రాజులు, దేవతలు, ఈ లోకంలో ఉన్నామని అనుకున్న వాళ్ళు, ప్రళయం వచ్చి ఇవన్నీ ఒక్కటై పోయి నీరై పోయి ముద్దయి పోయి, గాడాంధకారం కమ్మేస్తే ఈ గాడాంధకారమునకు అవతల తానొక్కడే పరంజ్యోతి స్వరూపమై వెలిగిపోతున్నాడు.

ఎటువంటి మహాపురుషుడయిన వాడు, తానొక్కడే వుంది అనేకులుగా కనపడుతున్న వాడెవడో అలాంటి వాడిని ఎవరూ స్తుతి చెయ్యలేరో, ఆయన చేసే పనులను ఎవరు గుర్తుపట్టలేరో ఎవారూ చెప్పలేదో అటువంటి వాడు నన్ను రక్షించుగాక!” దేవతలు ఎవరి మటుకు వాళ్ళు ఏనుగు తమను ప్రార్థించడం లేదని కూర్చున్నారు. దేవతలు అలా కూర్చోవడంలో ఒక రహస్యం కూడా ఉన్నది. ఇప్పుడు ఏనుగు అడుగుతున్నది రక్షణ. మొసలిని చంపి రక్షించాలి. అంటే రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. స్థితికారుడు శ్రీమహావిష్ణువు. కాబట్టి అందులో రక్షణ అంతర్లీనంగా ఉంది. కాబట్టి అందరూ దేవతలు ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు. ఏనుగు ఎంత స్తోత్రం చేసినా మరి భగవంతుడు ఎందుకు రాలేదు? ఏనుగు ఇన్నీ చెప్పి చివర ఒకమాట అంది 
కలడందురు దీనులయెడ గలడందురు పరమయోగి గణముల పాలం 
గలడందు రన్ని దిశలను గలడు కలండనెడి వాడు గలడో లేడో!

ఇంతా చెప్తోంది కానీ దానికో అనుమానం. నిజంగా దీనులయిన వారు పిలిస్తే వస్తాడా? అంతటా ఉన్నాడు అని అంటారు. కానీ అలా ఉన్నాడని చెప్పబడుతున్న వాడు కలదు కలండనెడివాడు కలడో లేడో! అంది. ఆ ఏనుగుకి ఇంత అనుమానం ఉన్నప్పుడు తానెందుకు రావడం అని పరమాత్మ ఊరుకున్నాడు. 

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చెఁ దనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా!!

నీవు తప్ప నాకిప్పుడు దిక్కులేదు. నేను దీనుడిని. నా తప్పులన్నీ క్షమించు ఈశ్వరా! వరములను ఇచ్చేవాడా నీవు రావాలి. వచ్చి ఓ భద్రాత్మకుడా నన్ను రక్షించు అని పిలిచి స్పష్టమయిన శరణాగతి చేసింది. ఏనుగు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తున్న సమయంలో పరమాత్మ తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్థించింది. వైకుంఠము నుండి రావాలి.




శ్రీమద్భాగవతం - 55 వ భాగం



అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనగుయ్యాలించి సంరంభియై!!

ఎక్కడో వైకుంఠపురం లోపల వున్నాడు. బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు – ఆయన ధనుస్సు, కౌమోదకి అనబడే గద – అన్నీ పురుషాకృతులలో బయట ఎదురు చూస్తున్నారు. ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరం. దాని ప్రక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడిన పర్యంకము మీద అంతా అలంకారం చేయబడి పరచబడిన అరవిరిసిన కలువపువ్వులు, ఆ పువ్వుల మధ్యలో పడుకున్న లక్ష్మీ దేవి. ఆ లక్ష్మీదేవి ప్రక్కన కూర్చుని, ఆవిడ పైట కొంగును చేతితో పట్టుకొని వేళ్ళకు చుట్టుకొని చంటి పిల్లవానిలా ఆడుకుంటున్న శ్రీమన్నారాయణుడు. అలాంటి స్థితిలో ఉన్నా సరే తనని ఎవరయినా పిలిస్తే ఒక్కసారి మనఃస్ఫూర్తిగా పిలిస్తే పరుగెత్తుకు వచ్చే లక్షణము ఉన్నవాడు, ఏనుగు తనను రక్షించమణి దీనముగా ప్రార్థించేసరికి శరణాగతి చేసి దాని దురవస్థను గమనించాడు. 

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై!!

లక్ష్మీదేవికి చెప్పలేదు. చెప్పకుండా పమిట కొంగు పట్టుకుని అలాగే వెళ్ళిపోతున్నాడు. ల్శంఖము, చక్రము, గద, పద్మము ఇవేమీ లేవు. నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి. వెనక వస్తున్న పరివారంతో ఒకమాట మాట్లాడడు. తనను అధిరోహించమని గరుత్మంతుడు ఎదురువస్తున్నాడు. ఆయనని తోసి అవతల పారేస్తున్నాడు. ఆయానవి పెద్ద పెద్ద కళ్ళు. జుట్టు ఆ కళ్ళమీద పడిపోతోంది. ఆజుట్టును వెనక్కి తోసుకోవడం కానీ వెనక్కి సర్దుకోవడం కానీ చేయడం లేదు.’అయ్యయ్యో! అలా పమిట పట్టుకు వెళ్ళిపోతున్నారేమిటి – వదలండి’ అని వెనుకనుండి లక్ష్మీదేవి అంటోంది. కానీ ఆయన ఆమె మాట వినిపించుకోవడం లేదు. ఆ ఏనుగు ప్రాణములు రక్షించడం కోసమని ఆయన అలా వెళుతున్నాడు. ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమమునకు స్వామి లొంగిపోయాడు. స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదా!

తన వెంటన్ సిరి, లచ్చివెంట నవరోధ వ్రాతమున్, దానివె
న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీ కాంతుండు, రావచ్చి రొ
య్యన వైకుంఠ పురంబునం గలుగువా రాబాల గోపాలమున్!!

ముందు స్వామి వెళ్ళిపోతున్నారు. పచ్చని పట్టు పీతాంబరం కట్టుకుని అమ్మవారి కొంగు పట్టుకొని వెళ్ళిపోతుంటే, ఆవిడ తన కొంగును రెండు చేతులతో పట్టుకుని ఆయన వెనుక ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే ఆవిడ వెనుక అంతఃపుర కాంతలు అందరూ పరుగెడుతున్నారు. ఆ వెనుక గరుడ వాహనం పరుగెడుతోంది. శంఖము, చక్రము, కౌమదకి, శార్ఙ్గమనే ధనుస్సు, బాణములు పెట్టుకునే తూణీరము, ఇవన్నీ కూడా ఆయన వెనుక పురుష రూపమును దాల్చి పరుగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి. విష్వక్సేనుడు, నారదుడు వచ్చేస్తున్నారు. ఆ వైకుంఠములో ఉన్న పిల్లవాని దగ్గరనుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఆకాశంలో వచ్చేస్తున్నారు. 

వాళ్ళు అమ్మవారి దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఆయన సంగతి నీకు తెలుస్తుంది కదా! అసలు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? అలా ఇంతకు పూర్వం ఎప్పుడయినా వెళ్ళాడా?’ అని అడిగారు. అపుడు అమ్మవారు –‘ఆయన అలా వెళ్ళిపోతున్నారు అంటే ఎవరో ఖలులు వేద ప్రపంచమును సోమకుడు తస్కరించినట్లు తస్కరించి ఉండవచ్చు. లేకపోతే ఏదయినా సభలలో ఆర్తి చెందిన కాంతలు గోవిందా అని ప్రార్థన చేస్తే వెడతారు. చిన్న పిల్లలను పట్టుకుని ఏదిరా పరమాత్మ ఎక్కడ ఉన్నాడో చూపించమని పెద్దవాళ్ళు ధిక్కరిస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలను రక్షించడానికి వెడుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి సందర్భములు ఏమైనా వచ్చినవేమో! అందుకని అలా స్వామి పరుగెడుతున్నారు’ అంది.

అడిగెదనని కడువడి జానూ, నడిగిన దన మగుడ నుడువడని నడ యుడుగున్ 
వెడ వెడ సిడి ముడి తడబడ, నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్!!

అలా వెడుతున్న అయ్యవారి కాళ్ళల్లో అమ్మవారి కాళ్ళు పడిపోతూ, ఈ అడుగుతున్నా వాళ్ళ మాటలకు జవాబులు చెప్పలేక, అమ్మవారి అడుగులు తడబడుతూ, అయ్యవారి వెనకాతల నడిచింది. అలా వెళ్ళిపోతుంటే చెవులకు పెట్టుకున్న తాటంకములు ఊగుతున్నాయి. అవి అమ్మవారి ఎర్రటి చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి. ఇంతలో దేవలోకములలో ఉన్నవాళ్ళు, మనుష్య లోకంలో ఉన్నవాళ్ళు ఏమిటో ఇంత వెలుతురుగా ఉన్నదేమిటని ఆకాశం వంక చూశారు. ఒక్కసారి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలబడి పోయారు. తపస్సులు చేస్తే కనపడని వాడు ఈవేళ ఇలా వెళ్ళిపోతున్నాడు చూడండి చూడండి అని చూపిస్తున్నారు. జనులందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తూ ‘నమో నారాయణా’ అంటూ నమస్కారములు చేస్తూ నిలబడ్డారు. కానీ పరమాత్మ మాత్రం తొందరగా వెళ్ళి ఏనుగుని రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరకు వెళ్ళి నిలబడి సుదర్శన చక్రమును పిలిచి, వెళ్ళి ఆ మొసలి కుత్తుకను కత్తిరించమని చెప్పాడు. వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలో పడింది. గుభిల్లుమని శబ్దం వచ్చింది. సుదర్శన చక్రం మొసలి కుత్తుకను కత్తిరించేసింది. సుదర్శన చక్రం మొసలి తలకాయను కోస్తుంటే మకరము అనే పేరు గలవి అన్నీ మిక్కిలి భయపడ్డాయి.

