శివపురాణం - 22 వ భాగం

రుద్రాక్ష ధారణ – మారేడు దళము
భస్మముతో పాటు రుద్రాక్షలు కూడా చాలా గొప్పవి. తపస్సు చేస్తున్న శంకరుని కన్నులవెంట కారిన జలబిందువులు భూమి మీద పడితే అవి రుద్రాక్షచెట్లయి పైకి లేచాయి. అందుచేత అవి ఈశ్వరుని తపశ్శక్తితో కూడిన కంటినీటి బిందువులలోంచి ఉద్భవించినవి కాబట్టి అవి మిక్కిలి తేజస్సు సంపర్కములై ఉంటాయి అని మన పెద్దలు నమ్ముతారు. నేపాల్ ఖాట్మండు పశుపతినాథ దేవాలయంలో రుద్రాక్ష చెట్టు ఉంది. అవి ఏకముఖి నుంచి దశముఖి వరకు ఉంటాయి. అందులో ఆరు ముఖములు ఉన్న రుద్రాక్ష కేవలము సుబ్రహ్మణ్య స్వరూపమని పెద్దలు నమ్ముతారు.
మీకు సృష్టిలో ఒక్క రుద్రాక్ష గింజలో మాత్రమే మధ్యలో తొర్ర ఉంటుంది. వీటిని ఒక మాలగా గ్రుచ్చవచ్చు. రుద్రాక్షలకు అపారమైన శక్తి ఉంది. రుద్రాక్ష శరీరము మీద ఉన్న చెమటతడితో తడిసినా లేదా స్నానం చేస్తున్నప్పుడు రుద్రాక్షలతో తడిసిన నీళ్ళు శరీరం మీద పడినా అది శరీరంలో ఉన్న ముఖ్యమయిన అవయవముల పనిని నియంత్రించి రక్షించగలదు.అలా రక్షించగలిగిన శక్తి రుద్రాక్షలకు ఉన్నది. అందుకే రుద్రాక్ష మాలలో పగదమును ముత్యమును కలిపి వేసుకుంటారు. రాత్రి నిద్రపోతున్నప్పుడు రుద్రాక్షమాల ధారణ ఉండదు. రాత్రుళ్ళు దానిని తీసి భగవంతుని పదముల వద్ద పెట్టి మరల పొద్దున్నే వేసుకుంటారు. చిదంబర క్షేత్రమును సాక్షాత్తు పరమేశ్వరుని హృదయంగా భావిస్తారు. భగవంతుని హృదయము చిదంబరం అయితే, ఈశ్వరుడు మనలోకి వచ్చి కూర్చోవడానికి వీలయిన రీతిలో మీ శరీరమునందు సాత్వికమయిన భావనలు కలిగేటట్లుగా లోపల కన్నం ఉండి ఇటునుంచి అటు దారం వెళ్ళిపోయేటట్లుగా ఉన్న ఏకైక పవిత్రమయిన గింజ రుద్రాక్ష.
రుద్రాక్ష వేసుకోవడం అంటే ‘నేను కూడా నా భావనల చేత నా కర్మల చేత నా శరీరంలో జరుగుతున్న సమస్త వ్యాపారములను ఒక మాలగా గుచ్చి ఈశ్వరుడి మెడలో వేయుచున్నాను” అని అర్థం. ఈ భావన ఏర్పడిందంటే ‘యద్యత్కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ మనం చేసే కర్మలన్నీ ఈశ్వరుని సేవలై కూర్చుంటాయి. అటువంటి భావన కలగడానికి రుద్రాక్ష ధారణ చేస్తారు.
ఉమానాథుడయితే మారేడు దళము, శ్రీమహా విష్ణువయితే తులసిదళంతో మనం పూజ చేస్తాము. రెండూ దళాలే. మారేడుదళం ఏర్పడడమే చిత్రంగా ఏర్పడింది. శ్రీసూక్తం చదివినప్పుడు మనం ఈ క్రింది మంత్రమును చదువుతుంటాము.
ఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథబిల్వః!
తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః!!
లక్ష్మీదేవి ఒకనాడు తపస్సు చేద్దామని అనుకున్నప్పుడు కుడిచేతితో ఆమెచేత సృష్టించబడిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలము’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉన్నది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!
దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడ్ ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు మూడు కింద తొమ్మిది కూడా ఉంటాయి. పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనెకాని శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉంటే మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు. శివుడికి మారేడు దళంతో పూజ చేయడం మొదలు పెట్టగానే వెంటనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. ‘బాల్యం, యౌవనం, కౌమారం ఈ మూడింటిని నీవు చూస్తావు’ అని ఆశీర్వదిస్తాడుట. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు. మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీసూక్తంలో ‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’ (అమ్మా అలక్ష్మిని దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము. మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి. నాల్గవదానిలోకి వెళ్ళడు. నాల్గవది తురీయము. తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.
మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది. శాస్త్రము మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.
అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. ‘మా-రేడు’ తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మా రాజు. ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.
అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందులో మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం, రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట, మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట. ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.

శివపురాణం - 23 వ భాగం

గౌరీపూజ
ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిరువురూ మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతం ఒక జీవ స్వరూపమును పొంది సేవిస్తోంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. పరమశివుని చెల్లెలుగా సరస్వతీ దేవి సంభావించబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనమైన వృషభం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతం తెల్లగా ఉంటుంది. వేసుకునే పుర్రెల మాల తెలుపు. ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు జ్ఞానప్రదాతయై ఉంటాడు. ఇంత తెల్లటి శంకరుడి ప్రక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చుంది. కానీ యథార్థమునకు శివ పార్వతులిరువురిలో కూడా వారి రూపురేఖలకు సంబంధించిన భావములేవీ లేవు. ఆయన పార్వతీదేవి వంక చూసి ‘కాళీ’ అని పిలిచారు. ఆ పిలుపు పూర్వం పిలిచినట్లు లేదు. కొద్దిగా ఏదో ఎత్తిపొడిచినట్లుగా ఉంది. ‘ఓ నల్లపిల్లా’ అని పిలిచినట్లు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిప్యి కన్నుల వెంట భాష్పధారలు కారుతుండగా అమ్మవారు క్రిందికి దిగి ‘లోకమునందు ఎన్ని సుఖములైనా ఉండవచ్చు, ఎన్ని భోగాములైనా ఉండవచ్చు. కానీ భర్తకు ప్రీతి చేయలేని సౌందర్యం ఈ శరీరమునందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరమును పొంది ఉండడంలో ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు నేను కైలాసంలో ఉన్నా, మణిద్వీపంలో ఉన్నా, నన్ను ఎంతమంది సేవిస్తున్నా, మా వారు మాత్రం నన్ను కాళీ అని పిలుస్తారు. ఇటువంటి భావన నాకు కలగగానే ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతోంది’ అంది. అన్ని కారణముల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది. తాను ఏది చేసినా భర్త ప్రీతి కొరకే చేస్తుంది. ఇది మహా పతివ్రత లక్షణము. అందుకే శంకరాచార్యులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తే ‘శివశ్శక్త్యా యుక్తో’ అని ప్రారంభించారు. ఆయన పేరు ఎత్తకుండా మొదలెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు మహానుభావులు అయిన శంకరులకు తెలుసు కనుక భర్త పేరుతోనే మొదలుపెట్టారు. ఆయన పేరు చెప్తే ఆవిడకు సంతోషం. ‘నీవు ఈ శరీరమును చూసి ప్రీతిని పొందడం లేదు. అటువంటప్పుడు ఈ శరీరంతో నేను ఉండాలని అనుకోవడం లేదు. ఈ నల్లటి శరీరమును వదిలిపెట్టేస్తాను. నీకు ప్రీతిని కలిగించే శరీరముతో వస్తాను. దేవా నన్ను అనుగ్రహించండి’ అంది. ఈ మాటకు శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ‘అయ్యో పార్వతీ, నా మనస్సు నీకు తెలియదా. నీయందు నాకెప్పుడూ అటువంటి భావన లేదు. ఒకవేళ నేను పరాచికానికి అన్నమాట నీకు అంత కష్టపెట్టి ఉన్నట్లయితే ఇంతటి నిర్ణయం తీసుకునేటట్లయితే నేను నీ పాదములమీద వ్రాలి నీ సేవ చేస్తాను. నువ్వు ఇంత తొందర నిర్ణయమును తీసుకోవద్దు’ అన్నాడు. ఈ సంఘటన అంతఃపురంలో జరిగింది. ఎవ్వరికీ తెలియని విషయం. ఇప్పుడు ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది.
