Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

శివపురాణం - 3 వ భాగం Sivapuranam - Part 3

శివపురాణం - 15 వ భాగం



విశ్వేశ్వర లింగము – వారణాసి – భాగం – 2

మనం కాశీ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కాలభైరవుని దర్శిస్తాము. కాలభైరవుని అనుగ్రహం ఉంటే తప్ప కాశీ పట్టణంలోకి ప్రవేశించలేము. ఈ కాలభైరవుడు ఎవరు? ఒకానొకప్పుడు బ్రహ్మగారికి అయిదు తలలు ఉండేవి. శంకరుడికి కూడా అయిదు తలలు ఉండేవి. బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. తాను ఈశ్వరుడితో సమానం అని అనుకున్నాడు. శంకరుని ధిక్కరించి మాట్లాడాడు. వెంటనే శంకరుడు సంకల్పం చేసి కాలభైరవుడిని సృష్టించాడు. ఆ కాలభైరవుడు తన బొటనవ్రేలి గోటితో బ్రహ్మగారి అయిదు తలలలో ఒక తలను పువ్వును గిల్లినట్లు గిల్లేశాడు. ఆయన వారణాసి పట్టణమునకంతటికీ కాపలాదారై ఉంటాడు. కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం చాలా ఉత్తమం. కాలభైరవ దర్శనం చేసి విశ్వేశ్వర దర్శనం చేయడం పూర్ణత్వమును ఇస్తుంది. 

కాశీ పట్టణంలో సూర్యశక్తి ఒకచోట కేంద్రీకృతమై ఉన్నది. దీనిని లోలార్కుడు అని పిలుస్తారు. కాశీలో మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశములలో ఇది ఒకటి. 

తులసీఘాట్ దగ్గర స్నానం చేస్తే తులసీఘాట్ ఎదురుగుండా ఉన్నగోడ మీద పెద్ద చక్రం ఒకటి ఉంటుంది. ద్వాదశాదిత్యుల శక్తి ఆ చక్రం మీద ఉంది. ఎప్పుడెప్పుడు కాశీ వెడదామా అని తాపత్రయపడి కాశీ వచ్చి వెలసిన సూర్యశక్తి అక్కడ ఉన్న చక్రం మీద ఉన్నది. కనుక దానిని లోలార్కుడు అని పిలుస్తారు. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ – తులసీ ఘాట్ గోడమీద ఉన్న లోలార్కబింబమునకు, ఆ చక్రమునకు గంగాస్నానం చేసి నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. 

కాశీ పట్టణములు వారాహి కూడా రక్షిస్తుంది. రాజేంద్రప్రసాద్ ఘాట్లో స్నానం చేసి ప్రక్కనే ఉన్న ఇరుకు సందులోంచి వెడితే అక్కడ మీకు వారాహి దేవాలయం కనపడుతుంది. వారాహి సరస్వతీ స్వరూపం. అంతేకాకుండా ఆవిడ అమ్మవారి సర్వ సైన్యాధిపతి. అటువంటి వారాహి చీకటి పడగానే కాశీ పట్టణంలో తిరుగుతుంది. ఇక తెల్లవారుతుందనగా ఇంకా చీకటి ఉండగానే మరల దేవాలయంలోకి వెళ్ళిపోతుంది. కాశీ పట్టణంలో వారాహి మూర్తి చాలా ఎత్తు ఉంటుంది. అక్కడ పూజ చేసే అర్చకులు కూడా తెల్లవారు జామున బిక్కుబిక్కుమంటూ వెళతారు. అసలు అమ్మవారిని పైనుంచి క్రిందకు పూర్ణంగా చూడలేరు. అర్చకులు లోపలి వెళ్ళి తెల్లవారే లోపలే పూజ పూర్తిచేసి నైవేద్యం పెట్టేస్తారు. ఆవిడ పగటిపూట పడుకుంటుంది. అమ్మవారిని చూడడానికి వారాహి దేవాలయం స్లాబ్ మీద కన్నములుంటాయి. కొంచెం దూరంగా నిలబడి కన్నంలోంచి చూస్తే వారాహి కనపడుతుంది. మీరు పూర్ణంగా చూడలేరని, అలా చూడడానికి శక్తి సరిపోదని మిమ్మల్ని దేవాలయంలోకి పంపరు. అందుకని మీరు వారాహిని పైన కన్నంలోంచి చూడవలసి ఉంటుంది. వారాహి కదిలే తల్లి. ఆ వారాహీ దర్శనమును మీరు వారణాసీ పట్టణంలో చెస్తే మీ బుద్ధి ఈశ్వరుడి వైపు తిరుగుతుంది. వారాహి వీర్యసమృద్ధిని ఈయగాలిగిన తల్లి. కేవలం కామ్యముచేత నష్టం అయిపోకుండా ఈశ్వరానుగ్రహం వైపు బుద్ధి శక్తిని ప్రవేశపెట్టగలిగిన తల్లి.

కాశీలోని దర్శనీయ స్థలములలో ఆదికేశవుని ఆలయం. ఎన్నో విష్ణ్వాలయములు ఉన్నాయి. కానీ మొట్టమొదట వచ్చి అక్కడ నివాసం ఏర్పరుచుకున్న విష్ణ్వాలయమునకు ఆదికేశవాలయం అని పేరు. దానిని ప్రతివారు దర్శనం చేయాలి.

తరువాత డుంఠి గణపతిని దర్శించాలి. సాధారణంగా గణపతి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. కానీ ఒక్క కాశీ పట్టణంలో ఉన్న డుంఠి గణపతి తొండం ఎడమవైపు తిరిగి ఉంటుంది. ఎడమ వైపు తొండం తిరిగి ఉన్నవాడు కాబట్టి డుంఠి గణపతి అని పేరు. డుంఠి గణపతి దర్శనం చేస్తే విఘ్నములు తొలగి సర్వమంగళములు కలుగుతాయి.

అక్కడ హరికేశుడు అనే ఒక యక్షుడు ఈశ్వరానుగ్రహం చేత ప్రమథగణములలో చేరి, ప్రమథగణములకు నాయకుడై రెండవ క్షేత్రపాలకుడిగా ఆ స్థితిని పొందాడు. ఆయన చేతిలో వెండి కట్టుతో ఉన్న బెత్తం పట్టుకుని ఉంటాడు. విభూతి పిండికట్టు పెట్టుకుని రుద్రాక్షలను సవరించుకుంటూ ఉంటాడు. పాపాత్ములకు భయంకరంగా కనపడతాడు. ఈశ్వర భక్తులకు ప్రసన్నమూర్తిగా కనపడతాడు. 

కాశీవిశ్వేశ్వర క్షేత్రంలో ఆయన సన్నిధికి దక్షిణంగా ముక్తి మంటపం అని ఒక మంటపం ఉంది. కాశీకి సంబంధించిన చిత్రం ఏమిటంటే విశ్వేశ్వరుడి దర్శనం చేసి అక్కడే ఉన్న గంగలో ఉన్న నీళ్ళు తీసుకు వెళ్లి, ఆయన తలమీద పోసేస్తే చాలు. ఆయనకు ప్రత్యేకంగా తీసుకువెళ్ళనవసరం లేదు. మనం అక్కడి ముక్తి మంటపంలో కూర్చుని ఏదో ఒక శివకథ చెప్పుకుని వారణాసి విడిచిపెట్టాలి అని నియమం. వారణాసి ఊరికే వెళ్లి వచ్చేయడం కాదు. వీలయితే మణికర్ణికా ఘట్టంలో స్నానం చెయ్యాలి. 

వారణాసి గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా రెండింటిని గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది. కాశీలో మనం విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేస్తాము. ఆ విశాలాక్షి దర్శనం చెయ్యకపోతే కృతఘ్నులం అయిపోతాము. 