మకర రాశి సూర్యుని చాటుకు వెళ్ళి నక్కింది. నవ నిధులలో ఒక నిదియైన మకర నిధి భయపడిపోయి కుబేరుని చాటుకు వెళ్ళి దాగుంది. మొసలి అని పేరున్న ప్రతి మొసలి కూడా అభాయపడి అవి ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయి. ఎప్పుడయితే సుదర్శనం మొసలి కుత్తుకను కత్తిరించి స్వామి చేతిని అలంకరించిందో ఆ ఏనుగు సంతోషంతో కాలు పైకి తీసుకుని నావాడన్న వాడు, ఒక్కసారి పిలిస్తే వచ్చేవాడు ఈయన ఒక్కడే. మిగిలినవి అన్నీ కృతకములే అని తెలుసుకుంది. అలా తెలుసుకున్నదై కాలు నొకసారి విదుల్చుకొని మెల్లగా ఒక తామరపువ్వును తీసుకుని మెల్లగా అడుగులు వేస్తూ గట్టెక్కుతోంది. గజరాజు బ్రతికేశాడని కబురు వెళ్ళింది. అంతే మరల అందరూ వచ్చేశారు. ఒక తామర పువ్వును తీసుకు వెళ్ళి శ్రీమన్నారాయణుడి పాదముల మీద పెట్టి కుంభస్థలమును వంచి నమస్కరించింది. దానిలో ఉన్న జ్యోతి బయలు దేరి శంఖచక్రగదాపద్మములతో శ్రీమన్నారాయణుని రూపమును పొంది ఆయన పక్కన వైకుంఠమునకు వెళ్ళిపోయింది. మొసలి చనిపోయినపుడు ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. ఆ గంధర్వుడు గంధర్వ లోకమునకు వెళ్ళాడు.

ఆ ఏనుగుకు అంత పుణ్యం ఎలా వచ్చిందో చెప్పమని పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడు. అపుడు శుకుడు ఇలా చెప్పాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజు గారు ద్రవిడ దేశమును పరిపాలించేవాడు. అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని ఊరికి చివరగా ఉన్న పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని అక్కడికి వచ్చి మంత్రజపం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చారు. తాను మంత్రజపం చేసుకుంటున్నాడు కదా అని రాజు లేవలేదు, పూజించలేదు. అగస్త్య మహర్షికి ఆగ్రహం వచ్చి మంత్రజలములను తీసి నీవు తమో గుణముతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోనియందు జన్మించెదవు గాక అని శపించారు. అగస్త్యునికి పూజ చేసి వుంటే ఆ జన్మలోనే మోక్షం పొంది ఉండేవాడు. మహా పురుషులయిన వారు మీ యింటికి ఏనాడు వస్తారో ఆనాడు మీపూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఈనాడు ఏనుగుగా పుట్టి గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన ఈ జన్మలో ప్రాణం పోయేటప్పుడు శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి ఒంట్లో ఓపిక వుండగా పుణ్యం చేసి నామం చెప్పుకోవడం నేర్చుకోవాలి. మొసలి లోంచి వచ్చిన గంధర్వుని పేరు ‘హూహూ’. ఆయన ఒకనాడు గంధర్వ కాంతలతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు. మద్యపానం చేసి ఉన్నాడు. పక్కన అప్సరసలు ఉన్నారు. మదోన్మత్తుడై ఉన్నాడు. అదేసమయంలో దేవల మహర్షి వచ్చి స్నానం చేస్తున్నారు. ఆయన తపస్వి. ఉరః పంజరం బయటకు వచ్చేసి బక్క చిక్కిపోయి ఉన్నాడు. అప్సరసలతో కలిసి స్నానం చేస్తున్నాను కదా – హాస్యం ఆడితే వాళ్ళు నవ్వుతారనుకుని – మహర్షిని చూసి హాస్యం ఆడాడు. వాళ్ళని బాగా సంతోష పెడదామని నీటి కిందనుండి ఈదుతూ వచ్చి దేవల మహర్షి కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన అర్ఘ్యం ఇస్తూ నీళ్ళలో పడిపోయారు. పడిపోయి లేచి అన్నారు ‘నీకు నీటి అడుగునుండి వచ్చి కాళ్ళు పట్టి లాగడం చాలా సంతోషంగా ఉన్నది కనుక, నీళ్ళ అడుగు నుంచి వచ్చి కాళ్ళు లాగే అలవాటు వున్న మొసలివై జన్మించెదవు గాక’ అని శపించారు. మహాత్ముల జోలికి వెళితే అలాంటివే వస్తాయి. కాబట్టి మొసలి అయి పుట్టాడు. ఈ జన్మలో శ్రీమన్నారాయణుని చక్రధారల చేత కంఠం తెగిపోయింది. మోక్షము రాలేదు. శాపవిమోచనం మాత్రమే అయింది. అందువలన గంధర్వుడై గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు భాగవతములో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు. ఒక్క గజేంద్రమోక్షం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ గజేంద్రమోక్షమును చెప్పి ఒడ్డున నిలబడిన శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారు –‘ఎవరయితే ఈ గజేంద్రమోక్షణమనే కథను శ్రద్ధగా వింటున్నారో, లేదా చేతులు ఒగ్గి నమస్కరిస్తూ ఈ స్వామి కథను వింటున్నారో అటువంటి వారికి దుస్స్వప్నముల వలన వచ్చే బాధలు పోతాయి. తోగములు పరిహరింపబడతాయి. దరిద్రము తొలగిపోతుంది. ఐశ్వర్యము కలిసివస్తుంది. గ్రహదోషముల వలన కలిగే పీడలు తొలగిపోతాయి. అపారమయిన సుఖము కలిగి మనశ్శాంతితో ఉంటారు. ఇంట్లో అస్తమాను మంగళ తోరణం కట్టి శుభకార్యములు చేస్తూనే ఉంటారు. అందునా విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏమయినా చేసిన పిమ్మట గజేంద్ర మోక్షమును వినడం ద్విగుణీకృతమయిన పుణ్యం. ప్రతిరోజూ ఏ కోరికా లేకుండా ఈ పద్యములను అలా చెప్పుకునే అలవాటు వున్న బ్రాహ్మణుడు ఎవడు ఉన్నాడో అటువంటి బ్రాహ్మణుడు అంత్యకాలమునందు యమదర్శనము చేయడు. అతను శ్రీమన్నారాయణుని దర్శనమును పొంది ఆయన విమానంలో వైకుంఠమును చేరుకుని మోక్షమును పొందుతాడు అని శ్రీమన్నారాయణుడే స్వయంగా ఫలశ్రుతిని చెప్పారు.



శ్రీమద్భాగవతం - 56 వ భాగం



2. క్షీరసాగర మథనం:

పంచమి ఉండగా ఉన్న శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నింటికి ఐశ్వర్యమును ఇచ్చింది. దానివలన మొట్టమొదట అనుగ్రహమును పొందినవాడు దేవేంద్రుడు. మనము ఐశ్వర్యమునకు గాని, అధికారమునకు గాని, భోగాలాలసతకు గాని, వైభోగమునకు కాని, ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాము. 

ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆయన సురాపానం చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా దుర్వాసో మహర్షి వస్తున్నారు. ఆయన మహా బ్రహ్మజ్ఞాని. శంకరాంశ సంభూతుడు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ వున్న పరివారం దేవేంద్రుడిని కుశలం అడిగి దేవేంద్రుని ఆశీర్వచనం చేశారు. దుర్వాసో మహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది.

ఆ పారిజాత పుష్పమును ఈయన కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ‘మహానుభావా, ఈ పుష్పమును స్వీకరించండి’ అని కృష్ణుడు ఇచ్చాడు. అది భగవంతునిచే స్వయంగా ఇవ్వబడినది. దీనిన్ ఈశ్వర నిర్మాల్యం అంటారు. లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది. ఇంద్రుడు సురాపానం చేసి మదోన్మత్తుడై ఉన్నాడు. ఆ పువ్వును తీసుకున్నాడు. పువ్వును తీసుకున్నప్పుడు కళ్ళకు అడ్డుకుని పక్కన పెట్టాలి. ఈశ్వర నిర్మాల్యం అయినట్లయితే తలమీద కానీ చెవిలో కానీ పెట్టుకోవచ్చు. లేదా ఎవరూ తొక్కని చోట దానిని భద్రం చేయవచ్చు. ఇంద్రుడు ఆ పువ్వును తీసుకొని ఐరావతం మీదకి విసిరాడు. ఆ ఐరావతం విశేషమయిన తేజస్సును సంతరించుకుంది. అది భగవంతుని నిర్మాల్యం. అది దాని శిరస్సు మీద పడింది. అది దానిని స్వీకరించింది. అది తేజస్సును పొంది ఇంద్రుడిని మోయడం మానివేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అపుడు దుర్వాసో మహర్షి ఇంద్రుడిని చూసి ‘నీవు ముకుంద పాదారవిందము నుండి వచ్చిన పారిజాత పుష్పమును తిరస్కరించావు. కనుక నీవు ఉత్తర క్షణం ఐశ్వర్య భ్రష్టుడవు అయ్యెదవు గాక! స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి స్వస్థానమయినటువంటి వైకుంఠములో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యం అయిపోతుంది. ఇక నీకు స్వర్గంలో ఐశ్వర్యం ఉండదు’ అన్నారు. ఈమాట వినగానే శత్రువులు వచ్చేస్తారు. ఐశ్వర్యం పోవడానికి ఒక కారణం ఉండాలి కదా! రాక్షసులు అందరూ వచ్చేశారు. చుట్టుముట్టి పడగొట్టేశారు. ఇంద్రుని ఐశ్వర్యం పోయింది. ఇపుడు ఇపుడు ఇంద్రునికి ఐశ్వర్యం పోవడానికి కారణం తెలిసింది. అపుడు దేవతలు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అపుడు బ్రహ్మగారు ‘అప్పుడప్పుడు నీవు కండకావారంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్లావు. ఇవాళ దుర్వాసో మహర్షి జోలికి వెళ్లావు. అందువలన ఐశ్వర్యం పోయింది. ఇపుడు నీకు మరల ఐశ్వర్యం ఆ పద్మనాభుడి అనుగ్రహంతోనే రావాలి. ఆయననే ధ్యానం చెయ్యాలి’ అని కన్నులు మూసుకుని ధ్యానమునందు ఉన్నవాడి ఆ పరమాత్మను ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అనగా ధ్యానమునందు ద్యోతకమైన నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు. 

ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు ‘ఇప్పుడు నీకు ఐశ్వర్యము పోయినది కదా! నీవయినా నేనయినా మరల ఐశ్వర్యము నిమ్మని శ్రీమన్నారాయణుని అడగాలి. ఆయన పాదముల మీద పువ్వును నీవు విసిరేశావు.అందుకు దుర్వాసునికి కోపం వచ్చింది. పరమాత్మకు కోపం రాదు. ఆయనా కోపం పెట్టేసుకుంటే ఇక లోకంలో ఉద్ధరించే వాడెవడు? పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు. నీవు దుర్వాసుని నన్ను అర్థించడం వల్ల పరమాత్మ సంతోషిస్తున్నాడు. తప్పు చేసిన వాడు తనకు ఎంత దగ్గర వాడయినా పరమాత్మ శిక్షిస్తాడు. ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు. శాశ్వత మిత్రుడు కాదు. మీ నడవడిని బట్టి ఆయన మిత్రత్వము కాని, శత్రుత్వము కానీ ఆవిష్కరింప బడుతుంది. ఇంద్రా! నేను కాని, దుర్వాసుడు కానీ, సమస్త దేవతలు కానీ ఎప్పుడు సంతోషిస్తామో తెలుసా? శ్రీమన్నారాయణుడికి మ్రొక్కి నమస్కరించినపుడే. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందడం కాదు. శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులం అవుతాం. ఆయనను ప్రార్థన చేద్దాం’ అన్నారు బ్రహ్మగారు.

ఆమాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వాడిని పరమాత్మ రక్షిస్తాడు అనే జ్ఞానం కలిగింది.పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే స్వామి వరం ఇచ్చేస్తాడు. దితి సంధ్యాకాలంలో తప్పు చేసింది -హిరణ్యకశిపుడు పుట్టాడు. భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు.తప్పు చెయ్యడం సహజం. పశ్చాత్తాప పడి మళ్ళీ ఆతప్పు చేయకుండా ఉండడం మంచి మనిషి లక్షణం. అపుడు ఇంద్రుడు తాను చేసింది తప్పు పనే అని, తనను మన్నించమని మనస్సులో అనుకుని స్వామిని ప్రార్థించాడు. అంతే! ఎక్కడికో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసిన వాళ్లకి దొరకని పరమాత్మ దర్శనం పశ్చాత్తాపం కలగగానే ఇంద్రునికి దొరికింది. వెంటనే పరమాత్మ ఇంద్రుని ఎదుట ప్రత్యక్షం అయిపోయాడు. అలా సగుణంగా కనపడగానే అందరూ చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఆయనను చూడడానికి ఆయన అనుగ్రహం కావాలి. అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడడానికి వీలుగా ఎదురుగుండా ఈశ్వరానుగ్రహంతోనే చూశారు. పరమాత్మ ప్రత్యక్షం అయేసరికి వీరందరి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థన చేశారు. 

శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా సంతసించాడు. ‘నీవు ఐశ్వర్యము పోయింది కదా అని విచారిస్తున్నావు. ఐశ్వర్యమేమిటి! ఈ శరీరమునకు యౌవనము పోకుండా మృత్యువు రాకుండా ప్రళయ కాలమునందు మాత్రమే మరల లీనమఎలా వార్ధక్యం రాకుండా ఐశ్వర్యం చెడకుండా అనారోగ్యం రాకుండా నిరంతరం తేజస్సుతో కనురెప్ప పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి భూమికి పాదము ఆనకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులను ఈయగాలిగిన అమృతమును మీకు ఇస్తాను’ అని అన్నారు. అదీ ఈశ్వరానుగ్రహం అంటే. ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదు. పరమాత్మను మనసులో తలచుకొని ‘నాది తప్పే మహానుభావా’ అన్నాడు. పరమాత్మ అమృతమును ఇస్తాను అంటున్నాడు. ‘మీరు అనేక ఓషధులను తీసుకురండి. గడ్డి తీసుకురండి. పువ్వులు తీసుకురండి. ఇవన్నీ పట్టుకు వెళ్ళి పాలసముద్రంలో వెయ్యండి. అపుడు మందర పర్వతమును తీసుకువచ్చి కవ్వంగా మెల్లగా పాలసముద్రంలోకి దించండి. దానికి వాసుకిని త్రాడుగా చుట్టండి. దేవతలు, దానవులు దానిని అటుఇటు పట్టుకోండి. ఇపుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీమాట వినరు. నాగుపాము కూడా ఎలుకను పట్టుకోవాలంటే కలుగులో నుంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవులను మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చేయండి. వారిని క్షీర సాగర మథనమునకు తీసుకు వచ్చి సాగరమును చిలకండి. అపుడు అందులోంచి అమృతం పుడుతుంది. మొదట హాలాహలం వస్తుంది. అగ్నిహోత్రం వస్తుంది. భయపడకండి. పూనికతో మరల చిలకండి. చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి. మనసు పారేసుకోవద్దు. నిగ్రహించుకొనండి. నేను ఇస్తే పుచ్చుకోండి. లేకపోతే ఊరుకోండి. ఎవరికీ ఏది ఇవ్వాలో నాకు తెలుసు. అది వాడికి ఇస్తాను. 

ఇపుడు దేవతలు శ్రీమన్నారాయణుని మాటలు శ్రద్ధగా విని తప్పకుండా అలా చేస్తాం అని చెప్పి వారు బయలుదేరారు. మొట్టమొదట మందర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాలి. ఇపుడు దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమకొక పెద్ద తవుకోలను తయారుచేసి ఇవ్వవలసినదని కోరారు. త్వష్టప్రజాపతి ఎందుకు? అని అడిగాడు. అపుడు దేవతలు ‘మేము మందర పర్వతమును కింద తవ్వేస్తాము. తరువాత దానిని ఊడబెరికి సముద్రం వద్దకు తీసుకువెడతాము. అలా చేయమని శ్రీమన్నారాయణుడు చెప్పాడు అని చెప్పారు. ఆయన వారు కోరిన విధంగా తవుకోలను చేసి ఇచ్చాడు. వారు దానిని తీసుకువెళ్ళి మందరపర్వతం అడుగు భాగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. ఇపుడు మందర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో దింపాలి. అందుకని డాన్ని కొన్ని తాళ్ళు వేసి దానిని ఊపుతున్నారు. అలా ఊపి మొత్తం మీద మందరపర్వతమును అందరూ కలిసి పైకి ఎత్తారు.అయితే అది పక్కకి ఒరిగిపోయి పడిపోయింది. ఈ సందర్భంలో దానికింద పడి కొందరు మరణించారు. అపుడు మిగిలిన వారందరూ ప్రక్కకు చేరి ఈ మందరపర్వతమును సముద్రము వరకు తీసుకుని వెళ్ళడానికి మనం శ్రీహరి సహాయం అడగలేదు. అడిగి ఉంటే ఆయనే వచ్చి మనకు సహాయం చేసి ఉండేవాడు. ఆయన వస్తే ఎంత బాగుండునో’ అని అనుకున్నారు. వాళ్ళు ఈమాట అనుకునేసరికి బంగారు రంగులో ఉన్న గరుడ పక్షిమీద నుంచి శ్రీమన్నారాయణుడు క్రిందకి దిగి దేవతలను ఓదార్చి మందరపర్వతమును బంతివలె నేర్పుతో చేతితో పట్టుకుని, దానిని తీసుకుని మరల గరుడ వాహనం ఎక్కి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు పాల సముద్రం ఒడ్డున దిగి గరుత్మంతుడిని వెనక్కు పంపించి వేశాడు. చిలికేతప్పుడు వాసుకి శరీరం ఒరిసి పోకుండా మందరపర్వతమును నునుపుగా చెక్కించారు. వాసుకిని తీసుకు వచ్చి పర్వతమునకు చుట్టారు. ఇప్పుడు మందర పర్వతమును పాలసముద్రం లోకి పెట్టారు. ఇప్పుడు అది మునిగి పోకూడదు. అపుడు దేవతలను పిలిచి వారిని వాసుకి తలవైపు పట్టుకొనమని రాక్షసులను పిలిచి వారిని తోకవైపు పట్టుకొనమని చెప్పాడు. వెంటనే దేవతలు అందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు. అపుడు రాక్షసులు ‘మేము తోక పట్టుకోవడం ఏమిటి? మేము తలవైపు పట్టుకుంటాము’ అన్నారు. అందుకు స్వామి వెంటనే ఒప్పుకుని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకొనమని చెప్పారు. దేవతలు మారు మాట్లాడకుండా వాసుకి తోకవైపు వెళ్ళి తోకను పట్టుకున్నారు. స్వామి మాటల పట్ల దేవతలకి గల విశ్వాసం వారిని అమృతం తాగేతట్లు చేస్తుంది.