పరమశివుని మాటలను విన్న ఆవిడ ‘లేదు లేదు. నేను మీ మనస్సును చూరగొనలేక పోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇష్టపడను. నేను ఇంక ఈ శరీరంతో ఉండను’ అని శరీరమును వదిలిపెట్టేసింది. మరల ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమశివుడికి ఇల్లాలయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరింది. ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమయిన వస్త్రములను ధరించింది. ఎవరు ఈమాట అన్నాడో ఆయనకు ప్రీతి కలిగిన రంగును నేను పొందుతాను అని నియతమయిన సంకల్పం చేసి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమెను తిందామని ఒక పులి వచ్చింది. ఆమెను చూడగానే దుష్ట గుణము కలిగిన పులి సాత్త్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది. తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకు కూడా మూడు రకములయిన మలములు ఆవిడను చూసేసరికి ఎగిరిపోయాయి. అమ్మవారి పాదములకు ఉండే బొటనవేలి గోటి నుండి వస్తున్నా కాంతిని చూస్తే పాపములు ఎగిరిపోతాయని వ్యాసమహర్షి అంటారు. అగ్నిహోత్రమును ముట్టుకుంటే కాల్చడం దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా అది ఏ దృష్టితో చేసినా తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న మూడు రకములయిన మలములను తీసివేసింది. అది అదేపనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని లోపలికి రాకుండా కాపాడుతోంది. పిమ్మట శుంభనిశుంభులను సంహరించదానికి ఒక రూపమును ఇవ్వమని బ్రహ్మ అడిగాడు. ఆ తల్లి ఇపుడు రూపమును స్వీకరించాలి బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు ఎరుపు పసుపు రంగులతో కూడిన రంగులోకి అమ్మవారు మారిపోయింది. గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు. తన నల్లని శరీరమును పాము కుబుసము విడిచినట్లు అమ్మవారు లీలా మాత్రంగా శరీరమును విడిచింది. ఈ విధంగా విడిచిన నల్లని శరీరమునకు కౌశికి అనే పేరు వస్తుంది.
ఇక్కడ మీకొక విషయం అవగతం కావాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినది కాముని బాణముల వలన జరిగిన సృష్టి కాదు. అది లీలా మాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై, ఆ తల్లి లోపల మనస్సు నందు కదిలితే, ఆ సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతొ నల్లటి శరీరమును ఇచ్చి ఈవిడ వచ్చి శుంభ నిశుంభులను సంహారం చేస్తుందని బ్రహ్మ కోర్కెను తీర్చింది. ఇపుడు ఈ కౌశికి వెళ్లి శుంభనిశుంభుల సంహారం పూర్తిచేసింది. ఆ తర్వాత అమ్మవారు వింధ్యవాసినియై వింధ్య పర్వతం మీద కూర్చుని ఉంది. ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడకి వాహనంగా బహూకరించాడు. సింహవాహన అనే పేరుతో వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి మనలనందరిని రక్షించడం కోసమని ఆ వింధ్యపర్వతం మీద వేంచేసి ఉన్నది.
ఇపుడు ఈ గౌరీ వ్యాఘ్రమును కూడా వెంటపెట్టుకుని పరమశివుడు ఉన్న మందరపర్వతం మీదకు వెళ్ళింది. ఆమెను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. ‘పార్వతీ, నేను ఆనాడు ఈమాట ఎందుకన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థం అయింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి. ఇప్పుడు నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. నీవు వాక్యము, నీవు విద్య. నేను ఆ విద్యచేత ప్రతిపాదింపబడే జ్ఞానమును. విద్య జ్ఞానము ఈ రెండూ ఎలా విడివడి ఉండవో అలా నీవు నేనూ ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. నీవు సోమాత్మకంగా ఉంటావు. నేను అగ్నిస్వరూపంగా ఉంటాను. ఊర్ధ్వముఖ ప్రయాణం నాది. నీవు క్రిందికి వెడతావు.నేనే ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినపుడు నీ అనుగ్రహ ప్రవేశం చేత మరల సృష్టి పునఃసృష్టి జరుగుతోంది. కాబట్టి ఈ సమస్తము మనమిరువురమై ఉన్నాము. ఇక మనం విడివడినది ఎప్పుడు! అటువంటిది నీవు నామీద కోపపది దూరంగా వెళ్ళినట్లుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కోసమని ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాము. మనం చేసిన ఈ లీల వృథాగా పోదు. రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతువు అవుతుంది’ అన్నాడు. ఇక్కడ మనం ఆ లోక రక్షణ హేతువైన విషయమును గూర్చి తెలుసుకోవాలి. ఆంద్రదేశమునందు, తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్ళిచేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీపూజ చెయ్యాలి. గౌరీపూజ చెయ్యడం వెనకాల ఒక రహస్యం ఉంది. అన్నీ అమ్మవారి స్వరూపములే. పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకువిల్లు పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మనకోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టి నంతటినీ చేసి మరల ఆవిడ అనుగ్రహంతో లోకమంతటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులన్నింటినీ అమ్మవారు చేస్తోంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదికి వెడుతున్నపుడు ఆమెకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక ఆమెయందు అటువంటి బలం రావాలని ఆమెచేత సన్నికల్లు తోక్కిస్తారు. పెళ్ళి పీటలమీద కూర్చునేముందు పెళ్ళి కూతురుచేత గౌరీపూజ చేయిస్తారు. ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు ‘సన్నికల్లు ఎలా ఉందొ అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్తమీద మామమీద మరిది మీద ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమయిన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండు చేయకు అని బోధ చేస్తారు. వధువు ‘నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంది పోయేటట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా, అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్లుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదను గాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై వుండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు’ అని పెళ్ళికూతురు గౌరీ తపస్సు చేస్తుంది. మన ఆర్షధర్మం అంత గొప్పది. మనజాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీపూజ చేస్తాము.