అక్కడే మహానుభావుడు శ్రీచక్రేశ్వరుడు ఉన్నాడు. కాశీవిశ్వేశ్వరుడి దేవాలయంలోంచి బయటకు వస్తే ఎడమ ప్రక్కన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలోకి లోపలికి వెళితే కుడిచేతి పక్క ఒక లోతు ప్రదేశంలో శివలింగం మీద శ్రీచక్రం వేసి ఉంటుంది. ఆ శ్రీచక్రంతో కూడిన శివలింగమును తన చేత లలితా సహస్ర స్తోత్రమునకు భాష్యం అమ్మవారు వ్రాయించిందని కృతజ్ఞతతో భాస్కరాచార్యులవారు ప్రతిష్ఠ చేశారు. దానియందు అయ్య, అమ్మ కలిసి ఉన్నారు. ఆ శివలింగం దగ్గరకు వెళ్లి నమస్కరిస్తే ఆ తల్లి ఎంతగానో పొంగిపోతుంది. 

కాశ్యాంతు మరణాన్ ముక్తిః’ – కాశీలో చచ్చిపోతే చాలు మోక్షం వస్తుంది. ఆయుర్దాయం అయిపోయి ఇంకా ఊపిరి అందక ఆయాసంతో కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి అయోమయావస్థలోకి వెళ్ళిపోతున్న స్థితిలో వెళ్ళిపోతున్న వాడు బెంగ పెట్టుకోకుండా ఉండడానికి ఒక చిత్రం జరుగుతుంది. పార్వతీదేవి అటువంటి వాని దగ్గరికి వచ్చి కూర్చుని తన పమిటతో ఆ వెళ్ళిపోతున్న వాడికి వీస్తుంది. వాడు సేదతీరి ఏ బాధలేని స్థితిని పొందుతాడు. అప్పుడు డుంఠి గణపతి వచ్చి పక్కన కూర్చుని ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర తడిపెడుతూ తన తొండంతో కాసేపు అలా గాలి విసురుతాడు. అపుడు ఆ ప్రాణి ఎంతగానో సేదతీరుతాడు. భ్రుంగి వచ్చి లలాటమునందు పెడతాడు. మంచి సువాసనలతో మారేడు వాసనలతో స్వామివారు వచ్చి నవ్వుతూ చూస్తారు. అలా వెళ్ళిపోతున్న సమస్త పిపీలికాది పర్యంతమునకు స్వామి కుడిచెవిలో ప్రణవమును ఉపదేశం చేస్తాడు. ఇలా కాశీలో సమస్త ప్రాణులు ఆయన యందే చేరిపోతున్నాయి. మన పాపధ్వంసము చేయకలిగిన కాశీ కొన్ని కోట్ల జన్మల పాపములను నశింపజేయగలిగిన కాశీ మన భరతఖండంలో ఉంది. అది ఎన్నో ప్రాణులు ఈశ్వరునిలో కలిసిపోతున్న దివ్యక్షేత్రం. సర్వ జగత్తు లయం అయిపోతున్నా తాను మాత్రం నిత్యంగా ఉండిపోయే పరమపావనమయిన భూమి. సానందమానందవనే వసంత మానందకందం హృతపాపబృందం 
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే.



శివపురాణం - 16 వ భాగం



వైద్యనాథ లింగము 

పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదావసంతం గిరిజా సమేతం!
సురాసురాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి!!

‘ఓ వైద్యనాథుడా, నీకు మేము నమస్కరించుచున్నాము’ అంటారు. మనవాళ్ళు ఏది చేసినా దాని చిట్టచివరి ప్రయోజనం పరబ్రహ్మమును చేరటమే. అభిషేకంలో శివునికి ఒక నామం ఉంది. ‘ప్రథమో దైవ్యో భిషక్’. ఈశ్వరుడు ఈ లోకమునకు మొట్టమొదటి వైద్యుడు. వైద్యుడు సాధారణంగా నాది నాది అని చెప్పిన ఈ శరీరంలో మీకే తెలియకుండా ప్రవేశించిన రుగ్మతను తొలగిస్తాడు. మనకి భవరోగము అని ఒక రోగం ఉంటుంది. అంటే ఎప్పుడూ సంసారంలో పడి కొట్టుకుంటూ ఉండడం. ఈ భవ రోగమునకు ప్రధాన కారణం అహంకారం. ఇటువంటి భవరోగములో పది కొట్టుకునే వాడిని పైకెత్తి తన పాదముల దగ్గరకి చేర్చుకుంటాడు. కాబట్టి కూడా ఆయన వైద్యనాథుడు. వైద్యులకు నాథుడయినవాడు లేదా వైద్యులయందు పెద్ద వైద్యుడు – రెండు కారణముల చేత ఆయనను వైద్యనాథ లింగము అని పిలుస్తారు. 

ఒకానొక సమయంలో లంకా పట్టణమును రావణాసురుడు పరిపాలిస్తూ ఉండేవాడు. లంకా పట్టణం ఎప్పుడూ దక్షిణ దిక్కునే ఉంటుంది. ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది. జీవన యాత్రలో చిట్టచివరి ప్రయాణం అక్కడకు వెళ్ళడంతో పూర్తయిపోతుంది. రావణాసురుడు అజ్ఞాని కాదు. వేదమును చదువుకున్న వాడు, త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు, లింగార్చన చేసేవాడు, ఘన జట చెప్పేవాడు. కానీ ఈ చదువు ఒక స్థాయి యందు నిజమయిన చదువు కాదు. అంత గొప్పవాడయిన రావణుడు ఒకసారి కైలాసమునకు వెళ్ళాడు. శరీరము నేను అనే అహంకారంతో ఉన్నవాడికి కైలాసాచలాధీశుని దర్శనం దొరకడం కష్టం. కానీ రావణుడు ఈశ్వరుని పట్టుకోవడానికి చాలా బింకంతో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. అనగా రజోగుణ ప్రకృతితో కూడిన తపస్సు మొదలుపెట్టాడు. ఇటువంటి పట్టుదలతో కూడిన తపస్సు చాలా అనర్థహేతువుగా, మనిషిని పాడు చేసేదిగా ఉంటుంది. ఈ తపస్సు సాత్త్వికంగా ఉండదు. అది ఈశ్వరుడిని కదపలేక పోయింది. పరమేశ్వరుడు రాలేదు. రావణుడు చేసే తపస్సులో దోషం ఉంది. ఈశ్వరుడి మీద అలక వహించాడు రావణుడు. అందుకని తొమ్మిది తలలు కోసేసుకున్నాడు. వాటిని అగ్నిహోత్రమునందు వ్రేల్చాడు. రావణుడు చేసే తపస్సు యందు వినయము లేదు. రావణుడు తన పదవ తలను కూడా నరుక్కుందుకు సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆసమయంలో శంకరుడు వచ్చాడు. ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడే సరికి రావణుని పది తలలు మరల మొలిచాయి. అపుడు శంకరుడు రావణునితో “రావణా, నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. రావణుడు అపుడు తనకు విపరీతమయిన బలం కావాలి అన్నాడు. రెండవ కోరికగా శంకరుడిని వచ్చి లంకలో కూర్చోమన్నాడు. అపుడు శివుడు ‘నేను లింగమునందు ఉంటాను. నీవు దీనిని తెలివితో నీ పట్టణమునకు తీసుకువెళ్ళు’ అన్నాడు. రావణుడి ఒంటికి బలం ఉందికాని మనస్సుకి తెలివిలేదు. ఉత్తర క్షణం రావణుడి ఒంటికి బలం వచ్చింది. కానీ అతని ప్రవృత్తిలో మార్పు రాలేదు. 