శ్రీమద్భాగవతం - 57 వ భాగం



పామును మందరపర్వతమునకు చుట్టారు. అందరూ కలిసి తిప్పాలి. అది క్రిందకు జారిపోకూడదు. దేవదానవులిరువురూ చిలకడం ప్రారంభించారు. గిరగిరమని పర్వతం తిరిగింది. భుగభుగభుగమని పాలసముద్రం లేచింది. నురగలు లేచాయి. కెరటములు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమయిన ధ్వని చేస్తోంది. దానికి తోడు వీళ్ళ అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వారు మందరపర్వతమును గిరగిర తిప్పెస్తున్నారు. అపుడు వాసుకి ‘మీరు సరిగ్గా చిలకడం లేదు వదలండి’ అని కేకలు వేశాడు. వాళ్ళందరూ వాసుకిని వదిలేశారు. పట్టు తప్పిపోయి మందర పర్వతం జారి క్రిందపడిపోయింది. ఇపుడు అందరూ శ్రీమన్నారాయణుని వైపు చూశారు. ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారమును స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పయిన పెద్ద డిప్ప. ఆ దిప్పతో పాలసముద్రం అడుగుకి వెళ్ళి ఇంతమంది కదల్చలేని మందరపర్వతమును తన వీపుమీద పెట్టుకున్నాడు. ముందు వచ్చి తుండమును అటూ ఇటూ ఆడిస్తున్నాడు. తన నాలుగు కాళ్ళను కదల్చకుండా తానె ఆధారమయి, మందరపర్వతమును వీపుపై ధరించి ఉన్నాడు. ఆ కూర్మము నిజంగా ఆహారమును తినినట్లయితే ఈ బ్రహ్మాండములనన్నిటిని జీర్ణము చేసుకొనగలదు. అటువంటి వాడై ఆది కూర్మమై పాలసముద్రం క్రింద పడుకున్నాడు. ఇపుడు మందరపర్వతమును ఆదికూర్మం భరిస్తోంది. మరల మందరపర్వతమును వాసుకిని చుట్టి రాక్షసులు తలవైపు దేవతలు తోకవైపు ఉంది, మరల చిలకడం ప్రారంభించారు. భూమి అదిరిపోతోంది. సముద్రంలోంచి కెరటములు పైకి లేస్తున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఆకాశంలో నిలబడిపోయి ఆ దృశ్యమును చూస్తున్నారు.

ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారు భావ సమాధిలో ఉన్నారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. సత్యలోకంలోంచి బయటకు వచ్చి ఏమిటి ఈ చప్పుడు? అన్నారు. అక్కడి వాళ్ళు స్వామీ, పాలసముద్రమును చిలుకుతున్నారు. అందులో నారాయణుడు కూడా ఉన్నాడు అన్నారు. బ్రహ్మగారు కూడా పైనుంచి క్రిందకు చూస్తున్నారు. ముందు అమృతం రాలేదు. హాలాహలం ముందు పుట్టుకు వచ్చింది. అది ఒక్కసారి పాలసముద్రం మీద నుండి పైకి లేచింది. ప్రళయకాలంలో వుండే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంది. అది వెంట తరుముతుంటే దేవతలు రాక్షసులు అందరూ వాసుకిని వదిలిపెట్టి పరుగు మొదలు పెట్టారు. అన్ని లోకములలో అగ్నిహోత్రం ప్రబలి పోతున్నది. పరుగెత్తి పరుగెత్తి కైలాసపర్వతం మీద వున్న పరమశివుని అంతఃపురము దగ్గరకు వెళ్ళి అక్కడి ద్వారపాలకులు అడ్డు పెట్టగా వారిని పక్కకు తోసివేసి లోపలి ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడే నిలబడి రక్షించు అని అరుస్తున్నారు. స్వామి పరమశివుడు వీరి అరుపులు విని స్వామి ఏదో ఆపద సంభవించి ఉండవచ్చునని బయటకు వచ్చారు. వారు శంకరునితో ‘ఈశ్వరా! నీవు ఈ విశ్వమంతా నిండి నిబిడీ కృతమయిన వాడివి. నీవు తండ్రివి. మేము చెయ్యకూడని పని ఒకటి చేశాము. ఇంట్లో ఏదయినా శుభకార్యం చేతున్నప్పుడు మనకొక సంప్రదాయం ఉన్నది. ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి వారికి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. కానీ దేవదానవులు ఆ పని చేయలేదు. స్వామికి నమస్కరించలేదు. అందుకని స్వామి వీళ్ళకి పాఠం నేర్పాలి అనుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ‘మేము మందరపర్వతం పెట్టి సముద్రమును చిలికితే హాలాహలం జనించింది. లోకములను కాల్చేస్తోంది. దయచేసి దానిని నీవు స్వీకరించవలసినది’ అన్నారు.

మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు 
భేదమగుచు దుది నభేదమై యోప్పారు బ్రహ్మమవగ నీవ ఫాలనయన!!

నీవు భూతభవిష్యద్వర్తమానరూపములలో ఉంటావు. నీవే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు. నీవే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమయిన మూలపురుషుడవు కనుక ఈశ్వరా, ఈ హాలాహలమును నీవు పుచ్చేసుకో’ అన్నారు. వారి కోరికను విన్న పరమశివుడు వెంటనే పార్వతీ దేవి వద్దకు వెళ్ళాడు. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది. శంకరుడు ఆమెవంక చూసి
‘కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై 
యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము; గాదె గీర్తి మృగాక్షీ!!

ఈ ఘట్టము వినిన వాళ్లకి కొన్ని కోట్ల జన్మల వరకు అయిదవతనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళ సూత్రం గురించి వస్తుంది. ‘చూశావా పార్వతీ, నీళ్ళలోంచి వేడి పుట్టింది. పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ప్రభువు అన్నవాడు బిడ్డలకు కష్టం వస్తే ఆదుకోవాలి. అందుకని వాళ్ళను రక్షించాలని అనుకుంటున్నాను’ అన్నాడు. ఆవిడ సమస్త బ్రహ్మాండములకు అల్లి. మాతృత్వము ఒక్కొక్కసారి భర్తృత్వమును కూడా తోసేస్తుంది. అది తల్లితనానికి ఉన్న గొప్పతనం. అందుకని మాతృత్వమును ఆమెలోంచి ఉద్భుదం చేస్తున్నాడు శంకరుడు. ‘మీ అన్నయ్య స్థితికారుడు. లోకముల నన్నిటిని నిలబెట్టాలి. ఇపుడు లోకములకు ఇబ్బంది వచ్చింది. మరి నేను ఆయనను సంతోష పెట్టాలి కదా! అందుకని నేను హాలాహలమును త్రాగేస్తాను. 

శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ 
రక్షింతు ప్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ!!

నేను ఈ హాలాహలమును చిన్న ద్రాక్షపండును తినేసినట్లు తినేస్తాను. దానివలన నాకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ఈ ప్రాణికోట్లనన్నిటిని రక్షిస్తాను. అది నా దివ్యమయిన లీల. నాకేమయినా అవుతుందని నీవేమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదు. నేనెలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు’ అన్నాడు. అపుడు పార్వతీ దేవి ‘సరే, మీకు ఎలా ఇష్టమయితే అలా చేయండి’ అంది. 
మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో!!

ఆవిడకు శంకరుడు త్రాగబోయేది విషం అని తెలుసు. విషం త్రాగితే ప్రమాదమనీ తెలుసు. త్రాగుతున్న వాడు తన భర్త అనీ తెలుసు. అయినా త్రాగమంది. ఆవిడ సర్వమంగళ. అందుకని తాగెయ్యమంది. శంకరుని జీవనమునకు హేతువు పార్వతీదేవి మెడలోని మంగళ సూత్రమని పోతనగారు తీర్పు ఇచ్చారు. దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే హాలాహలమునకు ఎదురువెళ్ళి దానిని చేతితో పట్టుకుని ఉండచేసి నేరేడు పండంతచేసి గభాలున నోట్లో పడేసుకుని మింగేశాడు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మ్రింగినప్పుడు కానీ వేడిచేసి ఆయన ఒంటిమీద ఒక్క పొక్కు పుట్టలేదు. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. ఆయన చల్లని చూపులతో అలానే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్న వాడు హాలాహలం లాంటి కష్టము వచ్చినా కూడా అలా చల్లగా ఉంటాడు. అటువంటి వానికి బెంగ ఉండదు. ఆయన నోట్లో పెట్టుకుని మ్రింగుదామనుకున్నాడు. కంఠం వరకు వెళ్ళింది.

ఉదరము లోకంబులకును సదనంబాగు టెరిగి శివుడు చటుల విషాగ్నిం 
గుదురుకొన గంఠబిలమున బదిలంబుగ నిలిపె సూక్ష్మ ఫలరసము క్రియన్!!

మింగేస్తే అడుగున అధోలోకములు ఉన్నాయి. కాలిపోతాయని మింగలేదు. పైన ఊర్ధ్వలోకములు ఉన్నాయి. కక్కితే ఊర్ధ్వలోకములు పోతాయి. పైకీ వదలలేదు, క్రిందకీ వదలలేదు. కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన అలా చేసేసరికి పార్వతీ దేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటినుండి ఆయనకు నీలలోహితుడు, నీలగ్రీవుడు అని పేరు వచ్చింది. ఆయనకు నీలకంఠుడు అని పేరు. ‘నీలకంఠా అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. హాలాహాల భక్షణం కథ వీనిన వాళ్లకి మూడు ప్రమాదములు జరుగవు. ఈ కథ వినిన వాళ్ళని పాము కరవదు. హాలాహలభక్షణం కథను నమ్మిన వాళ్ళని తేలు కుట్టదు. అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదములు రావు. అంతంత శక్తులు ఇటువంటి లీలలయందు ఉన్నాయి. వాటిని క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్పారు. 

మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం దగ్గరకి వెళ్ళిపోయారు.క్షీరసాగరమథనం మొదలుపెట్టారు. అలా మథిస్తుంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. ఆ కామదేనువుకి అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవమునులకు లౌకికమయిన కోరికలు ఉండవు. వారు కామధేనువు పాలతో హవిస్సులను అర్చిస్తాము అని అన్నారు. లోక కళ్యాణార్థం హవిస్సులను ఇస్తారు. ఆ గోవును స్వామి దేవమునులకు ఇచ్చి మీరు దీని పాలతో దేవతలకు హవిస్సులను అర్పించాలి. అపుడు దేవతలు సంతోషించి వర్షములు కురిపిస్తారు. అందరూ బాగుంటారు. అందరికీ పనికి వచ్చేవాడికి కామధేనువు ఉండాలి. అందుకని కామధేనువు దేవమునులకు ఇవ్వబడింది. వారు దానిని పుచ్చుకున్నారు.




శ్రీమద్భాగవతం - 58 వ భాగం



మళ్ళీ పాలసముద్రమును చిలకడం మొదలుపెట్టారు. ఇపుడు అందులోంచి ఒక తెల్లటి గుఱ్ఱము ఒకటి బయటకు వచ్చింది. దానిని ఉచ్చైశ్రవము అంటారు. ఈ గుఱ్ఱమును చూడగానే ఇంద్రునికి కించిత్ మమకారం పుట్టింది. కానీ శ్రీమన్నారాయణుని సూచన మేరకు ఏమీ మాట్లాడలేదు. ఆ అశ్వమును బలిచక్రవర్తి తనకిమ్మనమని అడిగాడు. ఆ తరువాత మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. ఇపుడు పాల సముద్రంలోంచి బ్రహ్మాండమయిన కల్పవృక్షం ఒకటి వచ్చింది. ఆ కల్పవృక్షమునకు పువ్వులు పూసి ఉన్నాయి. ఆ పువ్వులు ఎవరు పెట్టుకుంటారో వారికి అయిదవతనం తరగదు. దానిమీద నుండి వచ్చే గాలి ఎవరు పీలుస్తారో వారి ఆరోగ్యం పాడవదు. ఎవరు కల్పవృక్షం దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారో వారికి ఫలముల రూపంలో కోర్కెలు తీర్చేస్తుంది. ఈ కల్ప వృక్షమును ముందు ఇంద్రునికి ఇచ్చారు. ఆయన దానిని తీసుకున్నాడు. తరువాత అప్సరసలు పుట్టారు. ఆ అప్సరసలు దేవకాంతలై, దేవ నర్తకీ మణులై ఉండిపోయారు. తరువాత పాల సముద్రమును ఇంకా చిలకడం మొదలు పెట్టారు. ఇప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భావం జరుగబోతోంది. ఆమె శుక్రవారం పంచమి నాడు పుట్టింది. 

పచ్చటి కాంతితో, తెల్లటి వస్త్రములు కట్టుకుని ‘పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే’ అని నల్లని కన్నులతో సొగసయిన చూపులతో మాతృ వాత్సల్యంతో అందరివంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారు చూపులు ఎంతవరకు పడ్డాయో అంతవరకూ దరిద్రములు అన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందమును పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భావ ఘట్టం ఎవరు విన్నారో వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంటబడిన దరిద్రం నశితుంది. ఇది పరమయధార్థం. పుడుతూనే ఆ తల్లి యౌవనంలో పుట్టింది. ఇంద్రుడు వెంటనే కలశ స్థాపనం చేసి అమ్మవారిని దర్శనం చేసి చెప్పిన స్తోత్రం వ్యాసభాగవతంలో లేదు. కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒకమాట చెపుతారు. ఈ స్తోత్రమును చెయ్యడానికి కొన్ని రోజులు నియమం ఉంది. అలా ఈ స్తోత్రమును తెలిసికానీ, తెలియక కానీ చేస్తే ఆ వ్యక్తి భూమండలమును శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారు తెల్లని చీర కట్టుకుంది. పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉంది. నల్లని జుట్టు కలిగి ఉంది. కబరీ బంధం చుట్టూ చక్కటి మల్లెపువ్వులు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు, అలంకరించుకుని వుంది. మెడనిండా హారములు వేసుకుని ఉంది. వరదముద్రపత్తి చేతితో ఐశ్వర్యమును కురిపిస్తూ మీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తోంది. రెండు పాదములను కలిపి పద్మాసనం వేసుకుని ఉంది.

నమః కమల వాసిన్యై నారాయణ్యై నమోనమః
కృష్ణ ప్రియాయై సతత౦ మహాలక్ష్మ్యై నమోనమః!!
పద్మ పత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః!!
సర్వస౦పత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః
హరిభక్తి ప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై చ నమోనమః
కృష్ణ వక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః
చ౦ద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనే!!
స౦పత్త్యధిష్ఠాతృ దేవ్యై మహాదేవ్యై నమోనమః
నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమోనమః!!
యథామాతా స్తనా౦ధానా౦ శిశూనా౦ శైశవే సదా
తథా త్వ౦ సర్వదా మాతా సర్వేషా౦ సర్వరూపతః!! 

(శ్రీదేవీ భాగవతం – 9వ స్కంధము)

పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా విన్న బిడ్డడిని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మపాలు తప్ప వేరొకటి లేదు. ఈలోకము నందు మనము సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కులేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే. ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు. తృప్తి ఉండాలి. అమ్మా! ఆనాడు బిడ్డడయినందుకు అమ్మ పాలిచ్చి బ్రతికించినట్లు సమస్త లోకములకు తల్లివయిన నీవు కూడా దయతో మాకు ఐశ్వర్యమును యిచ్చి కాపాడు’ అని ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు. అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది. 

అమ్మవారు ఆవిర్భవించడం ఒక ఎత్తు. ఆమె అయ్యవారిని చేరడం ఒక ఎత్తు. శక్తి అనేది కంటికి కనపడదు. అనుభవైకవేద్యము. పరమాత్మ శక్తితో కూడినవాడై అనుగ్రహిస్తాడు. ప్రక్కన లక్ష్మి చేరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడికి ఐశ్వర్యమును అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడకు భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో అక్కడి వాడు తండ్రి అవుతాడు. కాబట్టి ఇపుడు పాలసముద్రుడే తండ్రి. అందుకనే మనం ప్రతిరోజూ “లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం” అని పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఇపుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అన్నీ సమకూరుస్తున్నారు. ఆ తల్లి మంగళ స్నానం చేయడం కోసమని ఒక పీట మీద కూర్చోవాలి. అందుకని దేవేంద్రుడు ఒక మణిమాయ పీఠమును తెచ్చి అక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ పీఠం ఇచ్చిన వాడికి పీఠం దక్కుతోంది. లక్ష్మీదేవికి మీరు ఏమి ఇస్తే అది మీకు దక్కుతుంది. అమ్మవారు మంగళ స్నానం చేయడానికి దానిమీద కూర్చుంది. ఇపుడు అమ్మవారు స్నానం చేయడానికి నీళ్ళు తీసుకు రావాలి. పసుపు కుంకుమలకి లోటు లేకుండా చాలాకాలం నుండి పసుపు కుంకుమలతో ఉన్న యువతులు నీరు తీసుకువచ్చి అక్కడ పెట్టారు. ఆ నీటిలో కొద్దిగా పసుపు కలపాలి. తరువాత దానిలోకి పల్లవములు వెయ్యాలి. పల్లవములు వేయడం చేత జలములు మంగళ స్నానములకు యోగ్యములు అవుతాయి. అటువంటి పల్లవములను భూదేవి తెచ్చి యిచ్చింది. గోవులు వచ్చి పంచద్రవ్యములను ఇచ్చాయి. వసంతుడు తేనెను తెచ్చి ఇచ్చాడు. మంగళ స్నానం చేయించే ముందు వధువుకి కొద్దిగా తేనె ఇవ్వాలి. లోపల మంగళ స్నాన క్రియ జరుగుతుంటే బయట వచ్చిన బ్రాహ్మణులు కూర్చుని చక్కటి స్వస్తి మంత్రములు చెప్తూ ఉంటారు. అక్కడ స్వస్తి మంత్రములు చదువుతుండగా ఇక్కడ మంగళ స్నానం జరగాలి. ఇక్కడ మహర్షులు వేదం మంత్రములను చదువుతున్నారు. ఇప్పుడు మంగళ ధ్వనులు జరగాలి. లక్ష్మీ దేవి మంగళ స్నానానికి మేఘములు మంగళ ధ్వనులు చేశాయి. మేఘములే వేణువులను ఊదాయి. పరమ సంతోషంతో గంధర్వసతులు అందరూ అక్కడ లక్ష్మీదేవికి మంగళ స్నానములు జరుగుతున్నాయని నాట్యం చేస్తున్నారు. 