అక్కడ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. అక్కడ అమ్మవారు పులిని కూడా మందర పర్వతము దగ్గరకు తీసుకువెళ్ళింది. దానిని పరమశివునకు చూపించి – ‘అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చింది. తన స్వభావమును మార్చుకుంది. కాబట్టి దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురమునందు రక్షణ భారము వహించే అదృష్టమును ఇవ్వండి’ అంది. అపుడు శంకరుడు తప్పకుండా పార్వతీ అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటిముందు నందీశ్వరుని కన్న కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమథగణములలో ఒకడిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనపడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం ఈ గౌరీ వృత్తాంతం కౌశికీ వృత్తాంతం రాక్షససంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపుకుంకుమలతో పదికాలాలపాటు ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. కనుక అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితిని మనం పొందెదముగాక!

శివపురాణం - 24 వ భాగం

మార్కండేయ చరిత్ర
పూర్వకాలంలో మృకండుడు అనబడే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణయందు ఆయన, ఆయన భార్యయైన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక ఉన్నవారు. వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మితం చేసుకుని తల్లిదండ్రులతో, శిష్యులతో అక్కడ నివసిస్తున్నారు. ఆవులనన్నిటినీ చేరదీసి కాపాడుతూ ఆ ఆవుపాలతో శివార్చన చేస్తూ ఆయన ఈలోకమునందు ప్రకాశిస్తున్నాడు. మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది. భర్తను సేవించేది. శిష్యులను తల్లిలా కాపాడేది. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితమును పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితమును నడుపుతున్నా వారికి బిడ్డలు కలుగలేదు. ఆ సాకుతో వారు శివార్చన మాత్రం మానలేదు. ఈశ్వరుడిస్తాడని పూనికతో వారు శివార్చన చేస్తున్నారు.
ఇలా ఉండగా ఒకరోజు మృకండుడు బ్రహ్మ ఉండే అంతఃపురప్రదేశమునకు వెళ్ళి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. అపుడు ఆయనను అక్కడ ఉండే ద్వారపాలకులు మీరు వెళ్ళకూడదు అని అడ్డుపెట్టారు. ఆయన ఆశ్చర్యపోయి ‘నేను ఎందుకు వెళ్ళకూడదు?” అని ప్రశ్నించారు. ‘మీకు సంతానం లేదు. అందువల్ల మీకు బ్రహ్మ సభా ప్రవేశార్హత లేదు’ అన్నారు. మృకండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు ఒకటి ఉన్నది. సంతానం లేకపోతే పితృ ఋణం తీరదు. ఎవరయినా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు. దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు. చేసుకుని తీరాలి. ఇక్కడ మృకండునికి పితృ ఋణం తీరలేదు. అది దోషం. మృకండు మహర్షి ధర్మ సూక్ష్మం తెలిసిన ఉన్నవాడు. ‘నాకు అనపత్య దోషం ఉంది’ అని మనస్సులో కొంచెం బాధపడుతూ ‘అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృ ఋణం నుంచి విముక్తుడిని చేయలేదు’ అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడి ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు. వారు మరుద్వతిని చూసి చాలా సంతసించి ‘అమ్మా మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ప్రదేశములను చూడడానికి వచ్చాము. మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా’ అని అడిగారు. అపుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి’ అని వారందరినీ పిలిచి పంచభక్ష్య పరమాన్నాలతో చక్కటి భోజనం తయారుచేసి వాళ్ళకి భోజనం వడ్డించింది. అపుడు వాళ్ళు ‘అమ్మా, అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము మేమూ తల్లులమే కదా! నీ బిడ్డలను పిలు. నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము. ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది. నీ బిడ్డలను పిలువవలసినది’ అన్నారు. అపుడు మరుద్వతి ‘అమ్మా నేను తక్కువ నోములు నోచాను. నా నోములు ఫలించలేదు. నాకు బిడ్డలు లేరు. మీవంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నాకడుపు పండుతుందని అనుకుంటున్నాను. దయచేసి స్వీకరించండి’ అంది. అపుడు వాళ్ళు ‘అమ్మా, ఏమీ అనుకోవద్దు. పురుషుడు పితృ ఋణం తీరడం కోసమే సంతానమును అపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు. మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేక పోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయము’ అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అపుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది.ఆసమయంలో మృకండు మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగారు. జరిగిన విషయం చెప్పింది ఆవిడ. అపుడు ఆయన కన్నుల కూడా నీరు కారింది. సంతానం కలుగకుండా గల దోషం పరిహరింప బడడం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాదన అంత గొప్పది. ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. అపుడు మృకండుడు అన్నాడు “అయ్యయ్యో మరుద్వతీ, ఏక కారణమునకు ఇద్దరమూ గురయ్యాము. దేవీ, నువ్వు బాధపడకు. ఈశ్వరుడు ఉన్నాడు. నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను, బయలుదేరుతున్నాను” అని నీ తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజూ అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వరారాధన చేస్తోంది. వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్నా శంకరుడు ప్రత్యక్షం అవలేదు.
నారదమహర్షి కైలాసమునకు వెళ్ళి శంకరుని చూసి ‘తండ్రీ, నిన్ను నమ్మి ఆ దంపతులిద్దరూ తపస్సు చేస్తున్నారు. ఇలా పిలిస్తే పలికేవాడివి.వారినింకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు’ అన్నాడు. శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై నీకు పదహారేళ్ళ వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కుమారుడు పుట్టాడు. మార్కండేయుడని పేరు. ఆ దంపతులు, కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతున్నారు. ఇలా గడిపేస్తుండగా ఒకరోజు నారదమహర్షి అక్కడికి వచ్చారు. మృకండు దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. నారదుడు మృకండునితో ‘మృకండా, నీకు ఒక్క విషయం జ్ఞాపకం ఉందా? ఈ పిల్లవానికి పదిహేనవ సంవత్సరం వెళ్లి పదహారవ సంవత్సరం వచ్చింది. అది కూడా కొద్ది రోజులలో అయిపోబోతోంది. ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లవాడికి ఏదయినా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా! ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా’ అన్నాడు. నారదుడు ఈమాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తోంది. ఇంత తపో నిష్ఠా గరిష్టుడయిన మృకండుడు కూడా దుఃఖమును ఓర్చుకోలేక క్రిందపడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్ఛి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారమూ లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అపుడు నారదుడు వాడి భక్తి, వాడి విశ్వాసం వాడి ధృతి వాడి ధైర్యం చూశారా! మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగల శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి. తపస్సు మొదలుపెట్టండి. మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఎ శంకరుడు వీనిని ఇచ్చాడో ఆ శంకరుడు వేడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది. పిల్లాడిని పంపండి’ అన్నాడు. అపుడు మార్కండేయుడు “నన్ను అనుమతించండి. నేను దీర్ఘాయుష్మంతుడనవ్వాలని ఆశీర్వచనం చేయండి. శంకరుని గూర్చి తపస్సు చేస్తాను. నాకు ఆ మహానుభావుడు సిద్ధిని ఇస్తాడు. మీరేమీ బెంగ పెట్టుకోకండి’ అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్లి హిమాలయ ప్రాంతమందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలు పెట్టాడు.
