Search This Blog

***

Girl in a jacket
"ఓం నమశ్శివాయ:" "ఓం వాసుదేవాయనమః" " శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణవే "

బాసర... సరస్వతి ఆలయము Basra ... Saraswati Temple:

బాసర... సరస్వతి ఆలయము:
మానవులకు విజ్ఞాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతి కొలువైన దివ్య క్షేత్రం బాసర. ఆదిలాబాద్‌ జిల్లాలో గోదావరి ఒడ్డున కొలువైన ఈ క్షేత్రం ప్రస్తుతం అభివృద్ధి చెందుతూ భక్తులను ఆకర్షిస్తోంది. తమ పిల్లలకు భవిష్యత్‌లో అపారమైన విజ్ఞానం సొంతం కావాలని కోరుతూ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టే తల్లితండ్రులతో ఈ బాసర క్షేత్రం నిత్యం కళకళలాడుతుంటుంది. 
బాసర క్షేత్రం విశేషాలు:
బాసరలో వెలసిన ఈ క్షేత్రం పురాతనమైన ప్రాముఖ్యాన్ని కల్గిఉంది. బాసర క్షేత్రంలో కొలువైన సరస్వతీదేవిని వ్యాసుడు ప్రతిష్టించాడని ప్రతీతి. అలనాడు వ్యాసుడు తల్లి ఆశీసులతో తపస్సు ప్రారంభించాడు. అయితే ఎన్ని ప్రాంతాల్లో తపస్సు చేసినా ఆయనకు తపో నిష్ట కల్గలేదంట. 
దీంతో ఆయన గోదావరి నది ఒడ్డున ఉన్న సరస్వతీ క్షేత్రాన్ని చేరుకుని తపస్సు ప్రారంభించాడట. ఆయన తపస్సు ఫలించి సరస్వతీ దేవి ప్రత్యక్షమై తనను అదే క్షేత్రంలో ప్రతిష్టించమని కోరిందట. దీంతో వ్యాసుడు ఆ తీర్థానికి కొద్ది దూరంలో సరస్వతీదేవిని ప్రతిష్టించాడట. వ్యాసుడు ప్రతిష్టించిన కారణంగా ఈ క్షేత్రాన్ని వ్యాసపురగా పిలిచేవారట. 
కాలగమనంలో వ్యాసపురనే బాసరగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే పురాణకాలంలో నిర్మించబడిన ఆలయం దండయాత్రల కాలంలో ధ్వసం కావడంతో శృంగేరీ పీఠాధిపతి ఆలయాన్ని పునర్నించి అమ్మవారిని పునఃప్రతిష్టించారట. ప్రస్తుతం బాసరలో ఉన్నది ఆ ఆలయమే. 
దేవాలయం విశేషాలు:
బాసరలోని సరస్వతీ దేవి ఆలయం విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడి ఉంది. బాసర గ్రామం చిన్నదైనా ఆలయం మాత్రం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆలయానికి కొంత దూరంలో గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ నదిలో స్నానం చేసి నదికీ సమీపాన ఉన్న శివుని భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీ. 
గోదావరీ పుష్కరాల కారణంగా బాసర క్షేత్రం ఇటీవల ప్రముఖ క్షేత్రంగా అభివృద్ధి చెందుతోంది. ఆలయ ప్రాగణంలో ఇంద్రేశ్వరం, సూర్యేశ్వరం, వాల్మీకేశ్వరం, తరణేశ్వరం, కుమారేశ్వరం, వ్యాసేశ్వరం తదితర ప్రదేశాలు ఉన్నాయి. ఎంతో ప్రశాంతమైన ఈ ఆలయప్రాంగణంలో ఓ రోజంతా గడపగల్గితే అద్వితీయమైన అనుభూతి మన సొంతమౌతుంది. 
రవాణా, వసతి సౌకర్యాలు:
బాసర క్షేత్రం రాష్ట్ర రాజధాని నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు, రైలు మార్గాల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. బాసరలో వసతి సౌకర్యాలు సైతం చెప్పుకోదగ్గ రీతిలోనే ఉన్నాయి. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వసతి గృహాలతోపాటు రాష్ట్ర టూరిజం శాఖకు చెందిన వసతి గృహాలు కూడా ఉన్నాయి.
వీటిలో అద్దె కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంటుంది. భోజనం తదితర అవసరాలకు అనువుగా హోటళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 