అమ్మవారు స్నానం చేసిన తరువాత ఆరోజున అమ్మవారు కట్టుకోవలసిన పట్టు చీరను తండ్రి సముద్రుడు నిర్ణయం చేసి వస్త్రద్వయమును ఇచ్చాడు. వస్త్రద్వయం అనగా చీరతో బాటు ఒక రవికల గుడ్డ లేక మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలిలేదా ఒక వస్త్రం మీద కనీసం ఒక దూదిపోగు పెట్టి ఇవ్వాలి. ఇంటి యజమానికి సన్నిహితుడయిన స్నేహితుడు ఉంటాడు. ఆయనన్ ‘సుహృత్’ అంటారు. ఆయన బిడ్డను తన బిడ్డగా భావిస్తాడు. ఇక్కడ సముద్రుడు తండ్రి అయితే సముద్రములో వున్న వరుణుడే సుహృత్. అటువంటి సుహృత్ అమ్మవారు వేసుకుందుకు వైజయంతీ మాలను ఇచ్చాడు. అమ్మవారు వేసుకోవడానికి కావలసిన గాజులు హారములు నగలు వీటినన్నిటిని ఒక దంతపు పెట్టెలో పెట్టి విశ్వకర్మ తెచ్చి అమ్మవారికి ఇచ్చాడు. సరస్వతీ దేవి ఒక మంచి తారహారమును ఇచ్చింది. బ్రహ్మగారు ఒక తామరపువ్వును ఇచ్చాడు. నాగరాజులు అమ్మవారు చెవులకు పెట్టుకునే కుండలములు ఇచ్చారు. శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీఃపూర్వకమయిన భద్రతను చేకూర్చగలిగిన మంత్రమును ఆమ్నాయం చేసింది. దిక్కులను స్త్రీలతో పోలుస్తారు. దిశాకాంతలందరూ ‘అమ్మా! లక్ష్మీ నీవు ఎల్ల లోకములకు ఏలిక రాణివై పరిపాలించెదవు గాక! అని ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు ఆ తల్లికి తనంత తానుగా వరుడిని ఎంచుకోగలిగిన పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు. ఆమె చేతికొక చెంగల్వ పూదండ ఇచ్చాడు. ఇపుడు దండ పట్టుకుని ఎవరి మేడలో వేయాలి అని బయలుదేరుతోంది. లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పద్యములు వింటే కన్నెపిల్లలకు అటువంటి భర్తలు వస్తారు అంటారు. ఆవిడ జగత్తునకంతటికీ తల్లి. నారాయణుడి వంక చూసింది. ఇలాంటి వాడు నాకు భర్త కావాలి అనుకుంది. తామర పువ్వుల వంటి కన్నులు ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమీ తెలియని వానిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అమ్మవారు గబగబా సింహాసనం దిగి నడిచి వచ్చి ఆ వరమాలను ఆయన మెడలో వేసింది. ఆ సమయంలో అమ్మవారు అందరినీ చూసింది కానీ రాక్షసుల వైపు చూడలేదు. అంతే వారు దరిద్రులయిపోయారు. వాళ్లకి అమృతం పోయింది. ఇప్పుడు సముద్రుడు మామగారు అయ్యాడు. అమ్మాయి అయ్యవారి దగ్గరకు చేరితే తాను మామగారు అవుతాడు. మామగారు తన కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. కొడుకుకి ఎంత అమూల్యమయిన వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకు అంటే ఆయన ఇపుడు పితృపంచకంలోకి వెళ్ళాడు. మామగారు అవగానే సముద్రుడు తనలో వున్న కౌస్తుభమును తీసుకువచ్చి శ్రీమన్నారాయణునికి బహూకరించాడు. శ్రీమన్నారాయణుడు ఆ కౌస్తుభమును తన మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సము అనే పుట్టుమచ్చ మెరుస్తోంది.




శ్రీమద్భాగవతం - 59 వ భాగం



లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివలన వారికి కీడు ప్రారంభం అయిపొయింది. లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు. కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు. అమ్మవారి అనుగ్రహమును పొంది ఇంద్రుడు తరించాడు. ఇపుడు ఇంద్రునికి రాజ్యం రాబోతోంది. రాక్షసులకు రాజ్యం చేజారి పోబోతోంది. ఐశ్వర్యం పోయేముందు దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ పరమప్రసన్నంగా మాట్లాడుకోవాలి. తదనంతరము దేవతలు రాక్షసులు కలిసి ఆ మందరపర్వతమును పాలసముద్రము నందుంచి మళ్ళీ చిలకడం ప్రారంభించారు. వారికి అమృతం లభించాలి. అమృతం లభించే వరకు క్షీర సాగర మథనం నడుస్తూ ఉండాలి. చాలాసేపు చిలికిన తరువాత అందులోంచి శ్రీమహావిష్ణువు అంశ కలిగిన వాడు, పచ్చని పట్టు వస్త్రమును ధరించిన వాడు, కంబుకంఠుడు, శంఖచక్రగదా పద్మములను ధరించి ఉన్నవాడు అయిన మహాపురుషుడు క్షీరసాగర మథనం జరుగుతుండగా ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించాడు. ఆయనను ధన్వంతరి అని పిలుస్తారు. ఆయన వైద్యశాస్త్రమున కంతటికీ అధిదేవత. ధన్వంతరి అనుగ్రహం కలగడం చేత శరీరములో ఉండే రోగమును గుర్తించి ఆ రోగము నివారణ కావడానికి కావలసిన మందును వైద్యులు నిర్ణయించి ఔశాధమును ఇస్తారు. ఆ ఔషధము నందు ధన్వంతరి అనుగ్రహము ప్రకాశించడం చేత మనకు లోపల ఉన్న శారీరకమయిన రోగం నశిస్తుంది. ఆయన యాగమునందు హవిస్సును అనుభవిస్తాడు. ఆయన చేతిలో అమృత పాత్ర ఉన్నది.ధన్వంతరి స్వరూపము శ్రీమహావిష్ణువు స్వరూపమే.

ఇప్పటి వరకూ దేవతలు రాక్షసులు క్రమశిక్షణతో చిలుకుతున్నారు. వాళ్ళు దేనికోసం అయితే చిలుకుతున్నారో అటువంటి అమృతపాత్ర వారి ఎదురుగుండా కనపడింది. దేవతలతో కలిసి క్షీర సాగరమును మధించారు కాబట్టి అందులో దేవతలకు కూడా భాగం ఇవ్వవలసి ఉంటుందనే విషయమును రాక్షసులు మరచిపోయారు. ధన్వంతరి చేతిలో ఉన్న అమృత పాత్రను లాక్కుని ఎవరి మటుకు వారు ముందుగా అమృతం తాగేద్దామని ఆ పాత్ర పట్టుకుని సముద్రపుటొడ్డున పరుగులు తీస్తున్నారు. వారిలో వారు బలము కలిగిన వారు ఆ పాత్ర పట్టుకుని పరుగెడుతుండగా వారియందు అమంగళకరమైన కలహం అతిశయించింది. ఐశ్వర్య భ్రష్ట్త్వమునకు ప్రధాన కారణం కలహం ఏర్పడడం. రాక్షసులు అమృత పాత్రను పట్టుకు పారిపోతుంటే దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. అపుడు పరమాత్మ మోహినీ రూపమును స్వీకరించాడు. ఇపుడు మోహినిని చూసేసరికి రాక్షసులకు స్పృహ తప్పిపోయింది. అమృత పాత్రమీద కోరిక తగ్గింది. తుచ్ఛ కామమునకు జారిపోయారు. ఇపుడు వారి కోరిక ఒకటే ‘మనం ఎవరు ఈమెతో బాగా మాట్లాడి ఈమెను వశం చేసుకోగలం’. ఇక్కడ శ్రీమహావిష్ణువు కేవల శరీర రూపం చేత రాక్షసులను మోహ పెట్టాడు. వాక్కు చేత సత్యమును చెప్తున్నాడు. ‘మీరు ఏదో పాత్ర పట్టుకు వచ్చి అందులో ఉన్నదానిని పంచమని నన్ను అడుగుతున్నారు. కానీ మిమ్మల్ని చూస్తె నాకు ఒకమాట చెప్పాలని అనిపిస్తోంది. మీకు అర్థం అయితే బాగుపడతారు. చెప్తున్నాను వినండి’ అన్నాడు.

‘తన ధర్మపత్ని యందు అనురాగం ఉండడం ఎప్పుడూ దోషం కాదు. కానీ కనపడిన ప్రతి స్త్రీయందు అర్థములేని ఒక భావన పెంచుకోవడం చాలా ప్రమాదకరం. మీరింతమంది నన్ను ఇలా చూస్తున్నా మీతో మాట్లాడాలని తలంపు కానీ కలిగిందంటే అది మిమ్మల్ని కాల్చే కార్చిచ్చు అవవచ్చు. గుర్తుపెట్టుకోండి. నా తప్పేమీ లేదు’ అని అన్నది. మోహిని మాటలు వాళ్ళ తలకెక్కవు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు కామమునకు వశులై బలహీనమయిన మనస్సు కలవారై మోసపోవడానికి సిద్ధపడ్డారు. ‘మీరు నన్ను పెద్ద చేసి నా చేతిలో అమృత పాత్ర పెట్టేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు అని కూడా నన్ను అడగలేదు. ఇపుడు నేను ఈ పాత్రనుపట్టుకుని అంతర్ధానం అయిపోతే మీ బ్రతుకులు ఏమయిపోతాయి? మీరు ఎంతో కష్టపడ్డారు’ అంది.