సమయం ఆసన్నమయింది. అక్కడ యమలోకంలో యమ ధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుడిని పాశములచేత బంధించి ఈ లోకమును చేరండి’ అని చెప్పాడు. యమదూతలు వెళ్లి పాశం వెయ్యడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అపుడు యమధర్మరాజుకు ఎక్కడలేని కోపం వచ్చి నేను బయలుదేరి వెడతాను. నాకు ఏమగాడు అడ్డు వస్తాడో చూస్తాను’ అని బయలుదేరుతుండగా నారదుడు ఎదురు వచ్చాడు. మహర్షిని నమస్కారం చేశాడు యమధర్మరాజు. అపుడు నారదుడు ‘ఎందుకయ్యా పంతాలు పట్టింపులు. వాళ్లకి ఉన్నది ఒక్క పిల్లాడు. మహర్షి కదా. పుత్రభిక్ష పెట్టిన వాడవు అవుతావు కదా’ అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది. ప్రాణములు తీసి తీరతాను అని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అతనిని బహిర్ముఖుని చేస్తే సరిపోతుంది అనుకోని బయటకు రా నేను యమధర్మరాజుని నీ ప్రాణములు తీయడానికి వచ్చాను. అదే నీకు మోక్షము. బయటకు రా’ అన్నాడు. అపుడు మార్కండేయుడు ‘ఓరి పిచ్చివాడా! నీకుకూడా ప్రభువెవడో వానిని నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. నా తల్లిదండ్రుల కోర్కె తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. అలా ఉండేటట్లు చేయమని పరమశివుని ప్రార్థిస్తున్నాను. నేను ఆయనను ఆరాధన చేస్తుండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు? నీకు చేతనయితే ప్రాణాలు తియ్యి’ అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. చేతిలో మెరిసిపోతున్న యమపాశమును విసిరి లాగుతున్నాడు. పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగలించుకుని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు. అలా కౌగలించుకోవడంలో కంఠమునకు పడిన పాశం శివలింగమునకు తగిలింది. అంతే ఒక్కసారి శివలింగం ఫెటిల్లున పేలిపోయింది. వామార్ధ భాగమునందు పార్వతీ దేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు వక్షస్థలం పై ఒక్క తన్ను తన్నేటప్పటికి యమధర్మరాజు నీలపై విరుచుకు పడిపోయాడు. అపుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఒక్కవరం కోరుకో. అన్నాడు.
మార్కండేయుడు ఇరువురికీ నమస్కరించి నేను ఏ కోరిక కోరను? పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు. ఆయనను బ్రతికించండి’ అన్నాడు. అపుడు శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మళ్ళీ లేచి నమస్కరించి “స్వామీ, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి పదహారు సంవత్సరములు ఆయుర్దాయం మాత్రమె ఉంటుందని చెప్పావు. నేను చేసిన దోషం ఏమిటి? చెప్పవలసింది’ అన్నాడు. శివుడు మందహాసం చేసి నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సు ఉండే పిల్లవాడిని నేను వాళ్లకి ఇచ్చాను. నువ్వు పదహారేళ్ళే అర్థం చేసుకున్నావు. అందుకని ఇలా జరిగింది ఏమీ బెంగలేదు. వెళ్ళు’ అన్నాడు. మార్కండేయుడిని చూసి పార్వతీదేవి పొంగిపోయింది. వీడికి మంచి వరమును ఇవ్వవలసింది అని చెప్పింది భర్తకి. అప్పుడు పరమేశ్వరుడు ‘ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్రశాయి తన బొటనవేలిని నోటిలో పెటుకుని చీకుతూ ఒక మర్రి ఆకుమీద పడుకున్తాడో అప్పటి వరకు చిరంజీవివై ఉంది మార్కండేయాయుష్షు అనే కొత్త ఆయుష్షును సృష్టించి నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకే మనవాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్ళు పోస్తే నాన్నా నీకు మార్కండేయ ఆయుష్షురా’ అనేవారు. అలా రోజూ అంటూ నీళ్ళు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమౌతుంది అని వారి ఉద్దేశం.
ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నామీద నమ్మకంతో చదివితే వాళ్లకి అపమృత్యుదోషం రాకుండా నేను పరిహరిస్తాను. వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి చంద్రశేఖరాష్టకం అంత గొప్పది. ఎవరయితే ఈ చంద్రశేఖరాష్టకమును నమ్ముకుని ప్రతిరోజూ ఇంట్లో చాడువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళలోంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశములను కాపాడతాను. ఇది చదివిన వారికి దీనిని వినిన వారికి అపారమయిన కీర్తిని తేజస్సుని ఆయుర్దాయం నేను కృప చేస్తున్నాను అన్నాడు. ఈ అష్టకం ఎక్కడ చదువుతున్నారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అన్నాడు. ఎవరు నమ్మకంతో రోజూ శివుని సన్నిధానమునందు మృత్యు భీతితో ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యు భయం ఉండదు. ఆపదలు రాకుండా పూర్ణమయిన ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు. దానితో బాటుగా అఖిలమయిన అర్థములు యశస్సు సంపత్తి అన్నీ చేకూరుతాయి. వీరి ప్రయత్నం లేకుండా చిట్టచివరి రోజున చంద్రశేఖరాష్టకం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నామం జ్ఞాపకమునకు వచ్చి చంద్రశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతాడు. అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు చదువుతున్నారో/వింటున్నారో వారికి పరిపూర్ణమయిన శివకటాక్షం కలుగుతుందని శివపురాణామ్తర్గతమయిన వాక్కు.