బాసర, ఆదిలాబాదు జిల్లాలోని పుణ్యక్షేత్రం మరియు ముధోల్ మండలానికి చెందిన గ్రామము. బాసర, నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రము ఉన్నది. భారత దేశంలో గల రేండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది. బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్టించినట్లు చెప్పుచుందురు. కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన 'బాసర' గా నామాంతరాన్ని సంతసించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని ఘాడంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్టించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి మార్బుల్ శిల ఉన్నాయి. మంజీరా మరియు గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది ఒకటని విశ్వసించబడుతుంది.
ఆలయ విశేషాలు
ఆలయం ప్రాంగణంలో ఉన్న జ్ఞానప్రసూనాంబ
బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్టితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.
ఎలా వెళ్ళాలి:
హైదరాబాదు-మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉన్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి, మరికొన్ని సమీప పట్టణాలనుండి (నిర్మల్, నిజామాబాద్ మరియు భైంసా) బస్సు సౌకర్యం ఉన్నది. నిజామాబాద్ నుండి బాసరకు 40 కి.మీ. దూరం. నిర్మల్ పట్టణానికి 35 కి.మీ. హైదరాబాదుకు సుమారు 205 కి.మీ. దూరం. హైదరాబాద్ - మన్మాడ్ మార్గంలో బాసర స్టేషన్ ఉంది.
ప్రధాన దేవాలయానికి తూర్పు భాగమున ఔదుంబర వృక్షఛాయలో దత్త మందిరం, దత్త పాదుకలు ఉన్నాయి. మహాకాళీ దేవాలయం పశ్చిమ భాగమున నిత్యార్చనలతో చూడ ముచ్చటగా ఉంటుంది. శ్రీ వ్యాస మందిరం దక్షిణ దిశలో ఉంది. ఇందులో వ్యాస భగవానుని విగ్రహము, వ్యాస లింగము ఉన్నాయి.
మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉన్నది. ఇది నరహరి మాలుకుడు తపస్సు చేసిన స్థలమంటారు. అక్కడ "వేదవతి" (ధనపు గుండు) అనే శిలపై తడితే ఒక్కోప్రక్క ఒక్కో శబ్దం వస్తుంది. అందులో సీతమ్మవారి నగలున్నాయంటారు. ఇక్కడికి దగ్గరలో 8 పుష్కరిణులున్నాయి. వాటి పేర్లు - ఇంద్రతీర్ధం, సూర్యతీర్ధం, వ్యాసతీర్ధం, వాల్మీకి తీర్ధం, విష్ణుతీర్ధం, గణేషతీర్ధం, పుత్రతీర్ధం, శివతీర్ధం.
ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకు సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా పూజ జరుపుతారు. సాయంకాలం ఆరు గంటలకు పూజ జరుగుతుంది. ఈ ఆలయానికి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా. మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలనుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యముగా విద్యా ప్రాప్తికై ఇక్కడ విద్యార్ధులతో అక్షరాభ్యాసము చేయించి దేవికి పలక, బలపము, కాగితము, కలము వంటి కానికలు సమర్పించే ఆచారము ఉన్నది. కేశ ఖండనము, ఉపనయనము, వివాహాలు, భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. దర్శన వేళలు :- ఉదయము 4 గంటలకు ఆలయద్వారాలు తెరచి 4 గంటల నుండి 4.30 గంటల వరకు అభిషేకము టిక్కెట్లను ఇస్తారు.

Popular Posts

Popular Posts

Ads