రావణుడు ఆ శివలింగమును పట్టుకుని లంకకు బయలుదేరాడు. పరమాత్మ వానికి పాఠం చెప్పాలని అనుకున్నాడు. పిండాండ బ్రహ్మాండ అనుసంధానం అని ఒకటి ఉంది. ఈ శరీరమునకు ఆకలి వేస్తుంది. బ్రహ్మాండంలో లభించే ఏదో ఒక ఆహారపదార్ధం తీసుకు వెళ్లి ఈ పిండాండంలో పడెయ్యాలి. మళ్ళీ పిండాండంలో మిగిలిపోయిన శేషమును బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. పిండాండమునకు దాహం వేస్తే బ్రహ్మాండమే ఇవ్వాలి. దాహార్తిని తీర్చడమే కాకుండా ఇందులో ఈశ్వర ప్రక్రియ ఒకటి ఉంది. ఇందులోని మలినములను పట్టుకుని ఆ నీళ్ళు బయటికి రావాలి. నీళ్ళను మరల బ్రహ్మాండంలో విడిచిపెట్టాలి. ఇది ఈశ్వరుడు. దాహం వేయించిన వాడు ఈశ్వరుడు, నీటిని ఇచ్చిన వాడు ఈశ్వరుడు, ఈ నీటిని మరల మూత్రముగా మార్చిన వాడు ఈశ్వరుడు, బయటకు పంపిన వాడు ఈశ్వరుడు. అందువల్ల ఈశ్వరానుగ్రహం లుప్తం అయితే అవతలి వాడు పాడైపోవడానికి ఒక్క కారణం చాలు. మూత్ర విసర్జన చేయవలసిన అవసరం రావణాసురుణ్ణి పాడు చేసేసింది. శివలింగాన్ని చేతితో పట్టుకుని మూత్ర విసర్జన చేయలేడు కదా! ఎవడో ఒకటు శివలింగమును పట్టుకుంటే బాగుండుని అని అనుకుని అటూ ఇటూ చూశాడు. ఆ శివలింగం శివుడన్న భావన రావణునికి లేదు. తేలికగా చూశాడు. అక్కడి సమీపంలో గల పశువులు కాసుకునే ఒక గొల్ల పిల్లవాడిని పిలిచి నేను మూత్ర విసర్జనకు వెళ్ళి వస్తాను ఈ శివలింగమును ఒకసారి పట్టుకుని ఉండవలసినది అని అడిగాడు. పిల్లాడి చేతిలో శివలింగమును పెట్టి మూత్ర విసర్జనకు వెళ్ళాడు. అది శివుడు. రావణాసురుడికి ఎలా బుద్ధి చెప్పాలా అని చూస్తోంది. ఆ శివలింగం చాలా బరువయిపోయింది. వాడు మోయలేక కింద పెట్టేశాడు. శివుడు రావణునితో ఇది నీ పురి చేర్చు. మధ్యలో దీనిని ఎక్కడయినా క్రింద పెట్టావో అక్కడ ఉండిపోతాను’ అని ముందరే చెప్పాడు. ఇప్పుడు ఆ గొల్ల పిల్లవాడు శివలింగమును చితాభూమి మీద పెట్టేశాడు. దీనిని చూసి రావణుడు పరుగుపరుగున వచ్చాడు. అతను వెంటనే ‘ఈశ్వరా, తీసుకు వెళ్ళమన్నావు, కానీ ఆ తెలివి నాయందు నిలబడక పోవడానికి కారణం కూడా నీవే. కాబట్టి ఇప్పుడ నా బుద్ధి మార్చవలసింది అని ప్రార్థన చేయలేదు. ఇదెంత దీనిని నేను ఎత్తుకు పోతాను అని కదపడానికి ప్రయత్నించాడు. అది కదలలేదు. ఆ శివలింగమును అక్కడే వదిలేసి లంకకు వెళ్ళిపోయాడు. వానికి ఒంట్లో బలం బాగా ఉంది. 

దేవతలందరూ వచ్చి రావణుడు అక్కడ వదిలి వెళ్ళిన ఆ శివలింగమునకు పూజలు చేయడం ప్రారంభించారు. రావణుడి బలం వలన చాలా ప్రమాదం రాగలదని దేవతలు భావించి దేవతలు నారదుని వద్దకు వెళ్లి రావణుడు సంపాదించిన బలం వానినే పాడుచేసేటట్లుగా చేయవలసినది అని కోరారు. నారదుడు వెళ్ళి ‘రావణా, నీవు కైలాసమునకు వెళ్ళి గొప్ప తపస్సు చేసి శంకరుడిని ప్రత్యక్షం చేసుకున్నావని ఎవరో చెప్పగా తెలిసింది. ఏమి చేశావో చెప్పవలసినది’ అని అడిగాడు. రావణుడు జరిగిన విషయం చెప్పాడు. అపుడు నారదుడు నీకు శివలింగమును ఇచ్చినట్లే ఇచ్చి దానిని నీకు కాకుండా చేసినవాడు కూడా శివుడే అయి ఉండవచ్చు కదా. దీనిని నిర్ధారించుకుందుకు నీవు ఒకసారి కైలాసమునకు వెళ్ళి నీ బలంతో కైలాసాన్ని కదిపి చూడు అప్పుడు నీకు యథార్థం తెలుస్తుంది. శంకరుడే కదిలిపోతే నీకు బలం బాగా ఉన్నట్లు. అప్పుడు ఇతరులమీదికి వెళ్ళు’ అన్నాడు. వెంటనే రావణుడికి అనుమానం వచ్చింది. ఇదేదో బాగుంది అని వెంటనే పుష్పకవిమానం ఎక్కి కైలాసపర్వతం దగ్గరకు వెళ్ళి కైలాస పర్వతమును కదపడం మొదలుపెట్టాడు. అలా కదిపేసరికి పార్వతీ పరమేశ్వరుల సింహాసనం కదులుతోంది. శంకరునికి కొంచెం కోపం వస్తే తప్ప దేవతల కార్యం నెరవేరదు. ఆయన మౌనంగా ఉంటాడేమోనని ఆ తల్లి కొంచెం చమత్కారంగా ‘మాట్లాడింది. అమ్మవారు శక్తి స్వరూపిణి. లోకమునకు అనారోగ్యం వస్తే బతికిస్తుంది. ఇప్పుడు లోకమును బతికించాలి. లోక కంటకుడిని చంపాలి. వాడు చావడానికి కారణం శివ ముఖతః రావాలి. అలా వచ్చేటట్లు ఆవిడ శివుణ్ణి మాట్లాడింది. ఆవిడ శివుణ్ణి రుద్రుడిని చేస్తుంది. రుద్రుడిని శివుడు చేస్తుంది. ఇప్పుడు లోకక్షేమం కోసం శివున్ని రుద్రుని చేస్తోంది.

అబ్బా మీరు ఎంత గొప్ప శిష్యుడిని సంపాదించుకున్నా రండీ! మీరు వరాలు ఇచ్చిన రావణుడే వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడు. ఎవరికైతే మీరు వరాలు ఇచ్చారో వాడికి ఇప్పుడు మీమీదకోపం వచ్చింది. వాడి బలానికి ఇప్పుడు మీరు నేనూ ఊగిపోతున్నాము. పాపం మీరుమాత్రం ఏం చేస్తారు లెండి?” అంది. ఆమె మాటలు వినేసరికి శివుడు రుద్రుడయ్యాడు. ఎవరు రావణుడికి బలం ఇచ్చారో ఆయనే శాపమును ఇచ్చాడు. ‘రావణా, ఇక కొద్దికాలంలో నీ మదం అణగిపోతుంది, ఇక్కడనుండి పో’ అన్నాడు. కైలాస పర్వతమును ఊపుతున్న రావణునికి ఈమాట వినపడింది. ఈశ్వరుని మాట నిజం అయింది. రావణుని పట్టుకున్న వాళ్ళందరూ నశించిపోయారు. రాముని ఆశ్రయించిన వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఈ శివ వాక్యమును ఆధారం చేసుకునే తరువాత రావణునికి శాపములన్నీ వచ్చేశాయి. చివరకు రావణుని బలం తన వాళ్ళందరినీ చంపుకోవడానికి పనికొచ్చింది. రాముడు ఒక్కొక్క తల చొప్పున పది తలలు పడగొట్టేస్తుంటే ఆఖరున మండోదరి వచ్చి శివుడు ఏది చెప్పాడో అదే చెప్పింది. నీ ఒంటి పొగరు నిన్ను చంపింది. రాముడు నిన్ను చంపలేదు. ఏ మదం నీలో ప్రవేశించిందో అది నిన్ను చంపేసింది అని ఆవిడ చెప్పింది. 