శివపురాణం - 25 వ భాగం

నటరాజు
మనకి పరమశివుని స్వరూపము అనేకరకములయిన మూర్తులుగా గోచరిస్తూ ఉంటుంది. పరమ శివునికి అరువది నాలుగు మూర్తులు ఉన్నాయి. శివుని స్వరూపమేమి అని అడిగితె మనకి శివలింగం అనే సమాధానం వస్తుంది. సాధారణంగా శివాలయముల అన్నిటియందు లింగ స్వరూపమే ఉంటుంది. కానీ సాకారంగా పరమశివుడికి పార్వతీదేవికి మూర్తి ఉన్నది. ఈ అరువది నాలుగులో ఒక భాగమును ‘ఘోర స్వరూపములు’ అంటారు. ఇవి సాధారణంగా శిక్షించడానికి వస్తాయి. రెండవది ‘అఘోరరూపములు’. మంగళప్రదంగా ఉంటాయి. అటువంటి మూర్తిని మీరు చూసినప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. మీకు ప్రపంచంలో ఎన్ని రకములయిన విద్యలు ఉన్నాయో ఎన్ని కళలు ఉన్నాయో అంతమందీ కూడా తమ తమ కళలను ప్రదర్శన ప్రారంభం చేసే ముందు నమస్కరించవలసిన మూర్తి ఒకటి లోకంలో ఉంది. దానిని ఆనంద తాండవమూర్తి అంటారు. దానిని మనం ‘నటరాజు’ అని పిలుస్తుంటాం. కానీ శైవాగమం దానిని ‘ఆనంద తాండవ మూర్తి’ అని పిలుస్తుంది. ఆ తాండవం చెయ్యడంలో గొప్ప రహస్యములు కొన్ని ఉంటాయి. ఆనంద తాండవం చేసిన పరమశివుడు ఎవరు ఉన్నారో ఆయనలోంచే సమస్త శాస్త్రములు ఉద్భవించాయి. ఆయనలో నుంచే సమస్తమయిన కళలు వచ్చాయి. ఒక్క శంకరుడు చేసిన తాండవంలోంచి 650 రకాలైన నాట్యములు పుట్టాయి. ఈవేళ ఇప్పటికీ కర్మభూమిలో బ్రతికినవి 108 రకముల నాట్యములు. కూచిపూడి, ఒడిస్సీ, భరతనాట్యము ఇవన్నీ ఆనంద తాండవ మూర్తి అయిన శంకరుని దగ్గరనుంచే వచ్చాయి.
ఈ ఆనంద తాండవ మూర్తి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ చిత్రమును గీయడం లేదా నిలబెట్టడం చాలా కష్టం. చేతులు కట్టుకుని ఆయన నాట్యమును నలుగురు మాత్రమే చూస్తారు. అందులో ఒకడు నందీశ్వరుడు, రెండవ వాడు భ్రుంగి, మూడవ వాడు పతంజలి, నాల్గవ వాడు వ్యాఘ్రపాదుడు. ఈ తాండవం ఆ స్వరూపంలో అప్పుడు సమస్త లయకారకమై ఉంటుంది. ఈ తాండవం ప్రదోష వేళలో జరుగుతూంటుంది. ఆయన నాట్యము చేత ఈ లోకమునకు రాజయ్యాడు. అందుకే ‘నటరాజు’ అని పిలుస్తుంటాము. ఆయన చేసే నాట్యం మామూలు నాట్యం కాదు. అది మీరు తెలుసుకుంటే చిదంబరంలో కనకసభ దగ్గరకు వెళ్లి అంత పెద్ద ఆనంద మూర్తిని మీరు చూడవచ్చు. అక్కడ ఆ మూర్తిని చూడగానే మీరు ప్రణిపాతం చేసి సాష్టాంగనమస్కారం చేసేస్తారు. అఘోర స్వరూపముల యందు చాలా గొప్ప స్వరూపములలో ఆనందమూర్తి స్వరూపం ఒకటి.
ఆనంద తాండవం చూసే స్థాయి పొందిన వాళ్ళలో మొదటి వాడు నందీశ్వరుడు. ఆయన అయ్యవారికి చాలా గొప్ప భక్తుడు. రెండవ వాడు భ్రుంగి. మూడవ వాడు పతంజలి. ఆదిశేషుని అవతారము. అందుకని ఆయన తల మనుష్యుడిగా ఉంటుంది. మిగిలిన శరీరం పాముగా ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి తలకాయ మనుష్యుడిది. పాములు పెద్దపులివి ఉంటాయి. ఈ నలుగురు నిలబడి తాండవం చూస్తూంటారు. ముప్పది మూడు కోట్లమంది దేవతలు అక్కడే ఉంటారు. బ్రహ్మ శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటారు. పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికీ తోచిన వాద్య విశేషణాన్ని వారు వాయిస్తూంటారు. డమరుకం కదలిక చేత ఇన్ని రకములయిన సృష్టి ప్రారంభం అయింది. ఆయన చేతిలో ఉన్న డమరుకం కారణంగా ఈయన సృష్టికర్త అయ్యాడు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి. ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనే సమస్త కదలికలకు డమరుక సంకేతం. ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి ఆయన కదలికే కారణము. ఈశ్వరుని కదలికకు నర్తనమని పేరు. ఇదే ఆనంద తాండవము. ఆనంద తాండవ మూర్తి చేతిలో కుడివైపు డమరుకం ఉంటుంది. ఎడమచేతి వైపు అగ్నిహోత్రం ఉంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి. ఈ విషయం లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పుడు పనులు చేయడు. ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని మీకు అర్థం అయిపోతే మీ నడవడి యందు మార్పు వచ్చేస్తుంది. నటరాజ స్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈయన కాలుకింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు. ఏడవడు. మాయను గెలవడమే కుడికాలి కింద రాక్షసుని తొక్కి పట్టడం. ఎడమ కాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది. కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడమకాలు. అందుకే ఆనంద తాండవ మూర్తి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది. నీవు ఊర్ధ్వ ముఖ చలనము చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది ‘నేనుగా ఉండడం’ నీవు నేర్చుకో. నీవు నేనై ఉన్నాను అని తెలుసుకో. దానికి ధ్యానం అవసరం. ఇది చెప్పడానికి ఎడమచెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది. కుడి చేయి అభయ ముద్ర పట్టింది. శివుడు చాలా తేలికయిన వాటిని పుచ్చుకుని పెద్ద శుభ ఫలితములను ఇస్తాడు. ఇది చెప్పడానికే ఆయన అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి ‘శివ’ – అంటే మంగళమును చేరతాడు. ఈ ‘శివ’ నుండి ఆనంద తాండవ మూర్తిలోనికి లయం అయిపోవాలి, తాను ఆనందంగా మారిపోవాలి. అలా మారిపోతుంటే ఇప్పుడు ఆయన దిగంబరుడుగా వచ్చాడు. అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందం అంటారు. ఆత్మస్వరూపి అయిన ఆనంద తాండవ మూర్తియండు సాధకుడు కలిసిపోతే తానె ఆనంద తాండవ మూర్తి అయిపోతాడు. ఆయనకి మరల చావడం అనేది ఉండదు. ఇదే ఆఖరి చావు. శివుని విశేషములను వేటినీ మీరు సామాన్యముగా తీసుకొనుటకు ఉండవు. మీరు కేవలం ఒక నటరాజ స్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను అంటే మీకు ఈ తత్త్వము ఆవిష్కరింపబడదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం. కోరిక పుట్టినా అది నిలబడడం చాలా కష్టం. ఎందుకు అంటే కింద కుడికాలిక్రింద నవ్వుతూ ఒకడు బ్రతికే ఉంటాడు. వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మనకి తెలియదు. ఎప్పుడయినా మాయ మళ్ళీ పట్టేస్తుంది. మళ్ళీ కూపంలోకి పడిపోతాడు. ఉదాహరణకు రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు. తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు “జటాటవీ గలజ్జల’ అని. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడ లేకపోయాడు. పరమేశ్వరుని తనతో లంకకు రమ్మన్నాడు. ఏమయిపోయింది ఈ స్తోత్రం. అంటే అంతలో మాయ కమ్మింది. అడగడం కాదు. అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి. శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. కాబట్టి అటువంటి ఆనంద తాండవ మూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్యజన్మ ప్రయోజనం నెరవేరేటట్లుగా నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల చేత ఈశ్వరానుగ్రహం మనయందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేద్దాము.