రాక్షసులు నిజంగా ఈమె మాటలలోని యధార్థమును గ్రహించిన వారయితే ‘తల్లీ! మేము ఈ పని చేసి ఉండకుండా ఉండవలసింది’ అని కాళ్ళమీద పడి వెంటనే వాళ్ళ మనసు మార్చుకున్నట్లయితే క్షీరసాగర మథన కథ వేరొకలా ఉంటుంది. చాలామంది క్షీరసాగర మథనంలో శ్రీమన్నారాయణుడు మోసం చేసి రాక్షసులకు అమృతమును పంచి ఇవ్వలేదు అంటారు. అది నిజం కాదు. మోహిని మాటలు వినిన తరువాత కూడా రాక్షసులు ‘అమృతమును నీవే మాకు పంచాలి’ అన్నారు. వారి మాటలు విని మోహిని వారినుంచి అమృత పాత్రను తీసుకుంది. ‘చక్కగా స్నానం చేసి ఆచమనం చేసి రండి. రాక్షసులంతా ఒకవైపు దేవతలంతా ఒకవైపు కూర్చోండి. అమృతమును పోసేస్తాను’ అంది. అలాగే కూర్చున్నారు. ఆమె దేవతలకు అమృతం పోస్తుంటే ఆమె శరీర పృష్ఠ భాగం రాక్షసులకు కనపడుతుంది. వాళ్ళు దానికి తృప్తి పడిపోయేవారు. వీళ్ళల్లో ఎవరికీ అమృతం మీద దృష్టిలేదు. ఆవిడ అంగాంగములమీదే దృష్టి ఉంది. అదే వారి పతనమునకు కారణం. వాళ్ళు అమృతమును పోగొట్టుకుంటున్నారు. తమ మరణమును వారే కొని తెచ్చుకుంటున్నారు. రాక్షసులకు ఉన్న కామ బలహీనత చేత మొత్తము జాతిని గెలిచింది. అప్పటికీ ఇప్పటికీ అంతే. కామమునకు లొంగిపోయే బలహీనతను పెంచేసుకుంటున్నాము. కనుక లోకమంతా కామమునకు నశించిపోతోంది. మోహిని దేవతలవైపు పవిత్రంగా కనపడుతుంది. రాక్షసుల వైపు మొహజనకంగా కనపడుతోంది. దీనిని రాహువు అనే రాక్షసుడు గమనించాడు. మోహిని తమను మోసం చేస్తున్నదని గ్రహించాడు. ఆయన వెళ్ళి దేవతలవైపు కూర్చున్నాడు. కానీ ప్రవృత్తి చేత రాక్షసుడు. ఆవిడ రాహువు దగ్గరకు వచ్చింది. రాహువు సూర్యచంద్రుల ప్రక్కన కూర్చున్నాడు. వాళ్ళిద్దరికీ అమృతం పోస్తున్నప్పుడు వాళ్ళు రాహువును సూచిస్తూ ‘ వాడు రాక్షసుడు. వాడికి అమృతం పోయవద్దు’ అని సైగచేశారు. శ్రీమన్నారాయణుడు దీనిని కనిపెట్టాడు. రాహువు రాక్షసుడయినా మోహినీ రూపంలోని శ్రీమహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తినుంచి లేవమని అనలేదు. ఇపుడు రాహువును అమృతమును త్రాగాడు. అతడు త్రాగిన అమృతము క్రిందికి దిగిందంటే రాక్షస శరీరము అమృతత్వమును పొందేస్తుంది. అతనికి రాక్షస ప్రవ్రుత్తి. వెంటనే సుదర్శనమును ప్రయోగించి కుత్తుక కోసేశాడు. పరమాత్మ ఏక కాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు. అమృతంతో కూడినందు వల్ల తల నిర్జీవం కాలేదు. మొండెం మాత్రం క్రిందపడిపోయింది. పంక్తియందు కూర్చున్న వాడికి అమృతం పోయడం ధర్మం. రాక్షసుడు బ్రతికి వుంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం. శిరస్సు అమృతం త్రాగిందని బ్రహ్మగారు నవగ్రహములలో ఒక గ్రహ స్థానమును ఇచ్చి రాహువును అంతరిక్షమునందు నిక్షేపించారు. ఆనాడు కనుసైగ చేసినందుకు గాను రాహువు సూర్య చంద్రులను ఇప్పటికీ గ్రహణ రూపంలో పట్టుకుంటూ ఉంటాడు. 

తదనంతరము మోహిని వరుసగా దేవతలకు అమృతం పోసేసి రాక్షసుల వైపు తిరిగి అమృతం అయిపోయినట్లుగా కుండ తిప్పి చూపించింది. అపుడు రాక్షసులు దేవతలతో యుద్ధం మొదలు పెట్టారు. మోహినీ స్వరూపం అంతర్ధానం అయిపోయింది. ఈవిధంగా దేవతలు అమృతం పొందారు. చాలా రోజులు యుద్ధం జరిగింది. అందులో ‘నముచి’ అని ఒకడు బయల్దేరాడు. వాడు దేవేంద్రునితో బ్రహ్మాండమయిన యుద్ధం చేశాడు. దేవేంద్రుడు వాని పరాక్రమం చూసి ఆశ్చర్యపోయి ‘వీడు ఎలా చనిపోతాడు?’ అని అడిగాడు. అపుడు ‘వాడు తడిలేని పొడిలేని వస్తువుతో మాత్రమే తాను చనిపోయేలా వరం అడిగాడు. అందుకని వారిని తడి పొడి లేని వస్తువుతో కొట్టు’ అన్నారు. అపుడు ఇంద్రుడు తన వజ్రాయుధమును సముద్రపు నురుగులోకి తీసుకు వెళ్ళి అటూ ఇటూ తిప్పాడు. నురుగు తడి పదార్ధం కాదు. పొడి పదార్ధం కాదు. అలా ప్రయోగించేసరికి నముచి చచ్చిపోయాడు. దీనిని ఒక కథగా కాకుండా అంతకు మించి ఇందులో తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కష్టం వచ్చినపుడు దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుని ప్రార్థన చేయడం అనేది ఈ జాతి సొత్తు. క్షీరసాగరము అనేది ఒక పాలకుండ. అది మన హృదయమందే ఉన్నది. ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. పాలకుండ నీవై ఉంటే నీకు అశాంతి ఎందుకు ఉన్నది? అనగా పాలకుండను విడిచిపెట్టి నీవు లోకము చుట్టూ తిరుగుతున్నావు. ఏది శాంతిని ఇస్తుందో దానిని పట్టుకుంటే శాంతిని ఇస్తుంది. నీ మనస్సు శాంతిగా ఉండాలంటే శాంతికరమైన పదార్ధమును నీవు పట్టుకోవాలి. అది మనలోనే ఉన్నది. మనలో ఉన్నది పట్టుకోవడం బయట తిరగడం వలన సాధ్యం కాదు. బయటకు వెళ్ళడం కాదు. లోపలికి వెళ్ళాలి. మనకెప్పుడూ బయటకు వెళ్ళడమే తెలుసు కానీ లోపలికి వెళ్ళడం తెలియదు. అదీ గొడవ. లోపలికి వెళ్ళడానికి అసలు ప్రయత్నం చేయలేదు. అలా ప్రయత్నం చేయడమే క్షీరసాగర మథనం. పాలసముద్రంలో మందరపర్వతమును దింపడం అంటే ధ్యానంలో మన మనస్సును తీసుకు వెళ్ళి స్వామి దగ్గర పెట్టడం అన్నమాట. ధ్యానమునందు నిష్ఠ కుదరడానికి చాలా ప్రయత్నం చేయాలి. లేకపోతే మనస్సు మందరపర్వతం ఊగినట్లే ఊగుతుంది. అప్పుడు కంగారుపడిపోకూడదు. మళ్ళీ దానిని వెనకకి తీసుకురావాలి. స్వామీ! నా ధ్యానము బాగా కుదిరేటట్లు చూడు అని స్వామిని ప్రార్థన చేయాలి. మందరం తొట్రు పడితే భగవంతుడినే ప్రార్థించారు. అపుడు ఆయన ఆదికూర్మమయ్యాడు. ఆయనే ఆధారం అయాడు. అలాగే ధ్యానంలో చెదిరిన నీ మనస్సును కుదర్చడానికి స్వామి ఏదో రూపంలో సహాయం చేస్తాడు. ఇదే మందర పర్వతమును దింపి క్షీర సాగర మథనం చేయడం. అలా ధ్యానం చేయగా చేయగా ముందు ప్రశాంతత కలుగుతుంది.



శ్రీమద్భాగవతం - 60 వ భాగం



వామనావతారం :
అమృతోత్పాదనం అయిన తరువాత ఆ అమృతమును సేవించిన దేవతలు వార్ధక్యమును మరణమును పోగొట్టుకున్న వారి, మళ్ళీ పోగొట్టుకొనిన సామ్రాజ్యమును చేజిక్కించుకొని అత్యంత వైభవముతో జీవితమును గడుపుతున్నారు. ఇపుడు ఒక గొప్ప ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అమృతం త్రాగిన తరువాత ఒకవేళ అది అహంకారమునకు కారణం అయితే పరిస్థితి ఏమిటి? ఈ అనుమానములను తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనములు జరుగుతాయి. రాక్షసులకు నాయకత్వం వహించిన బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయినందుకు బెంగ పెట్టుకోలేదు. తన గురువయిన శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి పాదములు పట్టుకున్నాడు. “మహానుభావా! మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు. కష్టపడ్డాము. కానీ అమృతమును సేవించలేకపోయాము. అమృతమును సేవించక పోవడం వలన ఇక మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసినదేనా? అమృతం త్రాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాము. అందుకని మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమయిన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను’ అన్నాడు.

ఇపుడు గురుశక్తి గొప్పదా? అమృతము గొప్పదా? ఈ విషయం తేల్చాలి. అపుడు శుక్రాచార్యుల వారు బలి చక్రవర్తితో ‘ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను. దీనిని ‘విశ్వజిత్ యాగము’ అంటారు అని ఆ యాగమును బలిచక్రవర్తి చేత ప్రారంభింప జేశారు. యాగమునకు ఫలితము విష్ణువే ఇవ్వాలి. విశ్వజిత్ యాగము నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగ గుండములో నుండి ఒక బంగారు రథము బయటకు వచ్చింది. దానిమీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉంది. సింహము గుర్తుగా గలిగిన పతాకం ఒకటి ఎగురుతోంది. అద్వితీయమయిన అక్షయ తూణీరముల జంట వచ్చింది. ఒక గొప్ప ధనుస్సు వచ్చింది. శుక్రాచార్యుల వారి అనుమతి మేరకు బలిచక్రవర్తి వీటిని స్వీకరించాడు. బలిచక్రవర్తి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆయన వచ్చి ఒక స్వర్ణ పుష్పమాల బలిచక్రవర్తి మేడలో వేశాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహంతో అమృతం తాగిన వాళ్ళని ఓడించడం అనేది బలిచక్రవర్తి కోరిక. విశ్వజిత్ యాగం ఫలించింది. స్వర్ణ పుష్పమాలను మేడలో వేసుకొని దివ్యరథమును ఎక్కి అమరావతి మీదకి దండయాత్రకు వెళ్ళాడు.