ఇది ఆనాడు చితాభూమియందు వెలసిన వైద్యనాథుడన్న జ్యోతిర్లింగం ఏది ఉన్నదో ఆ జ్యోతిర్లింగం. ఆనాటి నుండి ఈనాటి వరకు వెళ్ళి దర్శించి నమస్కరించిన వాళ్ళందరికీ ఒక అనుగ్రహమును ఇస్తోంది. ఇదే వైద్యనాథుడంటే! భవము – అంటే సంసారమునండు కొట్టుమిట్టాడుతూ, కామక్రోధముల యందు తెరిపి లేకుండా తిరుగుతూ అహంకార మమకారములలో పడి సొక్కిపోకుండా సాత్త్వికోపాసనతో కూడిన ఈశ్వర భక్తిని క్రుపచేసి భవసాగరమునుండి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఇలా ఉద్ధరిస్తే ఒకడికి ఈశ్వరుడిని చేరడానికి కోటి జన్మలు పట్టవచ్చు. ఒక్క జన్మలో, ఒక్క గంటలో ఈశ్వరుని చేరిపోయిన మహాభక్తులు ఉన్నారు. కాబట్టి ఆ వైద్యనాథుని అలా దర్శించిన వారికి అటువంటి మహానుభావుడికి నమస్కరించిన వాడికి ఆయన అనుగ్రహం కలిగితే అతి తక్కువ కాలంలో ఉపాసన దిద్దబడుతుంది. అతి తక్కువ కాలంలో సత్త్వగుణం ఆవిర్భవిస్తుంది. ఆయన అనుగ్రహం లేకుండా ఆయనను రాజస తామసిక పూజలతో లొంగదీసుకోవాలన్న భావన మంచిది కాదు.



శివపురాణం - 17 వ భాగం



రామేశ్వర లింగము 

రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము. మహాబలసంపన్నుడయిన రావణాసురుని సంహారం అంత తేలికయినది కాదు. దీనికి పరమ మంగళప్రదుడయిన శంకరుని అనుగ్రహం కావాలి. ‘ఈశ్వరా’ లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే పది తలలతో నాకంటపడినా ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నాయందు ప్రచోదనమయి యుద్ధం జరుగుగాక’ అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభు లింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట. అనగా రామచంద్ర మూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు. 

స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సలా 
పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం!!

ఈశ్వరా, నేను నీ భక్తుడిని, దీనుడిని. ఎప్పుడయినా నానుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. మీరు శివుడు, మంగళప్రదులు. నన్ను ఆశీర్వదించాలి. జయమును ఇవ్వాలి. కాబట్టి శంకరా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అనేసరికి శంకరుడు ప్రత్యక్షం అయి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగము అనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది. అన్నాడు. శివుడే ఇప్పుడు శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ – లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ‘నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు. ఇప్పుడాయన రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పకవిమానంలో రామచంద్ర మూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందికి చూపించారు. ‘సీతా, ఇదిగో సేతువు. అదిగో అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు’ అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలోని శ్లోకములలో ఈపాదం ఉంది. ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు. 

ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు. సముద్రం దాటేముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము. కానీ ఈవేళ రామేశ్వరం దీవియందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం. రెండూ ఒకటేనా? అలా అయితే స్థలపురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్ర మూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీ పట్టణం పంపించి విశ్వనాథ లింగము నొకదానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగముతయారుచేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రీ బావి, గాయత్రీ బావి మున్నగు బావులు ఉన్నాయి. ఈ రెండు శివలింగములు ఒకటేనా? ఈవిషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు ‘రామాయణమునందు ధర్మ సూక్ష్మములు’ అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒకమాట చెప్పారు. కూర్మపురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ 
‘యావస్సేతుశ్చతావశ్చ కాస్యాంయత్రతిరోహితః’ ‘నేను తిరోహితుడనై ఉంటాను. అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని మీరు ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెడితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగుచేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాందపురాణంలో నాగర ఖండమునందు ఈ శివలింగం ప్రతిష్ఠితం చేయబడడం యథార్థమే అని చెప్పి ఉన్నాడు. కాబట్టి అది రామేశ్వర లింగమే. హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవాలి అని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహుర్తమై హనుమ ప్రతిష్ఠించాలీ. అందుకని ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగుచేస్తే అది శివలింగం అయింది. ఇపుడు దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశాడు. దానిని రామనాథ లింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకు వచ్చిన లింగము. అది కాశీనుండి తేబడింది కాబాట్టి దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు. ఆ బావులలో ఉండే నీటియందు ఓషధీశక్తులు ఉంటాయి. ఆ బావుల నీటితో స్నానం చేయాలి. 

రామేశ్వరంలో మనం సముద్రస్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమయిన దర్శనం. అక్కడ రైల్వేస్టేషన్లో ఒక గొప్పతనం ఉంది. కొత్త ప్లాట్ ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరోచోట పెట్టకుండా రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావిచెట్టు క్రింద పెట్టారు. మీరు రైల్వేస్టేషనులోనే దక్షినామూర్తిని దర్శనం చేసుకోవచ్చు. 

అక్కడే శంకరాచార్యుల వారు తీసుకు వచ్చిన శివలింగములలో ఒక శివలింగం ఉంది. అది స్ఫటికలింగం. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చెయ్యాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉంది. కానీ అక్కడ విన్యాసములేవీ కనపడవు. దాని వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగమునకు అర్చకులు పూజచేస్తారు. అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటిక లింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మరల మీకు తెల్లటి లింగం కనపడుతుంది. అదీ స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం. అనగా నిర్గుణమయిన పరబ్రహ్మము శుద్ధసత్వంతో ఉంటాడు. ఆయనయందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది.

ఎవరయినా ఈ రామేశ్వర లింగం దగ్గరకు వెళ్లి కాశీ పట్టణంలో ఉన్న గంగను తీసుకు వెళ్ళి ఆ రామేశ్వర లింగమును గంగధారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసినవాడు కైలాసమును చేరుకుంటున్నాడు. గంగ అనగా జ్ఞానము. కాశీ గంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒక్కటే పదార్ధం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనం. అది చేసిన వాడు సంసార సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతున్నాడు. కాబట్టి అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమయిన క్షేత్రము రామేశ్వర క్షేత్రము. 

ఇక్కడ ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్లకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది. కానీ రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు. కాబట్టి రామేశ్వరం వెడదాం అనుకున్నాను అని అనకూడదు. ‘ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నాను’ అని అనాలి. ఆ బాధ్యతను ఆయన మీద పెట్టెయ్యాలి. అపుడు ఆయనే మిమ్మల్ని రామేశ్వరం తీసుకువెడతాడు.



శివపురాణం - 18 వ భాగం



నాగేశ్వర జ్యోతిర్లింగము 

యామ్యే సదంగే నగరేతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై 
సద్భక్తి ముక్తిప్రదమీశమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే!!

సద్భక్తిని, ముక్తిని రెండింటిని ఈయగాలిగిన నాగనాథునికి నమస్కరించుచున్నాను. ఇక్కడ నాగ నాథుడు అంటే విశేషమయిన పూజనీయుడు అని అర్థం. అటువంటి నాగనాథునికి నేను శరణాగతి చేయుచున్నాను. ఈ నాగనాథ లింగము ఎందులకు వచ్చింది? దీని ఆవిర్భావమునకు వెనకాతల ఉండే కారణం ఏమిటి? ఇక్కడ మనం ఒక విషయమును పరిశీలనం చేయాలి. శివారాధన రాక్షసులు చేస్తారు, ప్రమథగణములు చేస్తారు, మహాభక్తులు చేస్తారు, భూతప్రేతాది గణములు చేస్తాయి. శివారాధనమును జ్ఞానమును ఐశ్వర్యమును అపేక్షించేటటువంటి వారు చేస్తారు. ఆపద పోవాలనుకుంటున్న వాళ్ళు శివాభిషేకం చేస్తారు. 