శివపురాణం - 26 వ భాగం

ఒకనాడు పార్వతీదేవి చెలికత్తెలయిన జయ విజయలు అమ్మవారితో ఒకమాట చెప్పారు. ‘అమ్మా, నంది నిన్నూ వహిస్తాడు, శంకరుడినీ వహిస్తాడు. కానీ ఆయనకు కొంచెం శంకరుని మాల ఔదలదాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భ్రుంగీ అంతే. మన మాటే వినేవాడు ఒకడు లేడు. అలాంటి వాడు మనకి ఒకడు ఉంటే బాగుంటుంది. అందుకని నీవు ఒకడిని సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటూంటాడు. అలాంటి వాడిని తయారు చెయ్యి. అతడు మన అంతఃపురమును కాపాడడానికి పనికివస్తాడు” అని చెప్పారు. వారి మాటలు విన్న పార్వతీ దేవి అలాగే చేద్దాం అని తన శరీరమునకు ఉన్న మలమును స్నానం చేసేటప్పుడు నలుగు పిండిలా తీసి దానిలోంచి ఒక పిల్లవాడిని తయారు చేసింది. నలుగులోంచి తయారు చేయబడిన పిల్లవాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. చాలా బాగుండాలని అమ్మవారు సంకల్పం చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు లేచి కూర్చున్నాడు. అపుడు వానితో నీవు వెళ్లి ద్వారము దగ్గర కూర్చుని ఎవరూ లోపలి రాకుండా నిలుపు’ అంది అపుడు ఆ పిల్లవాడు ద్వారం దగ్గర కూర్చున్నాడు.
ప్రమథగణములలో ముందు నందీశ్వరుడు విజయం చేస్తుండగా శివుడు లోపలి వెళ్ళబోయాడు.ఈ పిల్లవాడు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. ముందు శంకరుడు జ్యోక్యం చేసుకోలేదు. అపుడు ప్రమథగణములకు ఆ పిల్లాడికి మధ్య యుద్ధం జరిగింది. ఎవరు సలహా చెప్పారో వాళ్ళే అమంవారి దగ్గరకు వచ్చి అమ్మా పిల్లవాడు యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి నీ శక్తులను పిల్లవాడికి ఇవ్వవలసింది అని చెప్పారు. అమ్మవారు శక్తులను ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమయిన యుద్ధం చేసి ప్రమథగణములనన్నిటిని ఓడించేశాడు. ఇంక అక్కడ నుండి బ్రహ్మ, విష్ణువు కూడా వచ్చేశారు యుద్ధానికి. అయినా ఆ పిల్లవాడు శంకరుడిని లోపలికి పంపించలేదు. అపుడు శంకరుడు చేతిలో త్రిశూలమును పట్టుకుని పిల్లవాని కంఠమునకు గురి పెట్టి విసిరాడు. అపుడు త్రిశూలం ఆ పిల్లవాని కంఠమును ఉత్తరించేసింది. ఆ పిల్లవాడు క్రిందపడి మరణించాడు. తరువాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట కాపలా పెట్టిన పిల్లవాని ప్రస్తావన వచ్చింది. అపుడు శివుడు ఆ పిల్లవానిని త్రిశూల ధారల చేత చంపేశాను అన్నాడు. అపుడు పార్వతీదేవి అయ్యో ఆ పిల్లాడిని నేనే సృష్టించాను – చంపేశారా అని దుఃఖమును పొందింది. ఆవిడ దుఃఖమును ఉపశమింపజేయడానికి దేవతలు అందరూ వచ్చారు. ఆవిడ శంకరుని తన బిడ్డను మరల బ్రతికించమని అడిగింది. అప్పుడు ఆయన తన అనుచరులను పిలిచి మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళి మీకు మొట్టమొదట కనపడిన ప్రాణి ఏదయితే ఉంటుందో దాని తలకాయ తీసుకురండి. ఆ తలకాయ పిల్లవాడికి పెడతాను’ అన్నాడు. వాళ్లకి మొట్టమొదట ఏనుగు కనపడింది. వాళ్ళు దాని తలకాయ పట్టుకొచ్చారు. దానిని ఈ పడిపోయిన పిల్లవాని కంఠమునకు కలిపాడు. ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వానికి శంకరుడెవరో తెలిసి శంకరునికి నమస్కారం చేశాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడమీద కూర్చోపెట్టుకున్నాడు. ఈలోపుగా సుబ్రహ్మణ్య జననం కూడా జరిగిపోయింది. ఈ ఇద్దరి పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది.
ఒకరోజు ఒక యోగ్యమయిన సంబంధం వచ్చింది విశ్వరూప ప్రజాపతి అనే ఆయన తన ఇద్దరు కుమార్తెలయిన సిద్ధిబుద్ధి అనే వాళ్ళను ఇవ్వాలనుకుంటున్నాను అని వచ్చాడు. అపుడు శంకరుడు తన కుమారులను పిలిచి ఎవరు ముందు భూప్రదక్షిణ చేసి వస్తే వారికి ముందుగా పెళ్ళి చేస్తానన్నాడు. ఇద్దరూ బయలుదేరారు. గణపటిది మూషిక వాహనం. అందుకని ఆయన తల్లిదండ్రులిద్దరికీ ఏడుమార్లు ప్రదక్షిణం చేసి వారిని పత్ర పుష్పములతో పూజ చేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు ముందుగా వెళ్ళిపోతున్నట్లు కనపడుతున్నాడు. పార్వతీ పరమేశ్వరునకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేసి ‘నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడివి కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి సిద్ధి బుద్ధిలను గణపతికిచ్చి వివాహం చేశారు. సుబ్రహ్మణ్య స్వామీ వారు క్రౌంచ పర్వతం దగ్గరకు వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు.