ఇంద్రుడు ఈవార్త తెలుసుకున్నాడు. ‘అవతలి వాడు గురువుల అనుగ్రహంతో వస్తున్నాడు. ఇప్పుడు నేను యుద్ధం చేయగలనా? శుక్రాచార్యులు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం చేయించాడు. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇపుడు తను సలహా నిమిత్తం గురువుగారి దగ్గరకు వెళ్ళాలి’ అనుకుని ఇంద్రుడు దేవతలతో కలిసి గురువు గారయిన బృహస్పతి వద్దకు వెళ్ళాడు. అపుడు దేవతలను ఉద్దేశించి ఆయన అన్నారు ‘ఈవేళ బలిచక్రవర్తికి శుక్రాచార్యుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. నాకు తెలిసినంత వరకు బలిచక్రవర్తిని ఇప్పుడు ఓడించగలిగిన వాడు సృష్టిలో ఇద్దరే ఉన్నారు. ఒకడు శివుడు, రెండు కేశవుడు. ఈ ఇద్దరే ఓడించాలి తప్ప ఇంకెవరు బలిచక్రవర్తిని ఓడించలేరు. కాబట్టి మనం ఆయననే ప్రార్థన చేద్దాము’ అని చెప్పగా వారందరూ శ్రీమహావిష్ణువును ప్రార్థన చేశారు. 

అపుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై ఒక చిత్రమయిన మాట చెప్పారు ‘బృహస్పతి చెప్పినది యథార్థము. ఏ గురువుల అనుగ్రహంతో ఈవేళ బలిచక్రవర్తి ఈ స్థితిని పొందాడో మళ్ళీ ఆ గురువుల అనుగ్రహానికే బలిచక్రవర్తి దూరం అవాలి. అలా దూరమైన రోజున మీరు బలిచక్రవర్తిని చిటికిన వేలితో కొట్టగలరు. గురువుల అనుగ్రహం అంత స్థాయిలో ఉండగా మీరు వానిని ఏమీ చేయలేరు. యుద్ధం చేయడం అనవసరం. కాబట్టి మీరు అమరావతిని విడిచిపెట్టి వేషములు మార్చుకుని పారిపోండి’ అని చెప్పాడు. అపుడు దేవతలు తలొక దిక్కుపట్టి వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి అమరావతి వచ్చి చూశాడు. ఒక్కడు కూడా లేడు. దివ్యమయిన అమరావతీ పట్టణం సునాయాసంగా తనది పోయింది. ఇంద్ర సింహాసనమును అధిరోహించి కూర్చున్నాడు. ఇకనుంచి యజ్ఞ యాగాది క్రతువులు ఏవి చేసినా హవిస్సులు తనకే ఇమ్మనమని ఆజ్ఞాపించాడు. ఇప్పటి నుంచి మళ్ళీ అహంకారము ప్రారంభమవుతుంది. బలిచక్రవర్తి వైభవం కొనసాగుతోంది. ఆయన దానధర్మములకు పెట్టింది పేరు. అటువంటి బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నాడు. ముల్లోకములను పాలన చేస్తున్నాడు. ఆయన రావణాసురుని వంటి ఆగడములను చేసిన వాడు కాదు. మహాభక్తుడు. ఇటువంటి సమయంలో చిత్రమయిన ఒక సంఘటన జరిగింది.

కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. ఒకరు అదితి, ఒకరు దితి. ఇంద్రాదులు అదితి కుమారులు. ఇవాళ వారు అమరావతిని విడిచిపెట్టి అరణ్యములలోకి వెళ్ళిపోయారు. ఆవిడ బాధ భరించలేక ఒకనాడు తన భర్త అయిన కశ్యప ప్రజాపతికి చెప్పింది. కశ్యప ప్రజాపతి గొప్ప బ్రహ్మ జ్ఞాని. ఆయన ఒక నవ్వు నవ్వి ‘అదితీ! ఈ భార్యలేమిటి? కొడుకులేమిటి? రాజ్యాలేమిటి? ఈ సింహాసనములు ఏమిటి? ఈ గొడవలు ఏమిటి? ఇదంతా నాకు అయోమయంగా ఉంది. ఈ సంబంధములకు ఒక శాశ్వతత్వం ఉన్నదని నీవు అనుకుంటున్నావా? నేను అలా అనుకోవడం లేదు. ఉన్నదే బ్రహ్మమొక్కటే అని అనుకుంటున్నాను. నీవు విష్ణు మాయయందు పడిపోయావు. అందుకని ఇవాళ నీ బిడ్డలు, దితి బిడ్డలు అని రెండుగా కనపడుతున్నారు. ఒకరికి ఐశ్వర్యం పోయింది. ఒకరికి ఐశ్వర్యం ఉన్నది అని బాధపడుతున్నావు. నేనొక మాట చెప్పనా! ఈ ప్రపంచంలో కష్టములో ఉన్నవానిని ఈశ్వరుడు ఒక్కడే రక్షించగలడు. ఆయనను అడగాలి గానీ నన్ను అడుగుతావేమిటి? నిజంగా రక్షణ పొందాలి, నీ కొడుకైన దేవేంద్రుడు దేవతలు తిరిగి ఆ సింహాసనమును పొందాలి అని నీవు అనుకున్నట్లయితే మహానుభావుడయిన ఆ జనార్దనుని పూజించు. ఆయన కానీ ప్రీతి చెందాడంటే ఆయన చేయలేనిది ఏదీ ఉండదు. సర్వేశ్వరుడయిన నారాయణుని ప్రార్థించు’ అని చెప్పి ‘పయో భక్షణము’ అనే ఒక వ్రతమును కల్పంతో ఆమెకు ఉపదేశం చేశాడు. ఆ వ్రతం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది మనందరం చేసే వ్రతం కాదు. 

ముళ్ళపంది లేదా అడవి పండి తన కోరతో పైకెత్తిన మట్టిని తీసుకొని ఒంటికి రాసుకుని స్నానం చేసి చాలా జాగ్రత్తలు తీసుకొని పన్నెండు రోజులు ఆ కల్పమును ఉపాసన చేయాలి. అలా చేయగలిగితే భగవంతుడిని సేవించగలిగితే పన్నెండు రోజులలో శ్రీమన్నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భగవంతుడయిన శ్రీమన్నారాయణుని అనుగ్రహమును కోరి నీవు ఈ వ్రతమును చేయవలసింది’ అని చెప్పాడు. ఆవిడ భర్త మాటలను నమ్మి పన్నెండు రోజులు ఈ వ్రతం చేయగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయాడు. ఆవిడ శ్రీమన్నారాయణుడు కనపడితే తన కొడుకుకి రాజ్యం ఇప్పించాలని వ్రతం చేస్తోంది. నిజంగా శ్రీమన్నారాయణుడు కనపడేసరికి అదితి ఆయన రూపమును కళ్ళతో జుర్రుకు త్రాగేసింది. గట్టిగ కంఠం రాక ఏమి మాట్లాడుతున్నదో కూడా వినపడకుండా అలా చూస్తూండిపోయింది. ఆమె చేస్తున్న ఆ స్తోత్రము అంతటా నిండి నిబిడీకృతమయిన వాడెవడున్నాడో ఆయనకే వినపడాలి.

అపుడు స్వామి అడితిని ‘నీవు ఈపూజ ఎందుకు చేశావు?’ అని అడిగాడు. అపుడు ఆవిడ ‘స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్య భ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది’ అని అడిగింది. కాని స్వామి ‘నీ కుమారునికి రాజ్యం ఇప్పిస్తాను’ అని అనకుండా ‘అమ్మా! నీ కుమారుడు ఇంద్రుడు, కోడలు శచీదేవి బాధపడుతున్నారని అనుకుంటున్నావు కదా! వాళ్ళందరూ నీవు సంతోషించేటట్లు నేను తప్పకుండా నీవు అడిగిన పని చేస్తాను. కానీ అమ్మా, నాకు ఒక కోరిక ఉంది. ‘ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని నారాయణుడు వరము అడుగుతున్నాడు. ‘అమ్మా! నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉంది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను’ అని అడిగాడు. అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆడపు ఆమె అంది ‘స్వామీ నాకు అంతకన్నా భాగ్యమా! తప్పకుండా’ అన్నది. అపుడు స్వామి ‘నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను’ అన్నాడు. ఎంత యథాపూర్వకంగా పుట్టాడో చూడండి. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. ఇపుడు అదితి గర్భం గర్భాలయం అయింది. 

గర్భము నిలబడినది కనుక ఆవిడ చుట్టూ ఉన్న స్త్రీలు వేడుక చేశారు. అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తి అయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా జన్మించాడు. పుడుతూ శంఖ చక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సున్న వటువుగా బ్రహ్మచారిగా ఇంచుమించుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్య మండలము నుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రంను ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగ కర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింక చర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు. యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతలా గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. భవానీ మాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. అందుకని వటువు అన్నాడు ‘ఓహో! నీవేనా బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు. 

బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. అపుడు బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారు పళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.


భాగవతం - 61 వ భాగం  CLICK HERE

Popular Posts

Popular Posts

Ads