దారుకుడు, దారుకి వీరిద్దరూ రాక్షస దంపతులు. వారికి బోలెడంత సంతానం ఉంది. వాళ్ళు ఒకనాడు ఒక సముద్రతీరమునకు చేరారు. వీరు చాలామందిని హింసించారు. ఒకానొకప్పుడు అందరి ప్రజలని బాధపెడుతూ భగవద్భక్తుల జోలికి కూడా వెళ్ళారు. అపుడు ఆ భక్తులు ఔర్వుడు అనే మహర్షి పాదములు పట్టుకుని ఆయనను శరణాగతి చేశారు. ఔర్వుడు గొప్ప తపశ్శక్తి కలవాడు. ‘వాళ్ళు వాళ్ళ ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితం గడిపినట్లయితే ఫరవాలేదు. వాళ్ళ వాళ్ళ ప్రవృత్తిని మార్చుకోలేము అనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడా ఉండకూడదు. భూమండలం మీద ఎక్కడయినా రాక్షస ప్రవృత్తి కలిగినవాడు ఉన్నట్లయితే వారు ఉత్తరక్షణం మరణిస్తాడు. ఇదే నా శాపం’ అని ఔర్వుడు అభయం ఇచ్చాడు. తపశ్శక్తి కలిగిన వాడి వాక్కు బ్రహ్మాస్త్రం అయి కూర్చుంటుంది. ఈవార్త రాక్షసులకు తెలిసింది వాళ్లకి తాము బ్రతకడం ఎలా అనే బెంగపట్టుకుంది. అపుడు దారుకి ‘నేను పార్వతీదేవి గురించి ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాడు. అపుడు శాంభవి నాకు ప్రక్షమయి ఒక గొప్ప వరం ఇచ్చింది. దాని వలన నేను నా వారిని ఎక్కడయినా పెట్టి బ్రతికించగలను. ఔర్వుడు మనలను భూమి మీద కదా ఉండవద్దని శాపం ఇచ్చాడు. అందుకని మనందరం సముద్రం మీద ఉందాము. ఆవిడ ఇచ్చిన తపశ్శక్తితో మిమ్మల్నందరిని నేను రక్షిస్తాను. పదండి’ అంది. దారుకి సూచనను అనుసరించి రాక్షసులందరూ సముద్రం మీద పడ్డారు. ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం మీద ఓడలలో ప్రయాణించే వారిని పట్టుకుని వారిని చెరపట్టి హింసించి బాధిస్తూ ఆనందిస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. 

అక్కడ సముద్రం మీద ఓడలో వెళుతున్న వారిలో సుప్రియుడు అనబడే ఒక వైశ్యుడు ఉన్నాడు. భక్తికి కులంతో సంబంధం లేదు. రాక్షస దంపతులు సుప్రియుడిని పట్టుకున్నారు. సుప్రియుడికి దాసదాసీజనం ఉన్నారు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన ఒక్కడినీ తీసుకు వెళ్లి కారాగారంలో పెట్టారు. అపుడు ఆయన ఇవన్నీ ఉండడం, పోవడం ఈశ్వరేచ్ఛ. నాకు ఈశ్వరుడు చాలు అన్నాడు. ఆయన కారాగారంలో ఉన్న ధూళినంతా పోగేస్తే ఒక చిన్న శివలింగం అయింది. దానిమీద చుక్క నీరు పోసి పార్థివలింగం చేశాడు. ఆరాధన చేయడం ప్రారంభించాడు. అపురూ రాక్షసులు ఆరాధనకు అడ్డుపడ్డారు. నువ్వు శివారాధన చేయకూడదు, శివ అనే నామం చెప్పినా, శివున్ని ఆరాధన చేసినా, ధ్యానంలో కూర్చున్నా, భగవంతుని స్మరిస్తున్నావన్న అనుమానం ఏమాత్రం నాకు కలిగినా నీ శిరస్సు త్రుంచేస్తాను అన్నారు. అంటే ఆయన అన్నాడు – ‘నేను ఒక్కనాటికి శివారాధన మానను. నన్ను రక్షించేవాడు శంకరుడు. నా తల త్రుంచడానికి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాని చేతిలో నీ తల త్రుంచబడుతుంది. త్రుంచకలిగిన వాడు నా తండ్రి అని నాకు నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన పాదములు పట్టుకున్నాను అన్నాడు. అపుడు వెంటనే రాక్షసుడు కత్తినొకదానిని తీసుకుని అపారమయిన ఉగ్రరూపంతో సుప్రియుడి కంఠమును నరికేయ్యబోయాడు. ఆ సమయమునకు సుప్రియుడు ఈశ్వరుని పరమ భక్తితో శరణాగతి చేస్తున్నాడు. రెండు చేతులతో పరమేశ్వరునికి నమస్కారం చేశాడు. అలా చేసేసరికి ఈయన ఆరాధన చేస్తున్న పార్థివలింగంలోంచి ఒక్కసారి పరమశివుడు ఆవిర్భవించాడు. రుద్రరూపంతో ఆవిర్భవించడం త్రిశూలం పెట్టి దారుకుడిని దెబ్బకొట్టడం వాడు పారిపోవడం ఆయన ఉగ్రమయిన దృష్టికి కొన్ని వందలమంది రాక్షసులు బూడిద కుప్పలై పడిపోవడం ఏకకాలమునందు జరిగిపోయాయి. చిత్రమేమిటంటే ఆ వచ్చిన పరమశివుని అర్థభాగమందు పార్వతీదేవి ఉంది. ఆవిడ గబుక్కున శివుని చేయి పట్టుకుని తనవారిని తాను రక్షించుకునే శక్తి ఇమ్మని దారుకి అడిగింది. ఆమెకు అటువంటి శక్తి కలిగేలా నేను ఆమెకు వరం ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇలా కాల్చేస్తే నా వరం ఎమవ్వాలి? ఆవిడ నాకు భక్తురాలు. మీరు నామీద ప్రేమతో ఆమెయందు అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి’ అంది.

వెంటనే శివుడు శంకరుడు అయిపోయాడు. ఒక నవ్వు నవ్వి ‘పార్వతీ నిజమే. ఆవిడకి నీవు వరం ఇచ్చావు. కానీ వాళ్ళు రాక్షసులు. నేను ఇప్పుడు వీళ్ళని విడిచిపెడితే వీళ్ళు మరల దుర్మార్గపు పనులు చేయడం మొదలుపెడతారు. కాబట్టి వీళ్ళు మరల ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసే నిమిత్తం నేను ఇక్కడే జ్యోతిర్లింగరూపంలో కూర్చుంటాను. నీవు కూడా నీవలన బతుకున్నామని వాళ్లకి గుర్తు ఉండడానికి అమ్మవారి రూపంలో ఇక్కడే కూర్చో. నేను నాగనాథుడు అనే పేరుతో వేలుస్తున్నాను. ఈశ్వరీ, నువ్వు నాగేశ్వరీ అనే పేరుతో వెలవవలసింది’ అన్నాడు. ఆవిధంగా ఇద్దరూ ఆ తటమునందు జ్యోతిర్లిన్గమై వెలిశారు. ఎవరయినా వారి దర్శనం చేస్తే వారికి జన్మ జన్మలయందు పార్వతీ పరమేశ్వరుల పాదపద్మముల యందు చెక్కుచెదరని భక్తి ప్రపత్తులు కలిగేలా అనుగ్రహిస్తాను అని స్వామి శపథం చేసి చెప్పి నాగనాథుడిగా ఆ తీరమునందు వెలసి ఉన్నాడు. కాబట్టి మనం నాగ నాథ క్షేత్రమునకు తప్పకుండా వెళ్ళాలి. మనస్సును నిగ్రహించి ఈశ్వరుని వైపు పెట్టడం అలవాటు అవడం అనే భక్తి ముహూర్తములవలన రాదు. భక్తిగా ఉండడం ఈశ్వరానుగ్రహం. భక్తి అంటే ఏమిటో సరిగ్గా తెలియడం ఈశ్వరానుగ్రహం. సరిగ్గా తెలిసన భక్తియందు మనస్సు నిలబడడం ఈశ్వరానుగ్రహం. అటువంటి అనుగ్రహమును తన దర్శనమాత్రం చేత ఇచ్చేస్తానన్నాడు నాగనాథుడు. 