ఇక్కడ మనకు కొన్ని సందేహములు కలగడానికి అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా శంకరుడు ఆ పిల్లవాని తలను తీసివేసి ఉంటే ఏనుగు తల పెట్టడం ఎందుకు? పడిపోయిన తలకాయనే అతికించవచ్చు కదా! అని. పార్వతీ దేవి అనగా పరమ ప్రక్రుతి. పరమ శివుడనగా పరమ పురుషుడు. పరమ ప్రకృతి అంటే పంచ భూతములు. పంచభూతములయందలి కదలిక పరమేశ్వరుడు. అమ్మవారు భూతములన్నిటిని తయారుచేస్తుంది. కానీ లోపల చైతన్యం శివుడు. అంటే శివ సంబంధమయిన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము ‘నేను’ అన్నది తెలియదు. పైన ఉన్న శరీరము మూడు గుణముల చేత బంధింపబడి ఉంది. ఈ మూడు గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలము. ఆ మలముతో పిల్లవాడు తయారు అయాడు. అంటే త్రిగుణములయందు కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ తలకు ప్రకృతి తెలుసు శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శివుడు అని తెలియదు. కాబట్టి ఆయన దానితోనే పోరాటం చేశాడు. శంకరుడు ఆ పిల్లవాని తలను త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలమునకు ఉన్న మూడు త్రిగుణములు, వీటికి ఆధారమైన సత్యము శంకరుని చేతిలో ఉన్న త్రిశూలం. శంకరుడు గుణాతీతుడు. ఎప్పుడయితే శివుడి చేతి త్రిశూలం పిల్లవాని కంఠమునకు తగిలిందో త్రిగుణములకు సంబంధించిన బుద్ధి పోయింది. ఇప్పుడు ‘గజ’ – ఏనుగు తల పెట్టబడింది. ‘గ’ అంటే గతి అంటే కదలడం; ‘జ’ అంటే పుట్టడం. ఇపుడు ఆ పిల్లవానికి ఇందులోంచి పుట్టి ఇందులోకి వెళుతున్నాడో తెలిసిపోయింది. అంటే ఇప్పుడు శివసంబంధం వచ్చేసింది. శివుడు తెలిసిపోయాడు. తెలిసిపోవడం గజముఖం. అందుకని శంకరుడికి నమస్కారం చేశాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమమును వినాయకుని మూర్తి ద్వారా లోకమునకు తెలియజెప్పడం. ఏనుగు తల బ్రహ్మాండమును చెప్తే మనిషి శరీరం పిండాండమును చెప్తుంది. బ్రహ్మాండం, పిండాండం రెండింటి యందు పంచభూతములు ఉన్నాయి. రెండూ పంచ భూతములలో నిండి ఉన్నప్పటికీ రెండింటియందు ఉన్నది ఒక్కటే అని జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్త్వమసి అర్థమయితే ‘తత్ త్వం అసి’ ‘అదే వాడి ఉన్నాడు’ జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం మనుష్యుడు తల కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కాబట్టి తత్త్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడాయన వినాయకుడు అయ్యాడు. ‘వి’ అంటే విశిష్టమయిన – అనగా విశిష్టమయిన నాయకుడు అయ్యాడు. మీరు ఆయనను ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని అటువంటి పథంలోకి తీసుకు వెడతాడు. ఆయన విఘ్నములకు నాయకుడు. విఘ్నమును తీసేస్తాడు. మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుస్తాడు.
గణపతి పరబ్రహ్మమై ఉన్నాడు. ఈయనకు సిద్ధిబుద్ధి భార్యలు. ఎవరు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి అనేది ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. గణపతి ఆరాధన చేత మంచి బుద్ధి వచ్చి సిద్ధి పొందడమే ఆయనకీ సిద్ధి బుద్ధి భార్యలు అయి ఉండడం. ఆ అనుగ్రహం మీయందు ప్రసరింపబడడం. ఏనుగుకు అన్నిటికన్నా ఇష్టమైనది దాని దంతం. కానీ అది నమలడానికి పనికిరాదు. ఏనుగు ముఖం ఉన్న గణపతి వ్యాసుడు భారతం చెప్తుంటే తన దంతమును విరిచేసి దానితో రచన చేశాడు. మనకి ఉన్న వస్తువులను లోకోపకారానికి ఉపయోగించాలి. భారతమును రచించడానికి తన దంతం ఉపయోగ పడితే కొన్ని యుగాలపాటు పంచమ వేదమయిన భారతమును లోకం చదువుకుని ఉద్ధరింపబడుతుంది అని భావించి తన దంతమును విరిచేసి దానితో భారతమును రచన చేశాడు. ‘ఏకదంతం, శూర్పకర్ణం, లంబోదరం’ అని పేర్లు సంపాదించాడు. ఎంతో శాశ్వతమయిన యశస్సు పొందాడు. శివుడు ఎంత సులభుడో వినాయకుడు అంత సులభుడు. ఇరువది ఒక్క గరిక తెచ్చి ఆయన పాదముల మీద వేస్తే చాలు. అన్నీ ఇచ్చేస్తాడు. కొద్దిగా సింధూరమును గండయుగ్మమునాకు రాస్తే చాలు పొంగిపోతాడు. ఏనుగు తల కనపడితే మంగళ ప్రదము. చివరకు కలలోకి ఏనుగు వచ్చినా అది మంగళప్రదమే.
గణపతి స్వరూపంలో చిత్రమయినది ఎలుక. గణపతికి వాహనం ఎలుక. ఎలుక దొంగతనానికి ప్రతీక. మనతో పాటే ఉంటుంది. మన వస్తువులన్నీ ఎత్తుకుపోతూ ఉంటుంది. మన బ్రతుకూ అంతే. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మనకి ఆయన పదిమంది హృదయాలను కొల్లగొట్ట గలిగిన దొంగతనమును పొందుతాడు. అనగా ఈశ్వరాభిముఖుడై భగవద్భక్తి చేత తాను మాట్లాడిన మాటలకు పరవశులై చాలామంది హృదయాలను తాను కొల్లగొట్టే దొంగ అవుతాడు. ఇలా మారడానికి ఎలుక విఘ్నేశ్వరుడిని వహించింది. మీరు కూడా అలా వహించడం నేర్చుకోవాలి. పదిమంది ప్రేమను సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దీనిని సూచించదానికే ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుక చెవులు పెద్దవిగా ఉంటాయి చేట లాగా. గణపతిని నమ్మి ఆవాహన చేసి జాగ్రత్తగా ఉపాసన చేస్తే లోకంలో పొల్లు తీసేసి సారం వైపుకి మనలను నడిపిస్తాడు. పరమభక్తిని ఇస్తాడు. ఆయన ఆయుధమయిన గొడ్డలితో కర్మ పాశములను తెంచి భక్తీ పాశములను వేసి తన వైపుకి లాక్కుంటాడు.
చవితి తిథి ఆయనకు చాలా ఇష్టమైన తిథి. ఆరోజు ఎవరయినా వినాయకుడి గురించి ప్రత్యేకంగా వినినా, చదివినా వారు ఎంతో ప్రయోజనమును పొందుతారు. పరమ భక్తితో స్వామికి నమస్కారం చేసినా ఎవరు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తాడు. విద్యార్థికి విద్య వస్తుంది. ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది. కన్యార్థికి కన్య దొరుకుతుంది. పుత్రార్థికి పుత్రుడు పుడతాడు. భోగార్థి అయిన వాడికి భోగములు కలుగుతాయి. మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది. రాజ్యార్థికి రాజ్యం, కీర్తి కావాలనుకున్న వారికి కీర్తి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్లకి ఆరోగ్యం కలుగుతుంది. ఋణభారంతో ఉన్నవాడికి ఋణం తొలగుతుంది. ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి దర్శనం చేత గణపతి యొక్క అనుగ్రహం చేత గణపతి కథను చదవడం చేత సమస్త శుభములు సమకూడతాయని పెద్దలు మనకు ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి ఆ గజానన స్వరూపము అంత గొప్ప స్వరూపము.

శివపురాణం - 27 వ భాగం

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీరతామని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర తత్పురుష ఈశాన వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల నన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా, నా అంతవాడిని నేను అంటున్నావు. అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేయాలని మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. దాన్ని తీసి పారేసి యజుర్వేదమును పిలిచారు. అసురీశాక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నారు. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.
బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు బట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. పుట్టేతప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి ఇచట బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.
ఇకనుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.
ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.
అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు.
కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది.
ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.

శివపురాణం - 28 వ భాగం

శివపురాణం వేదాంత సార సర్వస్వము
శివపురాణం వేదాంత సార సర్వస్వము. దీనిని వినిపించమని మహర్షులందరూ అడిగారు. ఇలా ఎందుకు చెప్పాడు సూతుల వారు అంటే ఒక వస్తువు గొప్పతనం చెప్పడం వలన దానియందు ఆదరణ, గౌరవము, శ్రద్ధ పెరుగుతాయి. అవి పెరిగితే విషయాన్ని సరిగ్గా గ్రహించగలవు. అందుకు పురాణంయొక్క మహిమని పేర్కొన్నాడు సూతుల వారు. "శంకరమ్ సంస్మరణ్ సూతః" - శంకరుని స్మరించి మొదలు పెట్టారు. అనామయుడైన శివుణ్ణి స్మరించి నేను చెప్తాను. ఆ శివుని స్మరించి మీరు వినండి. ఆమయము అంటే ఆధి, వ్యాధి, లోపములు, అజ్ఞానములు. ఆమయములు లేని వాడు శివుడొక్కడే. అందుకే ఆయన రోగంలేని పెద్ద డాక్టర్. అందుకే సంసార వైద్యః ఆయన. "భిషక్తమం త్వా భిషజాం శృణోమి" - అని ఉపనిషత్తు చెప్తున్నది. "ప్రథమో దేవ్యో భిషక్" అటువంటి ఆ వైద్య శిఖామణిని మనం స్మరించుకుంటున్నాం. నా ప్రయత్నం నేను చేస్తాను తరువాత మీఇష్టం అనే డాక్టర్ కాదు ఆయన. ఆయన చెయ్యి వేశాడా జబ్బు సమూలంగా నశిస్తుంది. అనామయం. అన్ని జబ్బులూ పోగొట్టేవాడు. అన్నింటికంటె పెద్ద జబ్బు సంసారం. దానికి వైద్యుడాయన. అందుకే భవరోగ హరుడు అని పేరు ఆయనకి.
అనేక కల్పములు గడిచి ప్రస్తుత కల్పం ప్రారంభమైనది. ఆ సమయంలో ఆరు సముదాయములుగా ఋషులు బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా అడిగారు. మా మధ్య ఒక తేల్చరాని వివాదం వచ్చింది ఏది గొప్పది? అని. సృష్టికర్తవైన గురువువు కనుక నాశరహితమైన బ్రహ్మమేది? అన్నింటికీ కారణమైనదేది? చెప్పమని అడిగారు.
అన్ని తత్త్వములకంటె పూర్వమందున్నవాడు. సృష్టి అంతా తత్త్వములతో కూడియున్నది. అవి సాంఖ్యం ప్రకారం 24/25, ఆగమాల ప్రకారం 36 తత్త్వములు. సృష్టి ప్రారాంభం అయ్యాక ఈ తత్త్వములతో నడుస్తున్నది. సృష్టికి, మూలకములకుముందు ఉన్నది ఎవరు? తత్త్వములు అనగా సృష్టికి మూలకములు సర్వతత్వములకంటే ప్రాచీనమైనవాడు.,సర్వోత్కృష్టుడు, అతీతమైన వాడు ఎవరు? అని అడిగారు. "యతోవాచా నివర్తంతే" ఉపనిషద్వాక్యం అది. ఉపనిషద్వాక్యాలు కొల్లలు కొల్లలుగా పరిగెడతాయి శివపురాణంలో. ఉపనిషత్తులను ఆవుగా భావిస్తే ఆ ఆవు పొదుగు నుంచి వచ్చిన క్షీరమే శివతత్త్వం. మనసుకీ, మాటలకీ అందనిదీ, బ్రహ్మవిష్ణురుద్రాదులకు మూలమైనది. శివుడు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులలో ఒక్కడు అని కాదు శివపురాణ ప్రతిపాదన. వారికి మూలమై బ్రహ్మవిష్ణురుద్రాదులుగా ప్రవర్తిసున్నది. అచ్చమైన హైందవ ధర్మంలో పరతత్త్వ ప్రతిపాదన ఉన్నది. ఆ పరతత్త్వం బ్రహ్మవిష్ణు రుద్రాదులకంటే అతీతమైన వాడు. సృష్టి స్థితి లయ ఉన్నప్పుడే ఈ ముగ్గురూ ఉంటారు. సృష్టికి అతీతంగా ఉన్నది ఈ మూడూ కానిది. అయిన దైవము మహాదేవుడు, శివుడు అని చెప్పబడుతున్నాడు.
Search This Blog
***

"ఓం నమశ్శివాయ:"
"ఓం వాసుదేవాయనమః"
" శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "
Popular Posts
-
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా సామగ్రి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg. పూలమూరలు : ...
-
దత్తాత్రేయ స్వామి చరిత్ర :..... హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా ...
-
అక్షరాభ్యాసం: పసుపు : 100 g కుంకుమ : 100 g గంధం : 1 box విడిపూలు : ¼ kg పూల మాలలు : 2 మూరలు తమలపాకులు : 20 వక్కలు : 100 g ఖర్జూరములు : 1...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet ...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 20 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet హ...
-
పసుపు :100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 pa...
-
మాఘ పురాణం - 1 వ భాగం శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్ని...
-
మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 2...
-
శ్రీ లలితా చాలీసా: లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం చ...
-
మాఘ పురాణం - 10 వ భాగం మృగశృంగుని వివాహము దిలీప మహీజునకు వశిష్ఠువారు ఇట్లు చెప్పసాగిరి – పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నే...
Popular Posts
-
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజా సామగ్రి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg. పూలమూరలు : ...
-
దత్తాత్రేయ స్వామి చరిత్ర :..... హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరు ల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్తా ...
-
అక్షరాభ్యాసం: పసుపు : 100 g కుంకుమ : 100 g గంధం : 1 box విడిపూలు : ¼ kg పూల మాలలు : 2 మూరలు తమలపాకులు : 20 వక్కలు : 100 g ఖర్జూరములు : 1...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet ...
-
పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 20 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 packet హ...
-
పసుపు :100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 200 gr. అగరుబత్తీలు : 1 pa...
-
మాఘ పురాణం - 1 వ భాగం శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్ని...
-
మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి: పసుపు : 100 gr. కుంకుమ : 100 gr. విడిపూలు : 1 kg పూలమూరలు : 15 పండ్లు : 5 types తమలపాకులు : 300 వక్కలు : 2...
-
శ్రీ లలితా చాలీసా: లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం చ...
-
మాఘ పురాణం - 10 వ భాగం మృగశృంగుని వివాహము దిలీప మహీజునకు వశిష్ఠువారు ఇట్లు చెప్పసాగిరి – పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నే...