పూర్వం పెద్దలు మనలను తీర్థయాత్రలు చేయమని ప్రోత్సహించేవారు. తీర్థయాత్ర చేసేముందు వెడుతున్న ఆ క్షేత్రం వైశిష్ట్యం తెలియాలి. తీర్థయాత్రలు చేసినప్పుడు ఆయా క్షేత్రములకు వెళ్లినపుడు వాటిని గురించి తెలుసుకుని ఆయా క్షేత్రములలో ఏ శ్లోకమును చెప్పాలో ఆ శ్లోకమును చెప్పి ఏది మీరు భగవంతుని అడగాలో దానిని అక్కడ అడగాలి. అంతేగానీ వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చాము అనుకోవడం వలన ఉపయోగం లేదు. క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు దానికి తగిన పనిని మీరు చేసి వస్తుండాలి. ఒకవేళ అలా చేయడం తెలియకపోయినా మన అమాయకత్వం చేత ఈశ్వరుడు దానిని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. ఈశ్వరశక్తియందు అదికూడా ఉంటుంది.



శివపురాణం - 19 వ భాగం



ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగము

ఇళాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్!
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే!!

ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణం చెప్పబడింది. ఇంక ఆయన ఔదర్యమును ఇంత అంత అని మీరు లెక్కకట్టి చెప్పడం కుదరదు. స్వామి అంతటి ఔదార్యం ఉన్నవాడు. ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనబడే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు త్రికాల సంధ్యావందనం అలవాటయిన వాడు. నిరంతరం శివ పార్థివేశార్చనకు అలవాటు పడిన మనస్సు ఉన్నవాడు. భగవంతునియందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కాని, తనకిదిలేదని కాని, ఎన్నడు భావన చేయనివాడు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు. ఆయన భార్యపేరు సుదేహ. ఆమె మహా సౌశీల్యవతి. భర్తను ధర్మమునందు నిరంతరమూ అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలాకాలం ఇలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె బాధపడింది. అపుడు ఆయన భార్యతో “ఏమిటే నీ వెర్రి! ఎవరు ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డలకోసం ఎందుకు నీకీ అలజడి? నువ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు తరిస్తావు. నీతోపాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు, సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనస్సు పెట్టు’ అని చెప్పాడు. ఈ మాటలు విన్న తరువాత ఆవిడ తన మనస్సును సర్దుకుంది. ఈవిడ ఒకసారి పొరుగింటికి వెళ్ళింది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఎదో వాదులాట వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచిమాట చెప్పింది. ఆ పక్కావిడ చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఈమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. భర్త దగ్గరకు వెళ్లి చెప్పింది. అపుడు ఆయన ‘నేను ఎంత చెప్పినా నీవు బిడ్డలను గురించే ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుని వైపు మరల్చుకోలేక పోతున్నావు. బిడ్డలు కలుగక పోవడానికి దోషము నీదో, నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయమును ఈశ్వరుదినే అడుగుతాను’ అని చెప్పాడు. తరువాత ఆవిడకి చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు.

రెండు పూలదండలు తెచ్చి భగవంతుని పాదముల దగ్గర పెట్టాడు. రెండు పువ్వులు పెట్టి ఆయన శివునికి ఒక విజ్ఞాపన చేశాడు. ‘ఒకవేళ నాయందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. మాకు అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది’ అని ఈశ్వరా నీ సంకల్పమును మాకు చెప్పెయ్యాలి’ అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండలలో ఒకదానిని ముట్టుకో అన్నాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి రెండవదండను తీసింది. అపుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలుగదు అని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని ఈశ్వరుని యందు మనస్సు పెట్టుకొనవలసిందని చెప్పాడు. అపుడు ఆవిడ అలా వీల్లేదని ‘నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు. కానే అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమెవలన మీకు సంతానం కలుగుతారు కదా! వాళ్ళు నన్ను అమా అని పిలిస్తే చాలు. అని చెప్పింది. అపుడు ఆయన ‘ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీయందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను’ అన్నాడు. అపుడు ఆవిడ చచ్చిపోతానుఅన్నంత హఠం చేసింది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ఘృష్ణ. సంతోషంగా కాలం గడుస్తోంది. ఘృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకి చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసలుతున్నాడు. ఆవిడ ప్రతిరోజూ నూట ఒక్క పార్థివ లింగాములకు అర్చన చేసేది. పూజ అయిన తర్వాత నూటొక్క లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఇలా మూడు సంవత్సరములు ఆరాధన చేసింది. ఆవిడ చేసిన శివపూజ వలన ఆయనకు నానా అనిపించుకోగల అదృష్టం కలిగింది. మూడు సంవత్సరములలో ఆవిడ దాదాపు లక్ష శివలింగములకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భమును ధరించింది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ మూడు సంవత్సరముల తర్వాత గర్భం ధరించి పండులాంటి మగపిల్లవాడిని కనింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు. 

ఆ పిల్లవాడికి యుక్తవయస్సు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళయితే సుదేహను గౌరవంగా చూశారు కానీ వియ్యాలవారు మాత్రం పిల్లవాని సొంతతల్లి ఎవరయితే ఉన్నదో ఆవిడకు పెద్దపీట వేశారు. దానితో కక్ష సుదేహలో కలిగింది. అసూయ ప్రబలడానికి ఇది హేతువు అయింది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లు అంత ఆదరణ పొందడానికి కారణమని తలచి ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్న తన చెల్లెలు కళ్ళవెంట నీటిధారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది. 

ఒకరోజు కొడుకు కోడలు శయనించి ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాని గదిలోకి వెళ్లి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరమును ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకు వెళ్లి తన చెల్లెలు రోజూ శివలింగములను కలిపే చోటులో నీటిలో పారవేసింది. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుళ్ళో ధ్యానం చేసుకుందుకు నదీ తీరమునకు వెళ్ళిపోయాడు. ఈవిడ నూటొక్క లింగములకు అర్చన చేస్తోంది. పిల్ల నిద్రలేచి చూసింది. తన వంటి మీద పక్కబట్టల మీద నెత్తురు ఉంది. ఈ దృశ్యమును చూసి ఆమె గొల్లుమని ఏడుస్తోంది. సుదేహ గబగబా లోపలి వెళ్లి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ ఘృష్ణ ఏడవదే అని చూస్తోంది. ఘ్రుష్ణ మామూలుగా శివార్చన చేస్తోంది. ఆవిడ ఎవడు బిడ్డను ఇచ్చాడో వాడు ఆ బిడ్డకు రక్షకుడు. వాడిని ఆయన రక్షిస్తాడు. అని శివలింగాలకు పూజ చేసి తదుపరి ఆ పూజచేసిన శివలింగములను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగములు ఆ నీటి మీద తేలుతూ కనపడ్డాయి. చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ అనలేదు. ఈ దృశ్యమును చూసి శివుడు తట్టుకోలేక పోయాడు. అదీ విచిత్రం. ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగా నీ పూజకు శివుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అని చెప్పాడు. ఆవిడ నాయనా, నిన్ను కాపాడిన వాడు మహాకాలుడు. ఆయనే తీసుకెళ్ళ గలడు. ఆయనే బ్రతికించగలడు. ఆయన నిన్ను రక్షించాడు అంది. కానీ తల్లియైన ఘృష్ణ ‘నాయనా నీవు మాట్లాడేది తప్పు. పెద్దమ్మను అలా అనకూడదు. ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు. ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపము మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతోంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక మూడు కన్నులతో త్రిశూలం పట్టుకుని ఘృష్ణా, ఈ త్రిశూలంతో నీ అక్కను పొడిచేస్తాను’ అని అన్నాడు. ఆవిడ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. కాబట్టే నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది అంది ఆవిడ. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత! నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకమునకు తెలుసు. ఈశ్వరా నీ పాదముల యందు భక్తిని నాకు కృప చెయ్యి. మా అక్కవలన కదా నాకు కొడుకు కలిగాడు. మా అక్క వలన కదా నాకు నీయందు పూనిక కలిగింది. ఈ ఔదార్యమును ఇలా అనుగ్రహించు’ అంది. ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న అంతటి శివుడు చేష్టలుడిగి నిలబడి సరే నేను నీకు కనపడ్డాను కనుక ఏదేని ఒక కోరిక కోరుకోవలసింది అన్నాడు. ఆమె ‘అయితే ఒకటి అడుగుతాను. ఏ నీటిలో పడిపోయిన పిల్లాడిని రక్షించావో, ఏ నీటిలో రోజూ నూటొక్క లింగములు తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగంగా వెలవవలసినది. నీ దగ్గరకి వచ్చి నమస్కరించిన వాళ్ళందరిని ఇలాగే కాపాడు’ అన్నది. అపుడు శివుడు ‘తప్పకుండా అలాగే చేస్తాను. నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగంగా ఉంటాను. నీపేరు మీద ఘృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు గొప్ప భక్తురాలవు. ఇక్కడకు వచ్చినపుడు అందరూ నిన్ను తలచుకోవాలి. ఒక్కసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈశ్వరుడి ఔదార్యం ఘృష్ణవలన గుర్తురావాలి. నా ఔదార్యం ప్రకటితం అవడానికి కారణం నువ్వు. కాబట్టి నిన్ను తలచుకుని నన్ను తలచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు ఘృష్ణేశ్వరుడు’ అని ఘృష్ణేశ్వరుడై అక్కడ వెలిశాడు. 

పిమ్మట శివుడు ‘ఘృష్ణా, నూటొక్క తరాలు నీవంశంలో చెప్పుకోదగిన మహా భక్తులయిన వారు కుమారులుగా జన్మించి వెడుతుంటారు. అలా నీకు వరం ఇస్తున్నాను. మీ అక్కకు గల దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఈవేళ నుంచి నాకు మహా భక్తురాలయిపోతుంది’ అన్నాడు. వీటన్నింటిని ఘృష్ణ అడగలేదు. కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు అన్ని వరములను ఇచ్చేశాడు. కాబాట్టే ఈశ్వరుడిని నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు.



శివపురాణం - 20 వ భాగం



అరుణాచలేశ్వరుడు 

మనకి అష్టమూర్తి తత్త్వము అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యాజమాన లింగం – ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.

అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర. అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది. కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.

అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు. అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.

మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు. 
దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!

స్మరణము మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం. ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలం. అచలము అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది. ఆకొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గురి ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు. అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి. ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది. 

ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగాస్థానం. కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి. 

అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు. అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. 

మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది. అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు. 

అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పడికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను. నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.

అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది. ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమయిన క్షేత్రం. 

ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది. ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది. పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.

అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు. లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.

అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు. శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది. ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము. స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే. అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రామించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ. అమ్మ అయ్య కలిసినది అరుణాచలం కొండ. భగవాన్ రమణుల మూర్తి ప్రతి ఇంట ఉండాలి. అందరం తిరువణ్ణామలై వెళ్ళాలి. అందరం గిరి ప్రదక్షిణం చేయాలి. మన పిల్లలకి అటువంటి మహాపురుషుని గురించి చెప్పాలి. సూరినాగమ్మ లేఖల పుస్తకం తప్పకుండా ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ పుస్తకం సులభశైలిలో ఉంటుంది. రమణులు ఎప్పుడెప్పుడు ఏమి మాట్లాడారో ఆ పుస్తకంలో చదువుతుంటే మీరు రమణాశ్రమంలో ఉన్నట్లుగా ఉంటుంది. రమణుల అనుగ్రహమును మనం పొందుతాము.



శివపురాణం - 21 వ భాగం



విభూతి ధారణ అనేది శివపురాణాంతర్గతమైన విషయం. ఆరాధన చేసేటప్పుడు శౌచముతో పూజామందిర ప్రవేశం జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు 
వినా భస్మత్రిపుండేన వినా రుద్రాక్షమాలయా 
బిల్వపత్రం వినానైవ పూజయేచ్ఛం కరం బుధః!!

సాధ్యమయినంతమటుకు ఈమూడూ లేకుండా పూజ జరుగకుండా చూసుకోవాలి. భస్మము అనగా తేలికగా చెప్పాలంటే బూడిద. దానిని మూడు గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. శివలింగం మీద ఆజ్ఞాచక్రం మీద బొటనవేలితో బొట్టుపెట్టే అధికారం ఒక్క గురువుకు మాత్రమే ఉంటుంది. స్త్రీలయినా, పురుషులయినా లలాటమునందు విభూతిని మూడు గీతలుగా మాత్రమే పెట్టుకోవాలి. విభూతిని పెట్టుకోకుండా ఉండరాదు. రుద్రాక్షమాల వేసుకోకుండా పూజ చేయరాదు. బిల్వపత్రం లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను కొన్ని రోజులపాటు నిల్వచేసి పూజ చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటితో పూజ చేయాలని పండితులయిన వారు జ్ఞానమున్న వారు భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు. 

శాస్త్రమునందు శివనామము గంగ. విభూతి యమునా. రుద్రాక్ష సరస్వతి. గొప్ప శివభక్తుడు లలాటమునందు త్రిపుండ్రములను ధరించిన వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాల వేసుకుని శివపూజ పూర్తిచేసి బయటకు వచ్చిన వ్యక్తిని పూజామందిరంలోంచి బయటకు రాగానే చూస్తే చూసిన వారికి త్రివేణీసంగమ స్నానాన్ని చేసిన ఫలితమును ఆయన ఖాతాలో వేస్తారు. ఈమూడింటిని శరీరం మీద వేసుకుని ఉండడం వలన అంత గొప్పతనం కలుగుతుంది. 

నుదుటిమీద భస్మమును ఎలా బడితే అలా పెట్టుకోకూడదు. శాస్త్ర నియమం ప్రకారం మీరు నిద్రలేచిన తరువాత స్నానం అయేవరకు యథార్థమునకు పచ్చిగంగ త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాల పద్ధతులు వచ్చాయి. అయితే కొన్ని కారణముల చేత కొంతమంది స్నానం చేయకుండా నీటిని త్రాగవలసి రావచ్చు. అలా తీసుకుంటే ఆ పాపం గాయత్రి చేత సాధ్యమయినంత తొందరగా పోతుంది. గాయత్రికి అధికారం లేనివాడు తమ ఇష్టదేవతానామం చెప్పి పూజ చేసుకోవాలి. విభూతి ధారణా చేసేవారు స్నానం చేయకుండా ఎక్కడికో అత్యవసరంగా వెళ్ళవలసి వచ్చిన సందర్భంలో వారు పొడి విభూతిని తీసుకుని లలాటమునందు దరించవచ్చు. పొడి విభూతిని ధరించడం వెనుక ఒక రహస్యం ఉంది. స్నానం చెయ్యనంత వరకు శరీరమునకు అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్న శరీరం తొందరగా వ్యగ్రత కలిగిన ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణహేతువు ఉండాలి. అందుకని విభూతి పెట్టుకోవాలి. చాలామందికి విభూతి పెట్టుకున్నవాళ్ళందరూ శైవులు అని ఒక దురభిప్రాయం ఉంటుంది. అది సరికాదు. విభూతి వేదప్రోక్తంగా చెప్పబడిన విషయం. ఎవరయినా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు ఎవరైనా అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉంది. స్నానం చెయ్యకుండా వెళుతున్నా పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళవచ్చు. తడి విభూతిని పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని పొడి చేసి ఎడమచేతిలో వేసుకుని దాంట్లో రెండు మూడు నీటి చుక్కలు వేసి ఎడమ చేతిలో వేసిన విభూతి మీద కుడిచేతిని మూత పెట్టాలి. అలా పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగే గొప్ప మహాత్మ్యమును గురించి శబ్దశక్తిచేత మీరు దానిని అనుసంధానం చేయాలి. 

భూతిం భూతకరీ, పవిత్ర జననీ పాపౌఘ విధ్వంసినీ 
సర్వోపద్రవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ 
భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణీ 
తేజోరాజ్య విశేష మోక్షణకరీ భూతి స్సదా ధార్యతామ్!!

అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది మీ శరీరమునకు అలది ఉండగా భూతప్రేతపిశాచరాక్షస గణములు మీ ఇంట ప్రవేశించలేవు. తేజస్సును ప్రసాదిస్తుంది. విశేషమయిన ఐశ్వర్యమును ఈయగలదు. మోక్షమును ఇవ్వగలదు. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. బ్రహ్మచారి అయితే సాధ్యం అయినంత వరకు 

“ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్” అన్న మంత్రం చెప్పి సజలవిభూతిని ధరించాలి. ఇవేమీ చేతకాకపోతే తేలికైన మార్గం ఒకటి ఉంది. కుడి చేతిని ఎడమ చేతి మీద వేసి 
శ్రీకరంచ పవిత్రం చ శోకమోహ వినాశనం లొకవశ్యకరం చైవ భస్మం త్రైలోక్య పావనం”

అని చెప్పాలి. దీని ధారణ చేత ఐశ్వర్యం కలుగుతోంది. ఇది నన్ను పవిత్రుడిని చేస్తోంది. ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకము వశం అయ్యేటట్లుగా చేస్తోంది. ఇది నాకు పుణ్యమును ఇస్తోంది. ఇదేదో వశీకరణ విద్య లాంటిది అని అనుకోకూడదు. లోకము యథార్థ స్థితి మీకు భాసిస్తుంది. పరమ పావనమైన ఈ భస్మమును నేను ధరించుచున్నాను. 

ఒకవేళ ఈ మంత్రం రాకపోతే కనీసంలో కనీసం ‘శివా శివా శివా’ అని మూడు మాట్లు అనాలి. ఆటే మంగళము, శోభనము, భద్రము క్షేమము, కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్లు అవుతుంది. ఈ మాటలు చెప్పి విభూతిని మూడు వేళ్ళతో పెట్టుకుంటారు. అలా విభూతి ధారణ చేయరాదు. అది దోష భూయిష్టం. నీటియందు భస్మము తడిపి మృగముద్ర పట్టమని శాస్రం చెప్పింది. మృగముద్రను జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏ లేడి/జింక కొమ్ములతో నిలబడ్డట్లుగా కనపడుతుంది. మూడువేళ్ళు కలుస్తాయి, రెండు వేళ్ళు నిలబడతాయి. ఇప్పుడు తడి భాస్మంలో ముందుగా మధ్య వేలును ఉంగరపు వేలును ముంచుతారు. తరువాత బొటన వేలును ముంచుటారు. తర్వాత కుడివైపు నుండి ఎడమ వైపుకి బొటనవేలు పట్టగలినంత దూరం విడిచిపెట్టి నుదుటిమీద ప్రయాణం చెయ్యాలి. అపుడు బొటన వెలికి సజల విభూతి ఉన్నది కదా – ఆ రెండు వేళ్ళు గీసిన విభూతి రేఖల మధ్యలోంచి విభూతితో కూడిన బొటనవేలును లలాటం మీద రాస్తూ వెనక్కి తీసుకురావాలి. దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు. 

భస్మధారణము అనేది మనుష్యుని జీవితమును కొత్త దారికి తిప్పగలిగిన ఒక విశేషము. మనకి వాసనలు కొని జన్మల నుండి తరుముకు వస్తాయి. విభూతి ధారణ చేస్తే మీకు ఉన్న వాసనా బలమును గెలవగలిగిన శక్తిని ఈశ్వరుడు ఇస్తాడు. పాపక్షయం అంటే ఇదే. శాస్త్ర ప్రకారం ‘భ’ భస్మ ధారణము పాపములను తీయగలదు. మీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుడిని చేరకుండా భోగముల వైపుకి తిప్పెస్తున్నాయి. అధర్మబద్ధమయిన భోగముల కోసం వెంపర్లాడుతుంటారు. అలా వెంపర్లాడకుండా చెయ్యగల్గినది ‘సమ’ భగవంతుడిని స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు ‘భస్మ’. భస్మం రెండు రకములుగా తయారవుతుంది అని శాస్త్రం చెప్పింది. ఒకటి మహా ప్రళయమునందు ఏర్పడే భస్మం. ఆ భస్మం దరించడానికి మనం ఉండము. ఆ సమయంలో లోకములన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమయిన భస్మం. ఆవు పేడను పట్టి జాగ్రత్తగా కాల్చి దానిని విభూతిగా తయారుచేస్తే తేలిక అయిన భస్మం తయారు అవుతుంది. అది మనకి శ్రీశైల దేవస్థానం వారు పలకల పలకల ఉండలుగా చేసి అమ్ముతారు. ఆవుపేడను కాల్చినపుడు వచ్చిన భస్మం చాలా గొప్ప భస్మం. భస్మమును లలాటమునందే ఎందుకు ధరించాలి అంటే బ్రహ్మ నుదుటి మీద రాసిన రాత పోదు అని మనం నమ్ముతాము. కానీ ఆ రాతను పోగొట్టగల శక్తి భస్మానికి ఉన్నది. నుదుటిమీద పెట్టుకున్న భస్మ రేఖలను త్రిపుండ్రములు అని అంటారు. భస్మం పవిత్రమయినది సమస్త దోషములు పోయినపుడు మాత్రమే ఏదయినా పవిత్రం అవుతుంది. ఏదయినా వస్తువు అగ్నికి తగిలినట్లయితే అది శుద్ధమైపోతుంది. విభూతి అగ్నిసంపర్కం కలిగినది. దానిని ధరిస్తే మీయందు జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది. 

శివలింగమునకు అభిషేకం ప్రారంభం చేసేముందు పంచ బ్రహ్మ మంత్రములతో పొడి విభూతిని శివలింగం మీద వేస్తారు. ఏ చెట్టునుండి ఎన్ని పువ్వులను కోయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండంలో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితం పొడి భస్మంతో అభిషేకం ప్రారంభించిన వాడి ఖాతాలో వేసేస్తారు. విభూతిని తడిపి ఆ విభూతితో శివలింగమునకు అభిషేకం చేస్తే తెల్లటి విభూతి ధారా శివలింగం మీదనుండి క్రిందపడగానే ఈయన పాదములన్నీ హరిస్తాయి. శివలింగం మీదినుండి జారిన ఆ విభూతిని గాని పెట్టుకుంటే అపారమయిన తేజస్సు ఉద్భవించి ఈశ్వరాభిముఖుడు అవుతాడు. స్కాందపురాణం బ్రహ్మోత్తర ఖండంలో ఒక బ్రహ్మరాక్షసుడు విభూతి పెట్టుకున్న వ్యక్తిని వచ్చి పట్టుకున్నంత మాత్రం చేత ఆ రాక్షసునికి శాపవిమోచనం అయిపొయింది. ఆయన భస్మం అలా పెట్టుకున్నాడు. అంత ఉపాసనా బలంతో పెట్టుకున్నాడు. కాబట్టి భస్మం అంత గొప్పది. 


శివపురాణం - 22 వ భాగం CLICK HERE

Popular Posts

Popular Posts

Ads